Tuesday, December 14, 2010

విష్ణు సహస్ర నామ శతకాలు

అదేమిటి? ఇదేదో అప్పుతచ్చు లాగా ఉందే అనుకుంటున్నరా?

"విష్ణు సహస్ర నామ"మని చెప్పి వాక్యమును పూరింపుము అనగానే ఎవ్వరైనా "స్తోత్రం" అని ఠక్కున సమాధానమిస్తారు. నేనూ అలాగే అనుకునేవాణ్ణి "బాలకవి", "శతావధాని" శ్రీ సంపన్ముడుంబ సింగరాచార్యులవారి కృతి గురించి తెలియనంత వరకే.

శంకర భగవత్పాదులు, మధ్వాచార్యులు, పరాశర భట్టరులు, భగవద్రామానుజులు, కంచి పరమాచార్యులు,కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులవారు మొ. ఎందరో మహానుభావులు ఈ స్తోత్ర రాజానికి భాష్యాన్నందించారు.

శ్రీ సంపన్ముడుంబ సింగరాచార్యులవారు  భగవద్గుణ ప్రతిపాదకములైన ఈ అనర్ఘమైన గ్రంథరాజానికి  పద్య వ్యాఖ్యానం అందించారు అదీ "నీవే గతి కృష్ణా దీనచింతామణీ" అనే మకుటంతో దశ శతకాలుగా....అంటే ఇది విష్ణు సహస్ర నామ స్తోత్ర పద్య సాహస్రం. అందులోనూ వ్యాఖ్యాన సహితం గా....

ఆంధ్ర దేశంలో పావన కృష్ణాతీరం లో జగ్గయ్యపేట ధనాచలం ప్రసిధ్ధ శ్రీవైష్ణవ క్షేత్రం. ఇక్కడి శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధి అపర శ్రీరంగం వలే భాసించింది. అలనాటి సుప్రసిధ్ధ నల్లాన్ చక్రవర్తుల, సంపన్ముడుంబై, మరింగింటి వంశస్థులు ఈ స్వామి వారికి కైంకర్యం చేస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలురుగా వన్నెకెక్కారు. సంగీత-సాహిత్య గోష్ఠులూ, అవధానములూ, చందనగోష్ఠులూ, తదీయారాధనలూ వెరసి "ఆ నిష్థా నిధి గేహసీమ.." అని ఆముక్తమాల్యదలో వర్ణించినట్టు శ్రీవైష్ణవ సిరి ప్రకాశించింది.

అట్లాంటి శ్రీమధ్ధనశైల సీతారమచంద్రులవారు శ్రీ సంపన్ముడుంబ సింగరాచార్యులవారి కులదైవం. ఆ ఆలయంలో అష్టోత్తరశత శిలాస్తంభ మహామంటపం ప్రతిష్ఠించిన మహోత్సవ సమయంలో తమ కులదైవం అనుగ్రహంగా ఒక్కొక్క నామానికీ ఒక్కొక్క పద్యం రచించాలని సంకల్పం కలగటం, శార్దూల, మత్తేభ విక్రీడితాలతో (వాటిలో ఇమడని నామాలను అదనం గా గీత, కందపద్యాలలో) రచించారు. వారు రచించిన కృతులలో  సంస్కృత భాగవతానుసారము "శ్రీభాగవతం", శ్రీ హరి శతకం, భ్రమర గీత, అవధూత గీత, భిక్షు గీత, శ్రుతిగీత, గోపికాగీత, రుద్రగీత మొదలగునవే  కాక సాత్రాజితీ పరిణయం, రుక్మిణీ కల్యాణం, ప్రహ్లాద చరితం మొ|| హరికథలూ ఉన్నాయి.

దీర్ఘ సమాస సమన్వితమైన పద్యాలనెంత హృద్యంగా రచించారో సరళతరమూ, అలంకారశొభితమూ అయినపద్యాలనూ అంతే రమ్యం గా రచించిన విద్వత్కవి శ్రీ సంపన్ముడుంబ సింగరాచార్యులవారు.

నాకు బాగా నచ్చిన ఈ సాహిత్య సేవను మీకూ పరిచయం చేద్దామని చిన్న కోరిక. వారి పద్యాలలో కొన్ని....

స్ఫారత రాగ సంకలిత జన్మజరామరణాది రూప సం
సార మహాసముద్ర శత సంగత దుఃఖ తరంగ పంక్తి బి
ట్టూరక ఈడ్చి కొట్టగడు నుక్కిరిబిక్కిరియై నరుండు త
త్తారక నామమున్ నుడివి తత్ క్షణమందు విముక్తినందెడున్

అభయాత్ముండన నొప్పుచుండుదువు నీవశ్రాంతమున్! కేవలా
నుభవానందమయ స్వరూపగుడవెందున్ నీకు నీ భూత భ
వ్య భవద్భూతచయంబు శేషమగుటన్ భాసిల్లెడిన్ "భూత భ
వ్య భవత్ప్రభ్వ"భిధాన మీవెగతి కృష్ణా ! దీన చింతామణీ !!

ఘనకారుణ్య సుధా తరంగములు పొంగం గాంక్షితార్థంబులున్
దనరన్ జేయుచునెట్టి యాపదయు జెంతంజేరనీ కర్మిలిం
గనుచున్ భారము బూని భూతవితతిన్ గాపాడుతన్ "భూతభృ
త్త"ని చెప్పంబడుచుండు నీవెగతి కృష్ణా ! దీన చింతామణీ !!

త్యక్తాన్య స్పృహులూర్జితాత్మ కులవిద్యా బంధ నిర్ముక్తులౌ
భక్త శ్రేష్థులకున్ నిరంతరము ప్రాప్య స్థానమై యొప్పుటన్
"ముక్తానాం పరమా గతి" స్త్వ మనుచున్ భూషించి భాషించు నా
సక్తిన్ వైదికవాణి నీవెగతి కృష్ణా ! దీన చింతామణీ !!

నీ రూపంభును నీ గుణ ప్రకరమున్ నీయద్భుతైశ్వర్యమే
పారున్ వాఙ్మనసాతి భూములగుచున్ స్వాత్మానుభూతిన్ మహో
దారున్ సూరలకిచ్చుటం "బురుష" శబ్దంబొక్క నీ యందు న
న్యారూఢంబుగ మెప్పు నీవెగతి కృష్ణా ! దీన చింతామణీ !!

పిడకలవేట: టపాల్లో మొత్తనికి అటుచేసి ఇటుచేసి హాఫ్ సెంచరీ అయ్యిందనిపించానోచ్చ్... అయితే ఉపయోగపడినవెన్నో అని అంతే మాత్రం...తత్తత్తా మెమ్మెమ్మే....

Thursday, November 4, 2010

సౌందర్యలహరి శ్లోకమూ - నా సందేహమూ...

కామేశ్వరరావుగారు "విజయదశమి శుభాకాంక్షలు" అంటూ సౌందర్యలహరి లోని రెండు శ్లోకాలకి అనువాద పద్యాలు చాలా సులభంగా ఇచ్చారు . అయితే అవి చూడగానే సౌందర్యలహరి లో అపరిష్కృతంగా ఉండిపోయిన ఒక చిన్నడౌటు మళ్ళీ బుర్ర దొలిచెయ్యటం మొదలెట్టింది.

100 శ్లొకాల సౌందర్యలహరిలో 1 వ శ్లోకమూ,100 వ శ్లోకమూ తప్ప మిగిలినవి అన్నీ అమ్మవారితో మాట్లాడినట్టూ లేదా అమ్మ వారిని వర్ణిస్తునట్టు అనిపిస్తాయి. ఈ రెండు మాత్రం వేరే ఎవరితోనో సంభాషిస్తున్నట్టు, వారికి సమాధానం ఇస్తున్నట్టు, లేదా తనను తాను సమర్ధించుకున్నట్టుగానో/  జస్టిఫికేషన్ ఇస్తున్నట్టు గానో అనిపిస్తాయి (నా పరిమిత జ్ఞానానికి)

"శక్తియుతుడైనప్పుడు శివుడు ఈ జగాలను సృష్టించగలుగుతున్నాడు. ఆ శక్తిలేకున్నచో ఒక వేలుకూడా కదపలేడు; అటువంటి హరి,హర, విరించి మొదలగు వారిచే ఆరాధింపబడే నిన్ను స్తుతించిన వాడు అకృతపుణ్యుడెట్లా ఔతాడు తల్లీ? (అంటే అవ్వడు, అవ్వలేడు అని భావం) ఇట్లాంటి భావాన్ని ప్రతిపాదిస్తున్నట్టున్న శ్లోకంతో సౌందర్యలహరి ప్రారంభించినట్లుంటుంది.

శంకరుల స్త్రోత్రాన్నో, వర్ణననో అర్థంచేసుకోటానికికూడా నా పురాకృతం సరిపోదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అయినా నాకొచ్చిన సందేహం తెలియజేస్తేనేగా నివృత్తి అయ్యేది. అందుకే సాహసం చేస్తున్నా.

ఈ శ్లోకంలో స్తుతింపబడుతున్న దేవత, ప్రతిపాదింపబడుతున్న సత్యమూ, వీటికీ అన్వయము చెబుతూ అసంపూర్ణంగా (లేదా అన్యాపదేశంగా) చేసిన ప్రశ్న అసంబధ్ధంగా ఉన్నదేమో అని నా భావం. అమ్మవారిని స్తుతిస్తున్నప్పుడు ఎవరికో సమాధానం చెబుతున్నట్టు/ జస్టిఫికేషన్ లాగా "కథం అకృత పుణ్యః ప్రభవతి?" అని ప్రశ్నించాల్సిన అవసరం ఏముంటుంది?

ఇది ఒకరకంగా తనని తాను ప్రశ్నించుకొని సమాధానపరచుకున్నట్టుగా కూడా అనుకోవచ్చు. ఏ శక్తి అయితే శివునితో కలిసి సర్వ జగత్కారణమవుతోందో, ఏ శక్తి చేత సృష్టి స్థితి లయమనే మూడు కార్యాలు నిర్వహించబడుతున్నాయో అలాంటి శక్తిని తాను స్తుతించబోతున్నాడు, వర్ణించబోతున్నాడు. దానికి తాను తగిన వాడా? అలాంటి సంకల్పం కలగడమే పుణ్యమని స్ఫురించి ఉంటుంది. ఎంతో పుణ్యం చేసుకోవడం మూలానే తానీ పని చెయ్యగలుగుతున్నానని నచ్చచెప్పుకున్నాడు అనుకోవచ్చు

అయితే  ఏ స్త్రోత్రాన్ని చేసేముందు తన మీద తనకి రాని డౌటు శంకరభగవత్పాదులకి అమవారిని స్తుతించే సౌందర్య లహరి లోనే ఎందుకు వచ్చి ఉంటుంది? ద్వైత, అద్వైత, విసిష్తాద్వైతాలను ఆకళింపు చేసుకుని తత్త్వ జ్ఞనాన్ని సంపాదించుకున్న శంకరులకు తన సామర్థ్యం అంటూ వెరె ఒకటి ఉంటుందని, అమ్మ వారిని స్తుతించటానికి అది సరిపోతుందా సరిపోదా అనే శంక కలగటం, అంతలోనే "కాదులే, ఇట్లాంటి అమ్మవారిని స్తుతించేటప్పుడు ఇంక అకృతపుణ్యుణ్ణి ఎట్లా ఔతాను" అని సమాధానం చెప్పుకోవటం సాధ్యమా? సంభావ్యమేనా?

