Tuesday, March 10, 2009

వ్యాసుడూ -Vs - ఆది శంకరులూ

వ్యాసుడూ -Vs - ఆది శంకరులూ - ఆమ్మవారి వర్ణన.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అసలు విజయవాడ లో దుర్గమ్మవారి అలంకరణ లో కిటుకు ఏమిటో తెలియదు కానీ ఆవిడ నవ్వు మాత్రం బిలియన్ డాలర్ స్మైల్ కి కొన్ని వందల రెట్లు ఉన్నట్టు ఉంటుంది.

ఆదివారం అనుకొకుండా దర్శనం చాలా బాగ జరిగింది. వీలున్నత దగ్గర గా చూడచ్చు కదా అనే స్వార్ధం తో 50 రూపాయల టిక్కెట్టు తీసుకుని వెళ్ళా. క్యూ లో లలితా సహస్రనామం చదువుకుంటూ వెడుతూంటే, ఒక్కొక్క నామం వర్ణన ముమ్మూర్తులా కళ్ళ ఎదురు గా ఉన్నట్టు కనిపించింది అమ్మవారిని చూస్తూంటే. బయట కూర్చుని లలితా పారాయణ అయ్యక సౌందర్య లహరి చదువుకుంటే ఆలొచన ఒకటి మెరిసింది. భలే అనిపించింది. (ఇది ఇంతక ముందే అందరికి గమనిక కి వచ్చి ఉండచ్చు, నాకు మాత్రం ఇప్పుడే 'యురేకా 'అయ్యింది.)
కురువింద మణి శ్రెణీ కనత్కొటీర మండిత తో మొదలుపెట్టి వ్యాసుల వారు నఖదీధితి సంచన్న నమజ్జన తమోగుణ, ఫదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా, శింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజా వరకూ వర్ణించారు. అంటే కురులతో మొదలు పెట్టి కాలి గోళ్ళు వరకూ అమ్మ వారి సౌందర్యం ప్రతీ అవయవాన్ని ఆవిష్కరించారు.

కళ్ళు మూసుకుని చదువుతూంటే, ఒక బొమ్మని / పటాన్ని క్రమం గా ఉన్మీలనం చేస్తున్నట్టు పై నుంచీ కింద వరకూ వర్ణన ఉంటుంది. చూడండి కావాలంటే...కురులు, విశాలమైన నుదురు, కళ్ళు, ముక్కు, ముక్కు పుడక, చెవులు, చెవులకి దుద్దులు, చెంపలు, చిరునవ్వు, చుబుకము, స్తనములూ, పాదాలూ, కాలి గోళ్ళు...

వ్యాసుల వారి వర్ణన ఇలా ఉంటే, శంకరుల వారు పాదాల నుండీ మొదలుపెడతారు.తనీయాంసం పాంసుం అని పాద రేణువుల తో మొదలు పెట్టరు.

ఒకరు ఆరోహణ క్రమం లో చెబితే ఒకరు అవరోహణ క్రమం లో చెప్పారు (అనిపించింది).

తెలిసిన వారు దీని పై ఇంకొంచం వివరణ/ సమాచారం/జ్ఞానం ఇస్తే బాగుంటుందని అనిపించి సాదరం గా వారిని ఆహ్వానిస్తున్నా.

సందర్భం వచ్చింది కాబట్టి మరో మాట. పని లో పని గా ఆమ్మ వారి పై నేను రాసుకున్న ఒక పద్యం.

నాకు సౌందర్య లహరి లో జ్ఞానం బహు తక్కువ. సౌందర్య లహరి లో ప్రతి శ్లోకానికీ బోలెడంత అంతరార్ధం ఉన్న మాట నేనూ విన్నాను. కొంచం తెలుసుకునే ప్రయత్నం చేసాను.

ఎందుకో నిన్ను కూడి ఉన్నప్పుడు సమస్త సృష్టినీ చేయగల సామర్ధ్యం కలిగినవాడౌతాడు శివుడు. నీవు లేకున్నచో వేలు కూడా కదపలేడు. బ్రహ్మ విష్ణు శివాదులచే కొలువబడే అట్టి నిన్ను కీర్తించగలుగు వాడు అకృత పుణ్యుడెత్లగును? అన్నది మిగిలిన శ్లోకాలలో అమ్మవారిని కీర్తిస్తునట్టు గా కీర్తించినట్టు అనిపించలేదు.

తప్పేనని తెలుసినా అదేదో ఫల శృతి ముందు గా చదివినట్టు అనిపించింది. (నా దృష్టి లో), అందుకే శ్లోకం లో స్ఫూర్తి మాత్రం తీసుకుని నేను రాసుకున్న వేరే పద్యం.

ముందే చెప్పేస్తున్నా... సంస్కృత శ్లోకానికీ దీనికీ ఎక్కడా సంబంధమూ/ పోలికా లేనే లేదు.


లోకమ్ముల్ సృజియింపగన్ ముడిపదార్ధంబెద్ది అవ్యక్తుకున్ !
లోకారాధ్య త్రిమూర్తి సన్నుత పదాబ్జంబెద్ది శ్రేయమ్మిడన్ !
శ్రీ కైవల్య పదంబు చేరుటకు తేజో మార్గమై వెల్గు ఆ
హ్రీంకారాసన గర్భితానల శిఖన్, కీర్తింతు వాగర్ధులన్.

ఏదో కలిపి కొట్టరా కావేటి రంగా అన్నట్టు మూలానికీ సంబంధం లేకుండా రెండు మూడు జొప్పించినట్టు అనిపించవచ్చు. నేను ప్రయత్నం చేసి జొప్పించినదెమీ లేదు. దుర్గా దేవి చీకటి లో దారి చూపే వెలుగు(to mark the light in darkness) అనీ శ్లోకం చదువుతున్నప్పుడు అప్రయత్నం గా నాకు తట్టిన భావం ఇది.