Wednesday, June 17, 2009

రాముడూ - స్ఫూర్తి -9 - కోతులు

ఏ రోజుకారోజు శబరి అనుకునేదిట- రాముడు ఈరోజు వస్తాడేమో, ఎన్నింటికి వస్తాడో, ఎంత ఆకలితో వస్తాడో ఏమో అని ప్రతి రోజూ రాముడి కోసం అడవంతా తిరిగి, నేలపై రాలి ఉన్న పళ్ళను ఏరుకుని వచ్చేది. ఏ పళ్ళు తియ్యగా ఉన్నాయి , ఏ పళ్ళు పుల్లగా ఉన్నాయి అని చూసి సిద్ధంగా ఉంచేది. రాత్రి వరకూ చూసి పడుకునే ముందు ఇంక రేపు వస్తాడేమొ అనుకుంటూ నిరీక్షణతోనే కాలం వెళ్ళబుచ్చేది. తెల్లారిన తర్వాత మళ్ళీ అదే పని..అడవంతా తిరిగటం, నేలపై రాలి ఉన్న పళ్ళను ఏరుకుని రావటం...

అయితే రాముడి కోసం తెచ్చిన పళ్ళు గుట్టలు గుట్టలు గా ఆశ్రమం లో పడి ఉండేవి కదా వాటితో అడవిలో జంతుజాలానికి యమ సంబడంగా ఉండేదిట. ముఖ్యం గా కోతులకి. కష్టపడి అడవంతా తిరిగి చెట్లమ్మటా పుట్లమ్మటా వెతుక్కుని తినక్కర్లేదు కదా అని కోతులు, చిలుకలూ, మిగిలిన పక్షులూ ఆ పళ్ళ గుట్ట ల దగ్గరే కాపురం ఉండేవిట. రాముడి కోసం తెచ్చిన పళ్ళు మీరెందుకు తింటున్నారు అని ఆవిడ అడిగేది కాదు. తల్లి కదా... పిల్లలు కడుపు నిండా తింటే సంతోషించేది.

అలా ఆశ్రమం లో కాలక్షేపం చేస్తున్నప్పుడు రాముడి గురించి శబరి అనుక్షణం తలచుకునేవన్నీ వినేవారుట. ముసలావిడ కదా.. వార్ధక్యం.. అందునా ఒంటరి గా ఎదురుచూసేది. తనలో తాను మాట్లాడుకోవటం.. చుట్టూ చేరిన జంతు జాలంతో మాట్లాడడం .. దీనితో వాళ్లకి కూడా రాముడి తో పరోక్ష బంధం ఏర్పడి పోయిందిట... ఎంతగా అంటే.. వీళ్ళందరూ కూడా ఆవిడకి మల్లే రాముడి కోసం ఎదురుచూడటం...రాముడే ధ్యాస, రాముడే ధ్యానం గా అయిపోయారుట. అందుకే ఆవిడ కూడా రాముడితో నీ కోసం నిరీక్షణ చేస్తూ, నీకై తపించే వానరులున్నారు. అలా ముందుకి వెళితే తారస పడతారు వారు నీకు సహాయపడతారు అని చెప్పిందిట. (recommendation....)

అయితే అలా అప్పనంగా తిన్న పళ్ళ కు కృతజ్ఞతగా ముసలావిడ మర్నాడు అడవికి వెళ్ళేప్పటి కి పళ్ళు పండినాయో లెదో చెట్టు మీదే రుచి చూసి చెప్పేవిట చిలుకలు. చెట్లన్నిటిపై గెంతి పండిన పళ్ళు నేలరాలేట్టుగా చేసేవిట కోతులు.

ఇంతకీ ఆ అలవాటు తోనే అప్పటి నుండీ ఇప్పటి దాక కూడా కోతులు చెట్లపై కుప్పిగంతులు వేస్తూనే ఉన్నాయి....చిలుకలు రామచిలుకలై జామ పళ్ళను చిలక్కొట్టుడు కొడుతూనే ఉన్నాయి...

(శబరి 'రామా రామా ' అని ప్రతీ దానికీ తలచుకోవటం చూసి చిలుకలు కూడా 'రామా రమా ' అనటం నేర్చుకుని రామచిలుకలు అయ్యాయి. ఆవిడ రుచి చూసి పెట్టటం చూసి అవీ అలానే చేస్తున్నాయి)

పలుకు పలుకులందు పలుమారు దలపోసి
చిలుక లాయె రామ చిలుక లట్లు.
అనుకరించు నేర్పు అలవాటు గా నయ్యి
పక్షి జూడ సాగె పండ్ల రుచులు.

'తిన్న ఇంటి ఋణము' తీర్చుకొనగనెంచి
కోతులెగుర సాగె కొమ్మలందు
పండ్ల కొరకు వెదుకు పనిలేని రీతిలో
సాయపడిరి గాదె శబరికిట్లు.

స్ఫూర్తి:
యాదగిరిగుట్టలోనూ, అన్నవరంలోనూ క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి. బహుశా అందుకే నేమో అక్కడ ఎప్పుడూ బోలెడన్ని కోతులు ఉంటూంటాయి. దర్శనం కోసం మేము వరుసలలో నిలబడి ఉన్నప్పుడు కోతులు కుప్పిగంతులు వేస్తూ చెట్లనీ, కొయ్య స్తంభాలనీ కుదిపేస్తూ వీరంగం వేస్తూంటే తట్టిన ఆలోచన.