ఇంకొకటి. సౌందర్యలహరి గురించి (చాగంటి కోటేశ్వరరావుగారు చెప్పిన ప్రవచనంలో అనుకుంటాను)... సాక్షాత్తూ పరమశివుడు తప్ప అన్యులెవరూ అమ్మవారి వైభవాన్ని అంత అద్భుతంగా చెప్పలేరు. ఆదిశంకరులు సాక్షాత్తూ కైలాసశంకరులే. కైలాసశంకరులు చెప్పిన సౌందర్యలహరిని ఆదిశంకరులు భూమిపైకి తెచ్చారు. దానిలో కొంత భాగం ఖిలమైపోగా ఆదిశంకరులు తానే పూర్తిచేసారు.ఒకవేల గనక కైలాసశంకరులే గనక కీర్తిస్తే వారికి సందేహం కలగటమా?



మరొకటి. శంకరుల ఏ స్త్రోత్రాన్ని చూసినా "తనను" గురించిన (లేదా తనవంటి భక్తుడి గురించిన) ప్రస్తావనతో మొదలు కాలేదు. స్తుతింపబడుతున్న దేవతనుద్దేశించి చేసినవే అన్నీను. సౌందర్యలహరిలో కూడా రెండవ శ్లోకం నుండీ అదే పంథా కనిపిస్తుంది. కానీ మొదటి శ్లోకంలో మాత్రం ఉపాస్య దైవం ప్రస్తావనతో పాటు 'స్వ' విచక్షణ లాగా అనిపిస్తుంది. అసలు ఇటువంటిది శంకరులంతటివారు చేసిన ఏ స్తుతిలోనూ ఇటువంటి ప్రతిపాదనలేదు.
కావాలంటే శివానందలహరి లో చూడండి.

కలాభ్యాం చూడాలంకృతశశికలాభ్యాం నిజతప:
ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే
శివాభ్యాం మస్తోకత్రిభువనశివాభ్యాం హృది పున
ర్భవాభ్యా మానందస్ఫురదనుభవాభ్యాం నతి రియం అనే శ్లోకం తో మొదలయ్యింది.

కనకధారా స్తోత్రం చూడండి.

సమునిర్మురజిత్కుటుంబినీం పద చిత్రైర్నవనీత కోమలైః
మధురై రుపతస్థివాం స్తవైర్ద్విజ దారిద్ర్య దశా నివృత్తయే అనే శ్లోకం తో మొదలయ్యింది.

ఒకవేళ స్తోత్రం "వందే వందారు" తో మొదలయ్యింది అనుకున్నా అదీ అత్యధ్భుతం గా అమ్మ స్తుతితోనే ఉంటుంది కానీ తను ఎంతడివాడు అన్నది ప్రపంచానికో, లేదా తనకి తానేనో చెప్పుకున్నట్టు ఉందదు. నా వరకు నాకు ఎన్ని భాష్యాలు చదివినా, ఆశ్లోకం అక్కడ అప్రస్తుతమేమో అనిపిస్తుంది. (చెంపలేసుకుని గుంజీళ్ళు తీశా ఈ మాట అంటున్నందుకు)...

మీరెవరైనా కారణం తెలిస్తే చెప్పగలరా... ప్లీస్ ...

దీపావళికి నే పేలుస్తున్న పెద్ద "లక్ష్మీ" బాంబు ఇదేనేమో????

Tuesday, November 2, 2010

పోతనవారి "కాపీ" పద్యాలు

పోతనామాత్యుణ్ణి కాపీకొట్టాడు అనటం భావ్యం కాదేమో కానీ పోతనను అంతగా ప్రభావితం చేసిన ఎఱ్ఱన వారి అనుసరణ, అనుకరణలతో పోతనకృతులు చూస్తూ ఉంటే....స్ఫూర్తిగొన్న పద్యాలనటం బావుంటుందేమో...

అసలు పద్యం 1: (నృసింహ పురాణం . 5-22)
వాసుదేవుని పాదవనరుహంబుల భక్తి
తగదను తండ్రియు తండ్రికాదు
వేదచోదితమైన విష్ణుధర్మమునకున్
గోపించు గురుడును గురుడుగాడు
భవదుఃఖముల మ్రాంప బ్రభువైన హరిసేవ
నెడలించు హితుడును హితుడుగాడు
వరయోగ మతమగు వైష్ణవ జ్ఞానంబు
వదలిన చదువును చదువు గాదు
కేశవాకార లీలలు గీలుకొని ము
దంబు బొందని తలపును తలపుగాదు
మాధవస్తోత్ర ఘన సుధా మధుర రుచుల
జిలుకకుండెడి జిహ్వయు జిహ్వ కాదు.

కొసరు పద్యం 1: (పోతన భాగవతం 7- 169)
కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు
శేష శాయి కి మొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు
పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి

దేవదేవుని చింతించు దినము దినము
చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు
కుంభినీధవు చెప్పిడి గురుడు గురుడు
తండ్రి హరిచేరుమనియడీ తండ్రి తండ్రి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


అసలు పద్యం 2: (నృసింహ పురాణం . 5-78)
కలడు మేదినియందు కలడుదకంబుల
గలడు వాయువునందు గలడు వహ్ని
గలడు భానుని యందు గలడు సోముని యందు
గలడంబరమున గలడు దిశల
గలడు చరంబుల గలడచరంబుల
గలడు బాహ్యంబున గలడు లోన
గలడు సారంబుల గలడు కాలంబుల
గలడు ధర్మంబుల గలడు క్రియల
గలడు కలవాని యందును గలడులేని
వానియందును గలడెల్ల వాని యందు
నింక వేయునునేల సర్వేశ్వరుండు
కలడు నీయందు నాయందు గలడు గలడు

కొసరు పద్యం 2 :  (పోతన భాగవతం 7- 274)

కలడంబోధి గలండు గాలి గలడాకాశంబునం గుంభినిం
గలడగ్నిన్ దిశలంబగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మ లం
గలడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులందంతటం
గలడీశుండు గలండు తండ్రి వెదకంగా నేల యీ యాయెడన్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

అసలు పద్యం 3: (నృసింహ పురాణం . 3-150)
కుడిచినపుడు నిద్రగూరినయప్పుడు
మేలుకొనిన యపుడు మెలగినపుడు
విష్ణు కీర్తనంబు విష్ణు చింతయు కాని
పలుకడొండు బుధ్ధి దలపడొండు

కొసరు పద్యం 3: (పోతన భాగవతం 7- 123)
పానీయంబులు డ్రావుచు న్ గుడుచుచున్ భాషించు చు న్ హాస లీ
లా నిద్రాదులు సెయూఛూన్ దిరుగుచున్ లక్షించుచున్ సంతతా
శ్రీ నారాయణ పాద పద్మ యుగళీ చింతామృతా స్వాద సం
ధానుండై మఱచెన్ సురారి సుతుడేతద్విశ్వమున్ భువరా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


అసలు పద్యం 4: (సోమనాధుని బసవ పురాణం లోని ద్విపద. 3 - 82)
క్షీరాబ్ధి లోపలక్రీడించు హంస
గోరునే పడియల నీరు ద్రావంగ(?
జూత ఫలంబులజుంబించు చిలుక
భ్రాతి బూరుగు మ్రాని పండ్లు  గన్గొనునె?
రాకామల జ్యోత్న దావు చకోర
మాకాంక్ష సేయునే చీకటి ద్రావ?
విరిదమ్మి వాసన విహరించు దేటి
పరిగొని సుడియునే ప్రబ్బిలి విరుల?

కొసరు పద్యం 4: (పోతన భాగవతం 7- 150)
మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికల దూగు
రాయంచ జనునె తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల జేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం
బరుగునే సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి నితరంబు చేరనేర్చు
వినుత గుణశీల మాటలు వేయునేల.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అనుసరణ పద్యాలన్నీ చిత్రంగా సప్తమస్కంధంలో ప్రహ్లాద చరిత్రలోనే ఉండటం, వాటికి స్ఫూర్తినిచ్చిన పద్యాలు నృసింహపురాణంలోవి కావటం వెనక కారణం బహుశా భాగవతంలోని ఆ కథా రచన చేసేముందు పోతనామాత్యుడు నృసింహపురాణాన్ని ఆస్వాదించి ఉంటాడేమో... అందుకే అట్లాంటి భావాన్నే చెబుదామనుకున్నప్పుడు పద్యం కూడా అట్లానే వచ్చేసి ఉండి ఉంటుంది. (ఇది నా ఊహ మాత్రమే సుమా ! )     

Wednesday, October 6, 2010

పద్యం అనుకరణ, అనుసరణ



Copy from one, it's plagiarism; copy from two, it's research --Wilson Mizner (1876 - 1933)


ఎకడమిక్స్ లో దీన్ని రిసెర్చ్ అంటారు, ఆర్టులో "స్ఫూర్తి" అంటారు :-) --'ఫలానా' కామేశ్వరరావు గారు. 


రవిగారు తమ బ్లాగాడిస్తా లో  పద్యం రాద్దామనే ఔత్సాహికులకు సూచనలు ఇస్తూ "ఇదివరకు ప్రముఖ కవులెవరైనా వ్రాసిన టెంప్లేటును వాడుకుని మీరు అందులో సబ్జెక్టు, కొన్ని పదాలు మార్చి, మీ పద్యంలా భ్రమింపజేయవచ్చు. ఇదొక ట్రికీ కళ. అలవడితే మాత్రం భలే రంజుగా ఉంటుంది" అన్నారు. దాన్నించి స్ఫూర్తి పొందినదే ఈ టపా.


పద్య రచనలో అనుకరణ, అనుసరణ వీటికి ఒక ప్రత్యేకత ఉంది. మనలను ప్రభావితం చేసిన వారి పంథాలో మనమూ నడిస్తే (ఇష్టం ఉన్న కారణం చేత) అప్రయత్నం గా మన రచనలో వారి శైలి పొడచూపితే అది అనుకరణ. ఇక్కడ స్ఫూర్తి పద ప్రయోగం వరకు మాత్రమే నియమితమై ఉంటుంది.


ఉదా. "మందర మకరంద" అనో, "ఎవ్వనిచే జనించు" అన్న పదంతోనో ఏదైనా పద్యం మొదలైతే, చదువరులకు అసలు పద్యం (చిరస్థాయిగా నిలిచిఉన్న ఆణిముత్యాలవంటి పద్యాలు) స్ఫురణకు రావటం, ఆహ్లాదం కలగటం అన్నవి అటువంటి ప్రయోగాలకు, పదాల వాడుకకూ స్ఫూర్తి.


అదేకనుక పద్యభావం నుండి కూడా స్ఫూర్తిపొందితే అది అనుసరణ. ఒక విధం గా చెప్పలంటె తత్ మూల పద్యాన్ని రాసిన కవికి ఈ పద్య రచయిత సమర్పించుకునే కృతజ్ఞతాపూర్వక నమస్కృతి అన్నమాట.


పోతన కృతులలో నేను గమనించిన కొన్ని అనుకరణలు...అనుసరణలూ....


కవిత్రయంలో ముందుగా "ఆంద్ర కవితా గౌరవ జన మనోహారి నన్నయ్య సూరి" అని పిలువబడ్డ నన్నయ్య కవితానుసరణ


నన్నయ్య:


శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తేవేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్శ్రేయసే


పోతన- (వీరభద్ర విజయము లో ఇట్లనువదింపబడింది)
సిరియును వాణి గౌరి యనుజెన్నగు కన్యకు మేను, వాక్కు బె
న్నురమును నుంకువిచ్చి ముదమొప్పవరించి జగంబులన్నియున్
దిరములు సేయబ్రోవదుదిదీర్పగ ద్రష్టయుగేక్షణుండునై
హరివిధిశంభుమూర్తి యగు నాద్యుడు మాకు ప్రసన్నుడయ్యెడిన్.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"హరి హర చరణారవింద వందనాభిలాషిందిక్కన మనీషింభూషించి" అని కీర్తించిన తిక్కన అనుసరణలు


తిక్కన 1 :


రాజటె ! రాగహీనుడతె ! రాజిత సుందరమూర్తి యట్టె ! వి
భ్రాజిత సంపదున్నత విభాసిత వర్తనుడట్టె ! కామినీ
రాజ మనోజ్ఞ భంగి చతురత్వధనుండటె ! బ్రహ్మచర్య దీ
క్షాజిత మన్మధుండునటె జన్మము లిట్టివు యెందు గల్గునే ? --> (శాం. 2 -103)


పోతన:
రాజటె ! ధర్మజుండు ! సుర రాజ సుతుండతె ధన్వి! శాత్రవో --> (1 - 211)


తిక్కన 2 :
సకల స్థావర జంగమంబులు భవత్సాన్నిధ్య మాత్రంబునన్ --> (ఉద్యో. 1 - 186)


పోతన 2:
సకల స్థావర జంగమ ప్రతతికిన్ జర్చింప దానాఢ్యుడై --> (3 -1019)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


ఎఱ్ఱన రచించిన నృసింహ పురాణం లో పద్యాలకు పోలికగలిగిన పోతన పద్యాలు.....


అసలు 1:
వాసుదేవుని పాదవనరుహంబుల భక్తి తగదను తండ్రియు తండ్రికాదు
వేదచోదితమైన విష్ణుధర్మమునకున్ గోపించు గురుడును గురుడుగాడు
భవదుఃఖముల మ్రాంప బ్రభువైన హరిసేవ నెడలించు హితుడును హితుడుగాడు 
వరయోగ మతమగు వైష్ణవ జ్ఞానంబు వదలిన చదువును చదువు గాదు
కేశవాకార లీలలు గీలుకొని ము
దంబు బొందని తలపును తలపుగాదు
మాధవస్తోత్ర ఘన సుధా మధుర రుచుల 
జిలుకకుండెడి జిహ్వయు జిహ్వ కాదు. ---> (నృ. 5-22)


కొసరు పద్యం 1 ఏమిటో చెప్పగలరా?


అసలు 2: 
కలడు మేదినియందు కలడుదకంబుల
గలడు వాయువునందు గలడు వహ్ని
గలడు భానుని యందు గలడు సోముని యందు
గలడంబరమున గలడు దిశల
గలడు చరంబులచరంబుల గలడు బాహ్యంబునగలడు లోన
గలడు సారంబులగలడు కాలంబుల గలడు ధర్మంబులగలడు క్రియల
గలడు కలవాని యందును గలడులేని
వానియందును గలడెల్ల వాని యందు
నింక వేయునునేల సర్వేశ్వరుండు
కలడు నీయందు నాయందు గలడు గలడు --> (నృ. 5 - 78)


కొసరు పద్యం 2 ఏమిటో చెప్పగలరా?


అసలు 3:
కుడిచినపుడు నిద్రగూరినయప్పుడు
మేలుకొనిన యపుడు మెలగినపుడు
విష్ణు కీర్తనంబు విష్ణు చింతయు కాని
పలుకడొండు బుధ్ధి దలపడొండు --> (నృ.3 - 150)


కొసరు పద్యం 3 ఏమిటో చెప్పగలరా?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


సోమనాధుని బసవ పురాణం:


క్షీరాబ్ధి లోపలక్రీడించు హంస గోరునే పడియల నీరు ద్రావగ?
జూత ఫలంబులజుంబించు చిలుక
భ్రాతి బూరుగు మ్రాని పండులు గన్గొనునె?
రాకామల జ్యోత్న దావు చకోర
మాకాంక్ష సేయునే చీకటి ద్రావ?
విరిదమ్మి వాసన విహరించు దేటి
పరిగొని సుడియునే ప్రబ్బిలి విరుల? --> (3 - 82)


కొసరు పద్యం 4 ఏమిటో చెప్పగలరా?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


భాస్కరుని రామాయణం:


కుప్పించు నురవడి గుంభిని వడిగ్రుంకి
సర్వాధిపతి తలల్ సదియ నదుమ
నగయు నూకున మీది కెత్తి పాఱిన తరు
శ్రేణులు చుక్కలు జెదర నడువ
నెఱకలు జాడించు నేపున గడలెత్తి
యేడు వారాసులు నెడములొత్త
బఱచు బల్వడి నభ్ర పంక్తులు సుడిగొంచు
వలయంపుగొండ యవ్వలికి దూల దూల
పర్వతములు వడక్ బ్రహ్మాండ కోటర
మదృవ గగన వీధి నరుగుదెంచె?
రఘుకులేంద్ర బంధ విఘటనత్వరితాంత  
రంగుడగుచు నవ్విహంగ విభుడు.


కొసరు పద్యం 5 ఏమిటో చెప్పగలరా?

Saturday, September 11, 2010

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు !!!

అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. 

వినాయక చవితికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెబుతున్నాడేంటి అని హాస్చర్యపోవద్దు. నేనెక్కాల్సిన ట్రైను జీవితకాలం లేటు అన్నట్టు ఇన్నాళ్ళకి గానీ వీలు పడలేదు. అయినా ఇవ్వాళ కథ చదువుతూంటే రాద్దామనుకున్న టపా రాయలేదని గుర్తొచ్చింది.  

"మనుషులను వస్తువులుగా , వ్యాపారవస్తువులుగా చూస్తున్న ఈ కాలంలో వస్తువుల మనసుల్లోకి తొంగిచూడటం మీకే చెల్లు" అని ఒక బ్లాగ్మిత్రులు ఒకానొకసారి నా టపాలో వ్యాఖ్యానించారు. వారికి అనేకానేక ధన్యవాదాలు.

వస్తువుల మనస్సునైతే అర్ధంచేసేసుకోవచ్చు, వచ్చే ఇబ్బందేం లేదు. మనుష్యుల మనస్సులు అర్ధంచేసుకోవటం మొదలైతే ఇంకేమన్నా ఉందా? ఉదాహరణకి కళాంజలో, కళానికేతనో దాటేస్తూంటే శ్రీమతి మదిలో మెలిగే శతాధిక భావాలు నాకు అమాంతం అర్ధమయిపోయాయనుకోండి, నాగతేంకాను? ఆ నడిరోడ్డుమీద ఉక్కిరి బిక్కిరి అయిపోనూ? ఆఫీసులో టాస్కులిచ్చి ఇంకంటాక్సువాడి మాదిరి పీల్చిపిప్పిచేస్తే టీమ్మెంబరుగాళ్ళు తిట్టుకునే శాపనార్ధాలు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? 'ఢా'మ్మని అక్కడికక్కడే పోనూ? అందుకే  వస్తువుల మనసుల్లోకి తొంగిచూడటం కొంచం సేఫ్. అవైతే నిష్కర్షగా "నా భావం అది కాదు మొర్రొ" అని ఖండించవుకదా. నిర్మొహమాటంగా వాటి పేరు మీద మనకి తోచింది, నచ్చిందీ చెప్పేయచ్చు. అది నా ధీమా.

నిజానికి నేన్రాసుకున్న పద్యాలని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటూంటే ( రాసినవి కొన్నే అనుకోండి) అప్రయత్నంగానే భావావిష్కరణలో నా మొగ్గు ఖనిజాలు,వృక్షాలు,జంతువుల పైకే ఎక్కువ తూగుతుంది.

రాముడు-స్ఫూర్తి పద్యాల్లో రాళ్ళు రాముడి మరదళ్ళమని ఫీలయినా, జలచరాలు రాముడిమీద అలిగి అటకెక్కినా, తక్కెడ ధర్మాధర్మాల గురించి రాముణ్ణి నిలదీసినా, ఉడుత "గాఢపరిష్వంగ" వాంచని రాముడికి విన్నవించున్నా, తాటాకు చప్పట్లలో తాటి చెట్టు తన వేదనని నివేదించుకున్న;  పులి విలాపం అన్నా ...అన్నిట్ళో ఉన్నది అదే.

అయితే ఈ మొగ్గు అప్రయత్నం అని ఎందుకన్నానటే నేన్చదువుకున్న పద్యాలు అట్లాంటివి మరి. బోయిభీమన్నగారి ప్రభావం నామీద అలాంటిది. ఇంతకముందు టపాలో చెప్పినట్టుగా, బోయి భీమన్నగారు ఓ రకంగా నాకు ఏకలవ్య గురువుగారు. ఏకలవ్య గురువుగారు అని ఎందుకు అన్నానంటే నా ప్రమేయం లేకుండానే నాలోనికి చొరబడి నన్ను ప్రభావితం చేసేశారు కాబట్టి.

ఒక గ్రీటింగు షాపు కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వందలాది గ్రీటింగుల్లో ఒక్కటి మాత్రమే మనకి తెగ నచ్చేస్తుంది. ఎందుకంటే అది మనం చెప్పకపోయినా మన హృదయాన్ని మాటల్లో ఆవిష్కరించినట్టు అనిపిస్తుంది.

బోయిభీమన్న గారి "మణి మానసం" కావ్యం నా దృష్టిలో అట్లాంటిదే.



అపూర్వమైన ఒక పరిచయం, ఒక స్నేహం, ఒక సన్నివేశం, ఒక చిరునవ్వు, ఒక వక్రోక్తి, ఒక వాలుచూపు -- ఇందులో ఏ ఒక్కటైనా చాలు - భావానికి సౌకుమార్యం కలిగించి ఉద్వేగపరచటానికి, అవ్యక్తమై ఉన్న అనుభూతిని తట్టి లేపటానికి.

ఆత్మతో కలిసిపోయిన అనుభవ్సారమే అనుభూతి. అనుభూతి జాగృతం కావడమే భావ స్పర్శ. అట్టి అనుభూతి రససంబంది అయినప్పుడు కళాసృజన జరుగుతుంది. రసానుభూతికి రూపకల్పనలే కళలు -- సాహిత్యం, సంగీతం, నృత్యం, శిల్పం వంటి కళలకు మూలబీజం రసమే.

లోకిక, భౌతిక, వ్యావహారిక, శారీరక సంబంధ బాంధవ్యాలతో ప్రమేయం లేని మనోరమణమే రసస్థితి. విప్రలంబ శృంగారమే రసాద్వైతానికి బీజం. వియోగం వల్ల మనోరమణం ఏర్పడి నిరంతర ధ్యానం వల్ల తాదాత్మ్యం సిధ్ధిస్తుంది. ఇది భక్తికంటే మధుర భక్తికంటే భిన్నం. ఇది స్త్రీ పురుష మనస్సంబంది. పరమానంద సిధ్ధికి సహజ మార్గం. శ్రీకృష్ణుడు గోపికలకు ఉధ్ధవుడి ద్వారా పంపిన సందేశం లో  ఈ రసాద్వైత మూలసూత్రం కనిపిస్తుంది. ప్రతీ వ్యక్తి జీవితంలోనూ విప్రలంభం ఉంటుంది. అయితే గోపీకృష్ణ వియోగం ఒక శాస్వతమైన మధురవేదన. అందుకే దానిది సచ్చిదానంద రసస్థాయి.

అటువంటి రసానుభూతికి సాహితీ కల్పనే "మణి మానసం" కావ్యం.

శ్యమంతకమణి మానసం ఆ కావ్య వస్తువు, బీజం. భాగవతంలోని శ్యమంతకమణి కేవలం ఒక మణి. కానీ ఈ కావ్యంలోని శ్యమంతకమణి మానవ హృదయం కల ప్రేయసి. కృష్ణుణ్ణి ప్రేమించి, తన ప్రేమను అతడు గుర్తించకపోవడం వల్ల మూగ వేదనను అనుభవిస్తున్నట్టిది. ఒక్క ముక్కలో చెప్పలంటే శ్యమంతకమణి స్వాంతనం. గోపికలవలే కృష్ణుణ్ణి కామించి, ప్రేమించి, ప్రేమైకభావం లో తాదాత్మ్యత చెంది విరహవేదన అనుభవించినదే ఈ కావ్య నాయిక- శ్యమంతక మణి.

వినాయక చవితి సందర్భంగా గోపీకృష్ణుల రాసలీల స్మృతిగా ఆ పద్యాలు, మీకోసం... చదివి ఆనందించండి.. కృష్ణానుభూతిని అనుభవించండి.

పనిలో పనిగా కృష్ణాష్టమి సందర్భంగా ...నా 'గీత '

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

లూతల పట్టుకోక సిగలో ఎదొ పిట్టల ఈక, చుట్టునున్
వ్రేతల మూక, దట్టినొక వేణు శలాక; రసాధినేతకే
తాత యనంగ వెల్గెడునితండెవడా అనుకొంటి, కృష్ణ ! ని
న్నా తొలిసారి చూచి ! నయనామృతమయ్యనదే దినే దినే !

గాన రసమ్ముతో వెదురు కర్రకు ప్రాణము పోసినావు; నీ
వేణు రవమ్ముతో మొరటు వ్రేతను రాధనుజేసినావు; నీ
యాన రయమ్ముతో జడ మహస్సుకు కళ్ళెము వేసినావు; నా
మానస మంతకన్న ఖిలమా? ఖలమా? నినుగోరుటబ్రమా?

సూరుడు కాడె తండ్రి? తను చూడనిదున్నదె? నన్నెరుంగడే?
కోరిక దీర నే క్షణమొ కొమ్మని నీకిడడే- అటంచు నే
నారని ఆశ నుంటి ! అకటా ! తన దండకమున్ పఠించుచున్
దారిన పోవువానికొక దానయకున్ నను దానమిచ్చెపో !

నా యాత్మన్ కరగించి లోగొనినదే నాదౌ ! తదన్యం బదే
శ్రేయంబైనను వ్యర్థభారమె యగున్; చేతో ధరా ధారలో
నా యానందమె నాది; దానికొకడే నథుండు కృష్ణుండు; కృ
ష్ణా యోచింపు, ముపేక్ష చేసెదవు పో - షష్టాష్టకంబయ్యెడున్ !

మహిమ గలట్టి రత్నము శ్యమంతము, హేమము నిచ్చు, నంచు నన్
బహుగతులన్ నుతింత్రు; మరి నాకెవరిత్తురు నా అభీష్టముల్?
స్వహితము నైజమౌ మనుజ జాతికి! సర్వ హితైక మూర్తివౌ
మనుజుడవీవుగా? మణికి మాత్రము మానసముండదా? ప్రభూ?

బృందా సుందర సీమలో, మధురలో, వ్రేపల్లెలో రమ్య కా
ళిందీ తీరములో భవచ్చరణ సంలీనాత్మలై నిన్ను నీ
డెందమ్మున్ గొను చొక్కరొక్కరె నవోఢీ భూతలై కాంతలా
నందం బందుచు నుండ చూచెదను కానా? నే నలోలాత్మనా?

దీపజ్యోతికి మూలపీఠమయి తధ్ధీవల్లికిన్ పుష్పమై,
శ్రీ పాదమ్ముల నీలపద్మమై, తన్నృత్య క్రియా రంగమై
రూపారూప పరాప రోదిత కళా రోచిష్ణువై వెల్గు నీ
గోపీ వల్లభ మూర్తి నా కనులలో గోవత్సమై గెంతదే?

ఇంత ఉపేక్ష చేతువది ఎందుకొ? హేతువు కానరాదు ; నా
యంతట నేను వెంటబడినందుకొ? నాకిల నీవుతప్ప గ
త్యంతర  మేదియున్ గలుగ నందుకొ? దైవము జేసి నిన్ను నా
స్వాంతము నందు నిల్పుకొనినందుకొ? ధైర్యము చాలనందుకో?

మనసిది నిన్ను కోరి కడు మ్రగ్గుచునున్నది; తండ్రి యా మరో
మనుజునకిచ్చె; ఈ కొలది మన్గడయున్ దరిజేరి చచ్చెనా?
అనయము నెవ్వడో ఒకడు అగ్నికి కట్టియ రీతి వచ్చి నన్
చెనక దలంచు ! రుక్మ మొక చెడ్డది, రుక్మిణి మంచిదీ నటో?

ఆనాడే నను జూచి నీ మనసు రాగారక్తమైనప్పుడే
పోనిమ్మంచనుకోక, కాలగతిలో పోకళ్ళు గుర్తించి, పం
తానన్ రుక్మిణినట్లు నన్ను గొనియున్నన్ ఇంత కాకుండు ! దే
వా ! నీ దానను, నేటికైన నను గావన్ నేరవా? కోరవా?

జేజెలమీర నన్గొని ప్రసేనుడు చచ్చె; మృగేంద్రుడిల్గె; స
త్రాజితుడంతమయ్యె; శతధన్వుడునున్ తెగె; జాంబవంతుడు
గ్రాజియొనర్చె; నొచ్చె బలరాముడు; ఇంతయు నాగురించి ! స్వా
మీ! జగదాత్మ ! ఇంత అఘమెందుకు నా నుదుటన్ లిఖించితో?

మరిన్ని తర్వాతి టపాలో...

Friday, August 13, 2010

"ఆగస్టు విప్లవం" - బోయి భీమన్న

ఎందరో మహానుభావులు, కవులు, గాయకులు, రచయితలు, పత్రికా సంపాదకులు, రాజకీయనాయకులు, కార్యకర్తలు నడుంబిగించి తమకు చేతనైనపనిని కర్తవ్యంగా భావించి చేస్తేకదా స్వాతంత్రోద్యమం జాతీయోద్యమంగా రూపాంతరం చెందింది... అట్లాంటి జాతీయోద్యమ స్ఫూర్తితో ఉత్తేజపరచే రచనల్లోనిదే బోయి భీమన్నగారు రాసిన "ఆగస్టు విప్లవం" కావ్యం.

ఆంధ్రా యువకుల మహోత్తర పాత్ర, బాపూజీ నాయకత్వం, మహాత్ముని పిలుపు..వీటి నేపధ్యం లో స్వాతంత్ర్య సమరం లో పాల్గొనమని ఓక వీర యువతి తన ప్రియునకు చేసిన ప్రబోధమే ఆ కావ్యం

నన్ను ప్రభావితం చేసిన ఆ కావ్యంలోని కొన్ని ఆణిముత్యాలు సందర్భోచితం గా..."

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
బాపూజీ పిలుపాలకించి మురళీ వాదమ్మునన్ బోవు గో
గోప వ్రాతమువోలె, సాగు డిక త్యాగుల్ భోగులేకస్థులై.
రేపన్నట్టిది లేదు దేశ హిత కార్యేధ్ధ ప్రయత్నమ్మునన్;
వ్యాపింపన్ దగు నేడె వ్యూహ రచనా ప్రాగల్భ్యమాశాంతముల్.

ధీమంతుండంగు ఆంధ్రకేసరి ప్రబుధ్ధిన్, చెన్నపట్నమ్మునన్
సైమన్ సంఘముతో తొడన్ జరచి ఆంధ్ర ప్రాగ్యమున్ జూపె; మొ
న్నే మొన్నన్ యువరక్తనిర్ఝరుల నింకెన్ భూమి గుంటూరులో;
ఈ మీ దేమగునన్ తలంపు వల,దిప్డే దూకు డుద్బుధ్ధులై.

వార్తలు లేక, నాయకుల వైనము కోరిన దేశభక్తులన్
దూర్తులు సాయుధుల్ భటులు తూలగనేయ తుపాకులెత్తినన్
స్ఫూర్తి వహించి - 'పేల్చు ' డని ముందుకు దూకినవాడు మీ బి.ఎస్.
మూర్తి ! పరాక్రమమ్మదియ పో, బెజవాడకు భూషణమ్ముగా !

అల్లురి వంటి వీరసుతులాధుని కార్జును లెంతమందియో;
కల్లురి సుబ్బరావొకడె కాచెను సంజివరెడ్డి బోలు బల్
మల్లుర గూడి, రాష్ట్ర మొక మండల మంతయు; పెక్కులేల, మీ
పల్లము రాజు లేడె? కరువా యువవీరులు, దేశభక్తులున్?

అరుగో ఛూడుము సాంబమూర్తిని, గిరిన్, ఆచార్య రంగాను, ము
ట్నురి శూరున్, సరదారు లచ్చనను, మధ్ధూరన్ననున్, అయ్యదే
వరకాలేశ్వరు; చంద్రమౌళి, పుసులూర్వర్యున్, రవీంద్రున్ మహ
ద్గురుగా చేకొని పోరికిన్ చనిన మీ గోపాలరెడ్డ్యగ్రణిన్.

పరికింపన్ పనియేమి పండితుడు మీ పట్టాభి ముందుండ? పె
క్కురు కూర్మయ్యలు, చెర్కువాడలు, మహా కోట్రెడ్లు, మాగంటు, లు
ధ్ధురులౌ పొట్టులు, చిట్టుల్లున్ నడవగా; దువ్వూరి సుబ్బమ్మలై
తరుణుల్ దూకిరి దాస్యమోచన రణౌధ్ధత్యమ్మునన్ , చూడవే?

శంకయొకింత యేలను? శశాంకుని దీటగువాడు మీ కళా
వెంకటరావు 'స్యైడు 'లను వింత యమాసను ముంచి, ఇంచుకేన్
గొంకక , ఆంద్ర సర్క్యులరు గొంచు, జనమ్ముల కందజేయడే?
అంకెకు వచ్చువాడెవడు యాతనితో అసహాయ శూరతన్?

బడి మానుండు, స్వరాజ్యరాజ్యరమకై స్వాతంత్ర్య సంగ్రామ మం
దడు గుంచుం డని బాపు చెప్పగనె - విద్యన్ మాని, వాలంటిరై,
పడతిన్ బోవిడి, లాటిదెబ్బలకు తావై, ఖైదునన్ గూలి, ఆ
తడు దేశమ్మును గొల్చు జీవితపు సత్తా మొత్త మర్పించుచున్ !

త్యాగము గూర్చి చెప్పుట కుదాహరణమ్మిది, పాలపొంగుగా
భోగము లొందు యౌవన నవోదయమున్ నిజదేశభక్తి పూ
జాగరు వర్తిగా నిలిపి అర్చనచేసినవైనమిద్ది; సు
స్వాగతముల్ వచ్చించి, యువ సైన్యము గూర్చుక బైలుదేరుమా !

నను విడనాడి పోవగ మనమ్మున నీవెటు కుందుచుంటివో,
నిను విడనాడి యుండుటకు నేనును అంతకుమించి కుందుచుం
టిని; మన కుందు దేశ జననీ పరతంత్రత లోని కుందుతో
నెన యగునా? తదార్తి తొలగించుట కంటెను ధర్మముండునా?

యువకుల్ కల్గిన లాభమేమి బలవద్యోధ్ధత్వముల్ లేనిచో?
జవసత్త్వమ్ముల కార్యమేమి భరతక్ష్మా దేవి కాపాడమిన్ ?
నవలల్ లేచిరి తోడురాన్; నడువుడింకన్ శూరులై; సేనలై;
బవరం బందునె పుచ్చుకొందము ప్రియ స్వాతంత్ర్య లక్ష్మీ క్షమన్ !!

Wednesday, July 7, 2010

మాగాయ్ పచ్చడి...

నేపధ్యం:

కంది శంకరయ్యగారు ఒక సమస్య ని ఇచ్చారు

నా పద్యం:

వెచ్చని గాడ్పుల వేసవి
వచ్చిన సడి తెలియునట్లు వడ్డించండోయ్
నచ్చిన ముక్కల మాగాయ్
పచ్చడి మెతుకులె మన కిఁక పరమాన్న మయెన్

స్ఫూర్తి :
మాగాయొక మహా పచ్చడి పెరుగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవిస్తరీ మానిన్యాం మహాసుందరీ అన్నారు కదండీ.. అందుకే..

Sunday, June 13, 2010

పులి మానసం

రామాయణ కథనంతా చిత్రకారులు చిత్రీకరిస్తే రాముడూ, సీతాదేవీ వాటిని గమనిస్తూ అప్పటి రోజులని గుర్తు చేసుకుంటూ మాట్లాడుకున్నారు అని భవభూతి ఉత్తర రామచరితం లో వర్ణిస్తారు. అదేభావనతో ఈ పద్యం..

వేటగాళ్ళ క్రూరత్వానికి పులులు బలై పొతూంటే పులి పిల్లలు అనాథలైపోతున్నాయి. అట్లాంటి ఒక అనాథ పులిపిల్ల తన గతాన్ని, తన తల్లితో ముడిపడి ఉన్న మధురమైన జ్ఞాపకాలనూ నెమరువేసుకుంటూంటే ఎలా ఉంటుందో అని ఆలోచనకి ఇది పద్య రూపం..




ఆవల ఈవలంచు తిరుగాడెడి పిల్లల నెల్ల ప్రేమతో
కావలి గాచి సొక్కితివొ, కంటికి నిద్దుర దూరమయ్యెనో?
త్రోవల తూలినావు ! కనుదోయిని నా మునివేళ్ళ విప్పనా?
దేవుని పైన భారమిడి ఈ సమిధన్ చెవి దూర్చి చూడనా?
ఈ వనమందు నీవు శయనింపగ లేపెడి ధూర్తు నేనె గా....

Tuesday, June 1, 2010

ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి నా వంతు సాయం...

ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి నేను సైతం... ...

Our world today is facing burning issues of global warming, energy changes and climate change challenges. Individuals, governments, corporates and organizations round the globe are working to address these issues that impact business, technology, society and every aspect of life. World Environment Day, commemorated each year on June 5, is celebrated worldwide to create awareness and bring about the necessary attention and action!


ఇట్స్ ఇంపార్టెంట్ , ట్రస్ట్మీ !

లెట్స్ సైకిల్ లైక్ ఎ బేబి ! లెట్స్ రీసైకిల్ !

దట్స్ ఇట్! లెట్స్ బీ కమిటెడ్ !

ఇట్స్ టైం నౌ, లెట్స్ ప్రొటెక్ట్ ది ఎంటైర్ ప్లానేట్ !


"అనువుగనుండును, మార్కెట్
పనులకు సుళువంచు" శుష్క భావన వలదోయ్ !
అనపేక్షితమీ ప్లాస్టిక్
ఘనమగు వ్యర్ధాల నింపు ! గమనించండొయ్

Saturday, May 22, 2010

రాలిన సాహితీ సుమం - వేటూరి

తెలుగు తల్లికి సాహితీ సమర్చన చేసిన సత్కవి, సినిమా పాటల ద్వారా ఎందరి గుండెల్లోనో తెలుగుదాన్ని చిరస్థాయిగా నింపిన స్రష్ఠ, మహోన్నత వ్యక్తి శ్రీ వేటూరి సుందర రామ మూర్తి గారికి హృదయ పూర్వక పద్య సుమాంజలి

కొందరు భాష జూచెదరు ! కొందరు భావ పరంపరల్ గనున్ !
కొందరు భక్తి గ్రోలెదరు ! కొందరు సూక్తుల నాదరింపగన్ !
ఇందరి కిన్ని ఇచ్చు కలమే అది? తెల్గుతనాని కంతకున్
సుందర రామ మూర్తి ఒక సూత్రమొ? గోత్రమొ? దివ్య నేత్రమో !!




Thursday, May 6, 2010

కవిసమ్మేళనానికి నా కుస్తీపట్లు!!

ఉగాదికి అంతర్జలంలో నిర్వహించిన కవిసమ్మేళనానికి పిల్ల కాకినైన నాకూ పిలుపొచ్చింది.

ఉద్దండ పండితుల మధ్య నా పద్యాలు కనీసం విదూషకుడి పాత్రనో, అప్రస్తుత ప్రసంగీకుడి పాత్రనో పోషిస్తాయి కదా అని నేనూ ఊ కొట్టేశా. ఆ పిలుపుకి పర్యవసానమే నా ఈ కుస్తీ పట్లు.

బ్లాగాడిస్తా రవి గారి టపా స్ఫూర్తి తో నేనూ ప్రచురిస్తున్నా నా పద్యాల్ని (ఉరఫ్ పైత్యాన్ని...)

"కుస్తీ పట్లు" అని ఎందుకన్నానో మీకు చదువుతూ పోతున్నకొద్దీ దానంతట అదే అర్ధమైపోతుంది.. కావాలంటే చూడండి..

చట్టబధ్ధమైన ముందస్తు మాట....
ఈ పద్యాలు చదివాకా.. మీకేమైనా అయితే అది నా బాధ్యత కాదు సుమీ...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
(గతంలో ఓటరు భావన)
నోటుకి, మందుకి, క్రీకెట్
బ్యాటుకి తెగనమ్ముకొందు ! బ్యాడ్పొజిషన్నీ
పూటకి గడచిన చాలును
ఓటది నాయిష్టమనుచు వోటరు పలికెన్

(మరి నేడో .... )
కోటికి అర్రులు చాచుచు
కూటికి కొరగాని వాన్కి గూడివ్వంగా
ఆటల నాడెదవే? చీ !
ఓటది! నాయిష్టమనుచు వోటరు పలికెన్

ఘాటగు స్పీచులు దంచక
బూటక వాగ్దానమీక, పూజ్యులు బాపూ
బాటన్నడిచే నేతకు
ఓటది! నాయిష్టమనుచు వోటరు పలికెన్

తూటా కన్నా గొప్పది !
మాటాడని విప్లవమ్ము ! మార్పుకు బీజం
నాటెద! సత్తా చాటెద !
ఓటది! నాయిష్టమనుచు వోటరు పలికెన్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మన్మనంబున ప్రేమ భావన మంతరించెడి వేళ ! మా
కున్ముదంబున దారి జూపుచు, కోటి రత్నపు వీణయే,
వన్మినిట్టు సహింపబోమను వాదనల్ తెరదింపుచున్
రాణ్మహేంద్రవరమ్ము చేరెను, రత్నగర్భుని చెంతకున్

(ణ్మ కి న్మ ప్రాస సరికాదు అని విజ్ఞులు చెప్పారనుకోంది.. కానీ నాకు తట్టింది మాత్రం ఇంతే ..)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
సూచన:- మీరు గమనించకపోయినట్టైతే పట్లు ఆల్రెడీ మొదలైపోయాయి..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మా సుమ బాణముల్ హరుని మానసమందున ప్రేమ నింపగా,
భాసురమైనతేజమిటు భాసిలె స్కంధుగ ! క్రౌంచ తారకా
ద్యసురారీ! ఒనరంగజేసితిని గాదా ధాత్రికిన్ గూర్మి ! నే
డిసుమంతైనను లేడు నా యశముకే ఢీ చెప్పు వాడెవ్వడున్ !
అసువుల్ బాసిన నేమి? జన్మ చరితార్ధంబయ్యె, సత్కర్మలన్

ఏవో చప్పిడి కూడు నీకిడుదు! నేనే జంతికో తిందు ! నే
వేవో పాటల టాపు లేపెదను ! వేవేలంట నా తిక్కలున్ !
నీవేరీతిన వేడుకున్న విన! నే నే ఖర్చు తగ్గించ నోయ్
శ్రీవారూ!! గృహజ్యోతి మాట విని ఏ.సీ. తేని పక్షాన! ఫో !

ఇంటికి దీపం ఇల్లాలు కదా.. ఈ మల మల మండే ఎండాకాలం లో ఏ.సీ తెమ్మని ఆవిడ పెట్టే పోరు లో దత్తపదుల కుస్తీ...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
సూచన:- పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు అన్నారు కదా.. నా తఢాకా చివరిగా ఇక్కడ... ;)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
లక్షద్వీపపు మంత్రి వర్గమనగా లంచావతారమ్ములే
వీక్షింపంగ ! విభిన్న దీవులకు వేర్వేరైన శాఖల్నిడెన్
భక్షింపన్ కమిషన్లు! దాని కొరకై భా.నీ.ప లంకేశుడే
అక్షప్రౌఢిమ మీర ఆశ కు.ని. లంకాధీశుతో బోరెడిన్

లక్షద్వీప్ ప్రభుత్వం ఒక్కొక్క మంత్రిత్వ శాఖనూ ఒక్కొక్క ద్వీపం లో పెడుతుందనీ.. అప్పుడా మంత్రే ఆ లంకకు అధిపతి అనీ... మంత్రులు కాబట్టి రాజకీయం లో ఎత్తులు, పైయ్య్త్తులూ వేస్తూంటారనీ... భావన..

ఒక శాఖ మంత్రి కి వేరే శాఖ మీద కన్ను పడగా ఆయనతో పోరు పెట్టుకున్నాట్ట ఆశ ఎంతటి కైనా తెగిస్తుంది కదా... అని భావన..

మీకీపాటికే అర్ధం అయ్యి ఉంటుంది ఈ యుధ్ధం ఎవరెవరికీ మధ్యనో...
భా.నీ.ప = భారీ నీటి పారుదల శాఖ,
కు.ని = కుటుంబ నియంత్రణ శాఖ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
స్వస్తి

Monday, April 12, 2010

చిత్రవర్ణ రేఖా విలాసం... (తెరసెల్లా -1)

"పెళ్ళంటే నూరేళ్ళ పంట" --> ఓ ముసలావిడ సలహా
"గాస్ సిలిండరు మీద వంటేం కాదు...? --> గడుసు పిల్ల సమాధానం..
సౌందర్యకీ నిర్మలమ్మకీ మధ్య జరిగే ఈ సంభాషణ అదేదో సినిమాలోది..

"పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు తలంబ్రాలూ, మూడే ముళ్ళూ, ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు" ఓ ప్రేమికుడి నిర్వచనం...

"పెళ్ళంటే పప్పన్నం పెట్టాలి కదమ్మా..." ఓ అమాయకుడైన చంటి ప్రశ్న.

"ప్రేమంటే రెండు హృదయాల కలయిక, కానీ పెళ్ళంటే రెండు కుటుంబాల కలయిక" ... ఓ మన్మధుడి హిత బోధ.

నాణేనికి ఒక పార్శ్వం...


"షాదీ మాటే వద్దు గురు సోలో బతుకే సో బెటరు" ఓ సూక్తి ముక్తావళి.
"పెళ్ళంటె నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా" ఓ తెలివైన వాడి ఉచిత సలహా

మరో పార్శ్వం

ఒక్కో సినిమాలో ఒక్కో నిర్వచనం. ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కడిదీ ఒక్కో డైమెన్షను.

పెళ్ళంటే: -
కొందరికి సరదా,
కొందరికి బాధ్యత,
కొందరికి ఆత్రం,
కొందరికి అవకాశం,
కొందరికి డాబు,
కొందరికి వేడుక,
కొందరికి జీవితం
ఎంతో మందికి పెళ్ళన్నది ఓ భుక్తి... ఓ పెద్ద ఇండస్ట్రీ...

ఎన్నో వందల వేల కుటుంబాలు ఈ ఇండస్ట్రీని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నమ్ముకుని బతుకుతున్నారు....
ఇప్పుడు వారిలో కొందరికైనా అశనిపాతం లాంటి తీర్పు ఉన్నత న్యాయస్థానం వెలువరించింది.

సహజీవనమూ ఓకే అని. నాణేనికి మూడో పార్శ్వం కాబోలు....

---***-------***-------***-------***-------***----

ఇంతకీ పిల్లల పెళ్ళి గురించి ఆరాటపడే తల్లిదండ్రులు గానీ, వధూవరులుగానీ పెళ్ళి అనే తంతుని ఎంతవరకూ తెలుసుకుని ఆచరిస్తున్నారో ??

ఇక్కడో చిన్న ఉటంకింపు:
ఉఛ్ఛారణ లో లోటుపాట్లు రావడంతో బరాక్ ఒబామా అరుదుగా రెండోసారి ఆ దేశాధ్యక్షుడిగా శ్వేత సౌధంలో ప్రమాణం చేశారుట.

మరి మన పెళ్ళిళ్ళలోనో???

ఎంతమంది పురోహితులు మంత్రాలని సరిగ్గా చెబుతున్నారు ? ఒకవేళ సరిగ్గా చెప్పినా ఎంతమంది వధూవరులు గానీ తల్లిదండ్రులు గానీ ఆ మంత్రాలని సరిగ్గా చెబుతున్నారు?
ఎంతమందికి ఆ చేసే ప్రమాణాల అర్థం భావం తెలుసు?

---***-------***-------***-------***-------***----

ప్రాముఖ్యతనూ, ఆవశ్యకతనూ మర్చిపోయి ఆచారం, సాంప్రదాయం, కట్టుబాట్ల పేరిట అవసరమైనవీ కానివాటినీ జొప్పించి ప్రతీదానినీ నాశనం చేసుకుని దాని తాలుకు ఖర్మ ఫలాల్ని తిట్టుకుంటూ తినడం మనకి మామూలైపోయింది.

బాల్య వివాహాలైతేనేం, వితంతు వివక్షలైతేనేం, సతీ సహగమనమైతేనేం, కన్యాశుల్కం, వరకట్న పిశాచాలైతేనేం, బీరకాయి పీచు మేనరికలైతేనేం, ఇప్పటి సహజీవనమైతేనేం... అన్నీ ఒకానొకప్పుడు ఆలోచించక చేసిన పనుల పర్యవసానమే.. మనసు పొరల్లో ఏర్పడిన ప్రతీకారేచ్చ. వ్యక్తి స్వాతంత్ర్య రూపం లో వడ్డి చెల్లించమంటోంది...

వీటన్నిటికీ కారణం ఏమయ్యుంటుందో మనకి తెలీనిదేం కాదు.

ఏం చేస్తున్నా ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని చేయటం కొరవడడం, తన్మూలంగా కొన్ని ఆచారాలు మూఢాచారాలై, వాటి బంధాలనుంచీ బయట పడేందుకు విశ్వప్రయత్నం జరగటం, అణగద్రొక్కబడటం మూలాన బయటపడ్డాక విశృంఖలత్వాన్నందటం... ఇదో చక్ర భ్రమణం... తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు మేధావులూ, కళాకారులూ, చరిత్రకారులూ, చదువుకున్నవారు, శాసనాధికారులూ .... ఎవరికి వారు యథాశక్తి తమవంతు సహాయం చేసినవారే. వారెవ్వరి ప్రమేయమూ లేకుండా వారెరుక లేకుండా ఇంతటి అన్యాయం జరిగే అవకాశమే లేదు. ఈ పాపాన్ని తరతరాల తలరాతలుగా శాసిస్తూంటే.. చేతులు కట్టుకుని కూర్చోటమో, అంతకన్నా చేయగలిగిందేముంది అని సర్దుకుపోవడమో.. ఇవే సగటు వ్యక్తి చేయగలిగినవి అని నమ్మే స్తితి కి చేరుకున్నాం....

ఆత్రేయ లాంటి కవి "స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదరూ" అన్నడంటే దాన్లో ఎంత లోతుందో.... అక్కడ దెప్పిపొడుపు చావు కి చేసే తతంగం మీద మాత్రమే కాదు, పెళ్ళి పేరున చేసే తతంగాం మీద కూడానూ.. ఇంకా చెప్పాలంటే మనుష్యులమీద, వాళ్ళ ఆలోచనా సరళి మీదానూ..

---***-------***-------***-------***-------***----

"పెరుగుట విరుగుట కొరకే ధర హెచ్చుట తగ్గు కొరకే" అని చదువుకున్నా చిన్నప్పుడు.

గమనిస్తే ఆచారాలు దురాచారాలుగా మారడానికి గల కారణం అవగాహనా రాహిత్యమే కానీ మరోటి కాదు. అందుకే ఆ చక్రభ్రమణంలో ఒక గౌతమ బుధ్ధుడు,బ్రహ్మనాయుడు , వివేకానందుడూ, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, గురజాడ , శ్రీశ్రీ, గాంధీ, అంబేద్కర్ వంటి వాళ్ళు మళ్ళీ జీవన రథాన్ని గాడిలో పెట్టి బుధ్ది ప్రచోదనం జరపటానికి కృషిజేశారు. వీళ్ళందరూ సామాజిక స్పృహ కలిగి ఉన్న సామాన్యులే... అసామాన్యమైన శ్రధ్ధ చూపి ముఖ్యంగా త్రికరణ శుధ్ధిగా నమ్మి ఆచరించారు... దురాచారాల్నుంచీ సరైన దారి చూపించారు.

ప్రతీవ్యక్తికీ వ్యక్తి ధర్మం, సామాజిక ధర్మం ఉంటాయి కదా. తన వృత్తి ప్రవృత్తులతో తన ఆలోచనలతో తనదైన ముద్రవేసుకుంటూ, సాగిపోతూంటే యద్యదాచరతి శ్రేష్ఠః అన్నట్టుగా అతనిని ఆదర్శంగాతీసుకుని అతని నుండీ స్ఫూర్తి పొంది, అనుసరిస్తూ మార్పు కు నాందీవాక్యం పలుకుతారు. బిందువు బిందువు జేరి సింధువైనట్టు.

(1) బయటకెళ్ళొచ్చాక బట్టలుమార్చుకుని, కాళ్ళు చేతులూ కడుక్కుని లోపలకి రావలన్నది తాతలనాటి ఆచారం...ఇప్పుడు డాక్టర్లూ అదేచెబ్తున్నారు క్రిములు లోపలకి రాకుండా ఉండాలంటే చెయ్యల్సింది అదేనని.
(2) ఇంటికి వచ్చినవాడికి ఉపచారాలు చేసి తాగటానికి మంచినీళ్ళివ్వటం, ఉపచారాలు చేయటం సాంప్రదాయం.. హొస్పిటాలిటీ తరగతుల్లో బోధించేదీ, విమానాల్లో, పెళ్ళిళ్ళల్లో మనం గమనిచేదీ అదె... సాదరంగా ఆహ్వానించటం, అథిథి సత్కారాలు చేయటం...
(3) అభ్యాగతో స్వయం విష్ణుః అన్నదే గాంధీగారు వినియోగదారుడి గురించి నిర్వచించినది....

ఇలా చేసే ప్రతీ పని వెనక ఉన్న భావమేమిటో తెలుసుకుని చేస్తే దక్కేది ఆనందం, లేకపోతే దక్కేది శ్రమ.
అందుకేనేమో కృష్ణుడు భగవద్గీత లో నహిజ్ఞానేన సదృశం పవిత్రమిహవిద్యతే అన్నాడు. పవిత్రీకరణ చేయటం లో జ్ఞానానికి సమమైనదేదీ నేనెరుగను అన్నాడు.

---***-------***-------***-------***-------***----

మళ్ళీ మన పెళ్ళి విషయానికొస్తే

పెళ్ళిళ్ళలో అతిసాధారణంగా కనిపించే తంతే... జీలకర్ర బెల్లం పెట్టడం ఆలస్యం ఏదో తరుముకొస్తున్నట్టు అందరూ అందినకాణ్ణుంచీ అక్షింతలు వేసేయటం (గిరవాటెసెయ్యడం అనాలేమో....) ఫొటో గ్రాఫర్లూ, వీడియో వాళ్ళు మొహం అటుపెట్టు, ఇటు పెట్టు, ఇల్లా చూడు, నవ్వూ... అనుకుంటూ డైరక్షన్లివ్వటం, అన్నివైపులనుండీ గుమిగూడిపోయి వధూవరులిద్దరూ బిజీగా ఉన్నా/ మంత్రాలను చదువుతున్నా , వాళ్ళ చేయి దొరకబుచ్చుకుని తెచ్చిన గిఫ్టేదో ఇచ్చామనిపించుకుని (వచ్చామని హాజరీ వేయించుకుని) వెళ్ళటం.. వచ్చిన వాళ్ళల్లో ప్రముఖులు ఉంటే తల్లిదండ్రులే జరిగే తంతుని పక్కన పెట్టేసి అమ్మయినీ అబ్బాయినీ పలకరించమనటం... ఇవన్నీ మనం నూటికి తొంభై శాతం పెళ్ళిళ్ళల్లో చూసేవే, చూస్తున్నవే.

జీవితానికి అత్యంత ముఖ్యమైన రోజు, ముఖ్యమైన సమయానికి చేసినదేమున్నదయ్యా అంటే హంగూ, ఆర్భాటమూ, హడావుడీ, గందరగోళమూ. ఆసలు విషయం (శుభ ముహూర్తము) ఏమయ్యిందయ్యా అంటే భజగోవిందం, పరమానందం..

ఇందుకా మనం అంతగా ఎదురుచూసేది? మన ప్రమేయం లేకుండా మనచుట్టూ ఉన్నవాళ్ళు మనకి ఏది ముఖ్యమో మనబదులు నిర్ణయించేయటం సబబేన?? ఇదెల్లాంటిదంటే.. అత్యంత వ్యయప్రయాసలకోర్చి, టిక్కెట్లు ముందుగా కొనుక్కుని, రిజర్వేషన్లు చేసుకుని, తిరుపతి వెళ్ళి తీరా స్వామివారిని దర్సించుకోవడానికి దొరికే ఆ ఒక్కక్షణంలోనూ, వాడెవడో లాగేశాడనో, తొక్కేశాడనో, చూడనివ్వట్లేదనో వాడిని ఖయ్య్ మనడానికే సరిపోతుంది. అసలు విషయం కాస్తా చెట్టెక్కేస్తుంది.

పెళ్ళి చేసుకోడానికి సంసిధ్ధత చూసుకోవడం బట్టలు కుట్టించుకోవడం, బ్యూటీ పార్లర్లకి వెళ్ళి అందాన్ని ఇనుమడిమజేసుకోవడం (స్త్రీ పురుషులిద్దరూను), పురోహితుణ్ణి, కళ్యాణమండపాలనీ, వంటవాళ్ళనీ |మొ| చూసుకోవడమేనా?

పెళ్ళి కి తమని తాము సిధ్ధం చేసుకోవడం ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకి చెబుతున్నారు?

ఒక నూతన అధ్యాయానికి తెరతీసేవేళ జరగవలసిన సంసిధ్ధత ఇంతేనా?

శుభ ముహూర్తం అంటే వధూవరులు ఒకరి శిరస్సుపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని ఒక ముహూర్త కాలం ఒకరి భ్రూమధ్యమును ఒకరు చూడాలి. (జీలకర్ర బెల్లం వాడటానికి వెనక వైజ్ఞానిక హేతువు ఉందనుకోండి). అది కాస్త పక్కనపెట్టి మిగిలినవీ ప్రాముఖ్యతని సంతరించుకోవడం సమంజసమేనా?

---***-------***-------***-------***-------***-------***----

అందుకే ఆ శుభముహూర్తానికి నాదైన రీతిలో/ నాకుచేతనైన రీతిలో సహాయం చేస్తూంటా నేను.

వధూవరులిద్దరి మధ్యన ఒక తెర పట్టుకుంటూంటారు కదా, అసలుకి తెల్లని వస్త్రాన్ని ఒక స్వస్తికాకారముగా లిఖించి దానిని తెర పట్టాలి. కాకపోతే కొన్నిచోట్ల
"తెర వెనుక అందం, తెరతీస్తే బంధం"
"దివిలో నిర్ణయం, భువిలో పరిణయం"
వంటివి చూసి, వరుడికి ఇంతకన్నా ఉత్తమంగా, శ్రేయోదాయకంగా, శుభముహూర్తం వేళకి భగవదాశిస్సుల సూచికగా తెరసెల్లా ఉంటే బావుంటుందనిపించి

"చూపులు కలిసే శుభవేళ"
"కల్యాణ మహోత్సవ శుభవేళ"

అన్న శీర్షికతో తెరసెల్లాలను శ్రధ్ధతో తయారుచేస్తూంటా....

దీనివల్ల మూడు ఉపయోగాలు.
(1) "అప్పటి దాక ఆ మాటలూ ఈ మాటలూ మాట్లాడుతూ కాలక్షేపం చేసేవారికి మండపంలో ఇట్లాంటిది చూడగానే ఒకరకమైన ఏకాగ్రత (పిచ్చా పాటీ కన్నా శుభవిషయ చర్చ)
(2) పెళ్ళి కొడుక్కి మరీ కళ్ళముందే సుందరమైన భగవద్రూపం చూడగానే అప్రయత్నం గా మానసిక ప్రశాంతత, ఏకోన్ముఖత (ఇది పెళ్ళి కొడుకులు చెప్పినదే).
(3) ఆ తెరసెల్లా పట్టుకునేది నేనే కాబట్టి వధూ వరులిద్దరికీ సుముహూర్తానికి ఒకరి భ్రూమధ్యం లో ఒకరు చూడండి. అదే కల్యాణం అంటూ చివరాఖరి నిముషం లో కూడా హెచ్చరిక చేయటానికి సావకాశం దొరకటం...

అల్లా వివిధ పెళ్ళిళ్ళకు నేనేసిన తెరసెల్లాలు...



ఇదీ వాటి మాతృక ....

Tuesday, April 6, 2010

రేఖా విలాసం


నేనేసిన బొమ్మల్లో ఇదోటి.

దీన్లో ప్రత్యేకతలేమిటో ఎవరైనా చెప్పగలరా?

(దీని మాతృకతో పాటు, దీని వెనకున్న కథా కమామిషు వివరాలు తర్వాత టపాలో ..)

Tuesday, March 30, 2010

హనుమజ్జయంతి శుభాకాంక్షలు.

దాశరధీ శతకం పద్యాలు చదువుతూంటే, నా భావాలని నేనే రాముడితో మొర పెట్టుకుంటున్నట్టు భావనే, ఎన్నేళ్ళు గా చదువుతున్నా.. ఇప్పటికీ... మిగిలిన ప్రపంచం ఉందన్న స్ఫురణే జారిపోతూంటుంది... చాల ఎమోషనల్ గా సెంటిమెంటల్ గా కూడా ఔతూంటుంది....

హనుమజ్జయంతి సందర్భం గా....నన్ను బాగా కదిలించే పద్యాలు .. ఓ మూడు ఇక్కడ...

డాసిన చుట్టమా శబరి? దాని దయామతి నేలినావు; నీ
దాసుల దాసుడా గుహుడు? తావక దాస్యమొసంగినావు; నే
జేసిన పాపమా? వినుతి సేసినఁ గావవు! గావుమయ్య! నీ
దాసులలోన నేనొకడ దాశరథీ! కరుణాపయోనిధీ!

పెంపున దల్లివై, కలుషబృంద సమాగమ మొందకుండ ర
క్షింపను దండ్రివై, మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివా
రింపను వెజ్జవై కృప గురించి పరంబు తిరంబుగాగ స
త్సంపదలియ్య నీవె గతి దాశరథీ! కరుణాపయోనిధీ!

సిరులిడ సీత, పీడ లెగఁజిమ్ముటకున్ హనుమంతు, డార్తి పోఁ
దరుమ సుమిత్రసూతి, దురితంబులు మానుప రామనామమున్
గరుణ దలిర్ప, మానవులఁ గావగఁ బన్నిన వజ్రపంజరో
త్కరముగదా భవన్మహిమ! దాశరథీ! కరుణాపయోనిధీ!

పద్యాలు రాసే ప్రారంభదశలో (యతి, ప్రాసలపై ధ్యాసేలేని పాతరోజుల్లో) ఒకానొక రోజు రాసుకున్న పద్యం...

హృదయము నందు మిమ్ము గొనినంతనె మారుతి ఆఢ్యుడయ్యెనా?
విదితము గాదె? రామ ! తమ గేహము సేసితి నాదు ఆత్మనున్
ముదమున; గాని ఆత్మ దరి జేరెడి మార్గము మర్చిపోతి; శ్రీ
మదఖిల లోక పాలక సమస్తము జూపెద ! దారి జూపినన్ !!

స్ఫూర్తి:- కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే "ఆత్మారవిందం" అనుకుంటూ నా ఆత్మని మీ ఇంటిగా తీర్చిదిద్దా... పెద్దవాళ్లైన మిమ్మల్ని ఇంట్లో పెట్టి, పిల్లాణ్ణైన నేను బయటెక్కడో తప్పిపోయా... తిరిగి ఇల్లెలా చేరుకోవాలో తెలీటం లేదు....రామా.. ఆత్మని ఎలా చేరుకోవాలో దయచేసి చెప్పవా? అక్కడ నిన్నే కాదు సమస్తాన్నీ చూపించకపోతే అప్పుడు అడుగు అని నా ని'వేదన' !! (నువ్వుంటే సమస్తమూ ఉన్నట్టె కదా...)

ఏ మార్గమైనా/ ఏ గురు సాంప్రదాయమైనా ఆత్మని తెలుసుకో, నీవెవరో తెలుసుకో అనే అంటుంది కదా... ఆత్మని తెలుసుకుంటే సమస్తమూ తెలిసినట్టే, ఆత్మారాముణ్ణి తెలుసుకున్నా సమస్తమూ తెలిసినట్టే అనే భావన ఆలంబనగా...

రామార్పణం...

Wednesday, March 24, 2010

శ్రీరామనవమి శుభాకాంక్షలు!


అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

రామ నవమికి నా 'గీత 'లు (ఒకటి భక్తుడిదీ, ఇంకొకటి భగవంతుడిదీ)


బోయి భీమన్న గారి "అశోకవనిలో రాముడు" పద్యాలలో ఇంకొన్ని ....


అశోకవనంలో రాముడు మొదటి భాగం ఇక్కడ
అశోకవనంలో రాముడు రెండవ భాగం ఇక్కడ

పది నెలలాత్మ నుంచుకుని, ప్రాణములన్ దనియించి, పెంచు కొ
న్నది కద సీత? దీర్ఘ విరహాముధి తీరి, తటమ్ము చెరుకొ
న్నది కద? ఎప్పు డెప్పు డను నాత్రము నే కులగోత్ర మడ్డు కొ
న్నదొ, రఘు రాము నిండు హృదయాన నెదో బడబాగ్ని రేగెడున్ !

సత్య మసత్య మంచెరుగ జాలదు లోకము, సర్వదా పర
ప్రత్యయ నేయ బుధ్ధి; అది వాలు నసత్యము వైపె నిత్యమున్;
సత్యము నమ్ము లోక మొక శక్తి పరీక్షనె; లోక ప్రీతి కై
ముత్యము వంటి జానకిని ముంచునె తా నస దగ్ని కీలలన్ ?

నాతియె సీత? నిశ్చల సనాతని; సాకృత బ్రహ్మ విద్య; ధీ
శ్వేత; అనాది; ఆమె రఘు శేఖరు ప్రస్థితికే ప్రబుధ్ధ సం
కేతము; సీత పట్ల తనకేమిటి వంక? అదంతె; కాని - సా
కేత జనాళి శంక తొలగించక లంకను గెల్చినట్లె టౌ?

ప్రణయము కొత్తదా? హృదయ భాండము ఉత్తద? రెండు మూడు దు
క్షణములు బాధపెట్టినను సైచి, పరీక్షకు నిల్వగా వలెన్;
రణములు, రంధి రంపులును, రచ్చలకీడ్చుటె రాజ వృత్తి; ఏ
అణువును లేదు సొంతమగు నట్టిది రాజుకు రాజ్య పధ్ధతిన్ !

"చీకటి విచ్చె నింక రఘు శేఖర సూర్యుని పాద పద్మ ప
ద్మా కరమౌదు" నంచు తమి మై మని యుండిన సీత - తా నటన్
లేక, విదారితాత్మ సళిన్ ఎటులేడ్చునొ ! ఎంత క్రుళ్ళునో !
లోకపు తృప్తికోసమిటు లుర్విజ నేచుట ధర్మమౌనటో?

సీతను తా నెరుంగడె? వశి కృత చేతను? యోగ రాగ భూ
మాతను? మర్మ వేద్య యగు మంత్రజ ఆమె; స్వతంత్ర నేడు ; ఖ
ద్యోత విభాత కాంతి సకలోర్వికి మార్గము చూపనిమ్ము; ఏ
లా తన ఇంటి వెల్గు జనమంతకు చీకటి మూల్గు కావలెన్?

శ్రావణ సంధ్యలై కురియ సాగిన కన్నులలో శరద్ద్యుతుల్
భావ విశేష పర్వములు పండగ, రాముడు లోక తారకో
జ్జీవన దీప్తినంది, విర జిమ్మెను చుట్టును మాధవోన్మనీ
శ్రీ విలస ద్విభాత రవి రేఖలు దృ క్శశి రేఖలొక్కటన్ !!

ఒక సతి, ఒక్క మాట, శరమొక్కటి - ఇయ్యవి మూడొకట్లు; ఇన్
దొకటియె చాలు మానవుని విశ్వ సమున్నతు జేయగ; మూడు నొక్కటై
వికసన మందు మానవుడు విశ్వ సమున్నతుడేల కాడు? అం
దుకె పరిపూర్ణుడై జన మనో రముడయ్యెను రాముడెంతయున్ !

వ్రత మొకటున్న, దానికొక వర్తనముండు; మార్గముండు; ని
శ్చిత మతి యైన మానవుని చేర్చును లక్ష్యము తత్ వ్రత ప్రభల్;
సతి పయి ప్రేమ, వాక్కు పయి శ్రధ్ధ , స్వశక్తి పయిన్ ప్రభుత్వ, మీ
త్రితయము కల్గు జీవుడు ధరిత్రి నెవాడును రామ దేవుడే !!


Monday, March 22, 2010

అశోకవని లో రాముడు - 2

అశోకవనంలో రాముడు మొదటి భాగం ఇక్కడ చదవచ్చు






రాతిని నాతి జేసిన పరాత్పరుడాతడు ; తత్పదాంకితో
ర్వీ తలి బీటి దేని చిగురించును పుష్ప ఫలాభిరామమై;
చేతము రామ పాద సరసీ పరిశొషిత నిత్యనూతనో
న్నూతనమై రహించు సుమనో విభవమ్మునకేది సాటియౌ !

రాముని పాదధూళి నొక రాయెదొ తోయలి యైనదంట , ఏ
లా మనవౌ అదృష్ట గతులన్ సరిచూచుకొనంగ రాదు? పో
దామని యాత్ర సాగెడునొ తచ్చరణాధ్వము వెంట-- మన్గడన్
బాములు వడ్డ జీవులిరు ప్రక్కల మూగెడు రాలు రప్పలై !

రాముడు పోవు త్రోవ కిరు ప్రక్కల నట్టిటు దూకుచున్న త
ధ్ధూమ శలాక లా చరణ ధూళికి ప్రాణము గొన్న రాళ్ళొ? ఆ
రామము గాచు వాళ్ళు ! రఘు రాముని తద్వని గాంచి భ్రాంత చి
ద్భూమిక లైన వాళ్ళు ! ఎటు తోచక చీకటి మున్గు వాళ్ళునున్ !

మిణికెడు తోట నెల్లడల - మిణ్గురులా ? ఉడు కాంతి తున్కలా?
దినమణి నుండి వేర్వడిన ధీధితి రవ్వల? అంధకార కం
ధిని వెలుగొందు రత్నముల? నెమ్మదిగా నిలువెల్ల కన్నులై
వనరమ రాము జూచు రుచి వైఖరులా? అవి సీత చూపులా?

అదె పులి యన్న, తోక అదె అందురు లోకులు ; లోక నైజ మ
ట్టిద యగు; వింధ్య కీవలి తటిన్ వనభూముల యందు రాజ్య సం
పద నెసలారు ప్రాఙ్నరుల వానరులందురు ; నామ సామ్యపుం
బదమును బట్టి పల్కుదురు వానరు మర్కటుడంచు నేరమిన్ !

సీతయు లక్ష్మణుండు తన జీవిత దృష్టికి రెండు కళ్ళు; తత్
సీతకు ప్రాణమిచ్చి, రణ సీమను కూలిన లక్ష్మణున్ పున
శ్చేతను జేసి -- అంధ తమసీ పరిశూన్యము నుండి ఎవ్వర
బ్బా, తన నుధ్ధరించ గల బంధువు వాయు సుతుండు తక్కినన్ ?

మావులు పూచె, నల్దిశల మంచు తెరల్ విరబారె, సంపేగల్
తావులు చల్లె, బర్హితతి తాండవమాడె, నగెన్ శరత్కళల్ --
భావము జానకీ వదన పద్మము చుట్టు పరిభ్రమించి శో
కావిలుడైన రాముని పదాబ్జము చుట్టు పరిభ్రమించుచున్ !

సుందర సుందర ప్రణవ సుందర సుందర సౌమ్య సౌహృదా
నంద రతీందిరుండు రఘు నందనుడా విపినేందిరా మనో
మందర సైందవ ప్రణయ మందిరుడై ఎటబో నటన్ నవేం
దిందిర బృందమై పరుగు దెంచు స్మృతుల్ క్షితిజా గత శ్రుతుల్ !

పుట్టిన దాది (ఎట్టులుగ పుట్టెనొ!) అట్టులె ఆరు వర్షముల్
మట్టిన ఉండి (ప్రాణమెటులాడెనొ!) ఆరు రసాలకున్ తనే
పుట్టిన ఇల్లుగా (తదను పూర్వము పృథ్వి రసార్ద్ర కాదొ !) చె
న్నుట్టి పడంగ సీత వెలయున్ జనధాత్రి కి అన్నధాత్రి యై !

కోమలమౌచు, సిత జడ కుచ్చులు గా అభిదన్ ధరించి, సౌ
దామని దారలట్లు వనధాత్రి ని నిండిన తీగలేమి? భృం
గామల కాళి దువ్వినపుడా కొనగోళ్ళకు చిక్కుకున్న తత్
భూమిజ కేశ లేశములు పో? రసకందము, లాత్మ విందముల్ !

తెల తెల వారు జాముల క్షితీ సుత తానె ఉషః కుమారి నాన్
అలరుల తోటలన్ దిరుగు నప్పుడు, కొమ్మల జిక్కు నామె వ
ల్కలముల వల్కముల్ మన్సు గైకొనినట్టివి సీత కోక చి
ల్కలు ! మధు ముగ్ధ మోహనములై విహరించును వన్నె చిన్నెలన్ !

జనకుడదేలొ సర్వమును సర్వుల నుండియు దాచి, గప్పు చ
ప్పున యువరాజు జేయ దల పోసెను ! కాని, రహస్య మెట్లు దా
గును, అది గాక, తా నయిన కోరెనె రాజ్యము? కొంప మున్గెనే?
తనయుల నైజముల్ కనరు తండ్రులు, కుందుదురర్ధలోభులై !

పాదములందు వ్రాలి , పర పాదుకలన్ గొనిపోయి, రాజ్య ల
క్ష్మీ దరహాస ముగ్ధముల జేసిన మానవుడొక్కడుండెనే?
మేదిని నెవ్వడేన్ పదవి మీద గలట్టి తమిన్ త్యజించెనే?
సోదర మాత్రుడే? సుగుణ సూర్యుడు పో భరతుండు చూడగన్ !

(మిగిలిన చుక్క గుర్తు పద్యాలు రామనవమి రోజున...)

1975 లో జన్మించిన నాకు మిగిలిన ఒక్కగానొక్క సంవత్సరంలో విశ్వనాథ వారు ఆశిస్సుల నందించారు, దానికి భీమన్న గారు పరోక్షం గా కారణం అయ్యి ఆయన కూడా ఆశీర్వదించారు... అన్న నా ప్రశ్న కు సమాధానం....

ఇదిగో ఈ పుస్తకమే...

1972 వ సంవత్సరం లో

భీమన్నగారి షష్టి పూర్తి సన్మాన సందర్భం లో సన్మాన సంఘం వారు సభనేర్పటు జేసి ఈ పుస్తాకాన్ని ప్రచురించిన సందర్భం లో, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారికి భక్తి తో తన కావ్య కన్యకలను భీమన్న గారు సమర్పించారుట.

ఆచార్య జి.వీ. సుబ్రహ్మణ్యం గారూ, మా నాన్నగారు, నేను పుట్టిన సంవత్సరం (1975) లో విశ్వనాథ వారింటికి వెళ్లగా, ఆయన అలమార లోనుండీ ఈ పుస్తకాలను తీసి నాన్న గారికి అందించారుట. ఎందుకో ...భగవంతునికి ఎరుక.

మానాన్న గారు నాకు ఈ మాటలను చెప్పి, భీమన్న గారి దస్తూరి ని చూపించటం లీలగా గుర్తు. ఆ ఇద్దరు మహానుభావుల ఆశిస్సుల సాక్షిగా మా ఇంట ఆ పుస్తాకాలు పూజ్య స్థానమలంకరించినవి.

సనత్

Friday, March 19, 2010

నన్ను ప్రభావితం చేసిన రామ భక్తుడు - బోయి భీమన్న


బోయి భీమన్నగారు ఓ రకంగా నాకు ఏకలవ్య గురువుగారు. ఇంకోరకంగా చెప్పాలంటే విశ్వనాథ సత్యనారాయణ గారి ఆశిస్సులను నాకు ప్రత్యక్షం ఇప్పించటానికి పరోక్షం గా కారణమైన వారు.

ఏకలవ్య గురువుగారు అని ఎందుకు అన్నానంటే నా ప్రమేయం లేకుండానే నాలోనికి చొరబడి నన్ను ప్రభావితం చేసేశారు కాబట్టి (బహుశా నా ఊహేనేమో) కాకపోతే ఇది అర్ధమవ్వాలంటే కొంచం ఉపోద్ఘాతం కావాలి...(చిన్నదే).

నా జీవితంలో అప్పుడప్పుడుగా వచ్చి దోసిళ్ళతో పట్టి రామ రసాన్ని తాగించిన మహానుభావులెందరో ఉన్నారు. పుణ్యవశం చేతనో, ప్రేమ చేతనో గానీ నాకు ఇట్లాంటి మత్తునలవాటు చేసినవాళ్ళందరూ నాకు ప్రాతస్మరణియులే. శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులవారు, శ్రీభాష్యం అప్పలాచార్యులవారు, మా తాతగారైన శ్రీపతి శ్రీధర స్వామి గారు, మా నాన్నగారైన శ్రీ రఘు రామ కుమార్ గారు, మంగళంపల్లి, నూకల, జేసుదాసు, మల్లాది సోదరులూ .. వీళ్ళందరూ ప్రత్యక్షం గానైతే పరోక్షం గా చేసినవాళ్ళల్లో హనుమంతుల వారు, త్యాగరాజు, రామదాసు, విశ్వనాథ సత్యనారాయణ గారు, ఎమ్మెస్ రామారావు గారు |మొ| ..

ఈ కోవకే చెందిన వారు శ్రీ.బోయి భీమన్న.

బోయి భీమన్నగారి గురించి కొత్తగా పరిచయం చేయనవసరంలేదు... కాకపోతే నాకూ, బోయి భీమన్నకూ, విశ్వనాథ సత్యనారయణ గారికీ గల లింకేమిటి? అదే ఇక్కడ హాట్టాపిక్కు...సస్పెన్సూ....ఏమయ్యుంటుందో మీరు గానీ ఏమైనా ఊహించగలరా???

బోయి భీమన్న నాకు ఏకలవ్య గురువుగారు అని ఎందుకు అన్నాను?? ఆయన్ను చదివిన వాళ్ళు ఎవరైనా చెప్పగలరా??

ఈలోపు "అశోక వనిలో రాముడు " కావ్యం లోనుంచీ మంచి పద్యాలు..

ముందుగా కావ్య భావన.. రావణ వధానంతరం ఆ రాత్రి రాముడు ఎవరికీ తెలియ కుండా ఒంటరిగా బైల్దేరి అశొకవనానికి వెళ్తాడు. తాను అంతగా ప్రేమించిన తన అర్ధాంగి సీత అంత కాలం పాటు లంకలో చెర అనుభవించిన అశోకవనాన్ని చూడాలని అనుకొని ఉంటాడనీ, అక్కద రకరకాల భావనలతో, బాధలతో సతమతమై, కన్నీరు కారుస్తాడనీ.. కావ్య నిర్మాణం....

రాముడు మాట్లాడకుండా తోటలో తిరుగుతున్నప్పుడు అనేక భావాలు సూర్యుడి నుండీ కిరణాల్లా మనసు నుండీ ప్రసరిస్తాయి... ఆ ప్రసారం లో రాముడి ఔన్నత్యం, ధీరోదాత్తత , మానవ లక్షణం, కార్య కారణ సంబంధం, సమాజ శ్రేయస్సు, సోషలిజం మొదలైనవనీ ప్రస్ఫుటం గా కనిపిస్తాయి.

నాదృష్టిలో రాముణ్ణి, వాడి వ్యక్తిత్వాన్ని సాపేక్షికంగా అద్దం లో చూపించినట్టు చూపిస్తుందీ కావ్యం, అందుకే నాదృష్టి లో ఈ నాటి కాలనికి రామ భక్తుడు బోయి భీమన్న.

"అశోక వనిలో రాముడు " కావ్యంలో .. నాకు నచ్చినవి, కొన్ని..

గుస గుస లాడసాగినవి కొండల గుండెలు తట్టి నిర్ఝరుల్ ;
రుస రుస లాడసాగినవి రోదసిపై ఘన హైమనీ లతల్ ;
వస వస లాడసాగినవి వన్య విహంగములర్ధ నిద్ర; సా
రస రస ధాముడా విజయ రాముడు తద్వని నట్లు సాగగన్ !

ఎక్కడివాడొ! ఏమి కధొ ! ఏ సతి కన్నదొ ! ఏల వచ్చెనో
ఇక్కడి కిప్డు ! సూర్యుడుదయించును రోజును; కాని, ఇంతగా
చక్కని వాడు చిక్కడెదొ సౌహృదముండిన దప్ప; ఇప్పుడే
మ్రొక్కెద మంచు రాము పదముల్ స్పృశియించె వనిన్ తృణాదులున్ !

రక్కసి చెట్లు రాము గని రంగులు మారె ! విభీషణమ్ములై
మ్రొక్కె మహాగమమ్ము లల మూడు జగమ్ములకేక రూపతన్;
అక్కున జేరె శ్రీలతలు ఆమని సంపదలెల్ల తామె యై ;
చొక్కె మధువ్రతాలు; వని సోభిలె రామ పదాభిరామమై ;

శివు విలు నుండబద్దవలె చేకొని, వింటికి తానె అల్లె త్రా
డవునన నిల్చి, ఆడుకొనదా జనకాత్మజ చిన్ననాడు? తత్
జవమెటు బోయె? నీ కొరకు తాళినదంతయు ! ఒక్క మట్టి పె
ల్ల విసిరి ఆమె లిప్త కొక లక్ష దశాస్యము లూడగొట్తదే?

శ్రీమదనంత మోదమున సీతను చూచిన కంట నేడు శ్రీ
రాముని జూచి, అందెవరి రాగము గొప్పదొ తేల్చుకోన్ వన
స్వామి తొ బాహు యుధ్ధముకు పాల్పడి, తేలక గ్రుద్దు కొందురో
తామె యనంగ చిక్కువడి; తద్వన వల్లులు రామునడ్డెడున్ !

తమపని తాము చూచుకొను దైత్యుల మీదన? కాదు, దైత్య త
త్వము పయి దాడి; దేహమును దాల్చిన యెల్లరు జీవితార్హులే;
తమ తెగ మాత్రమే బ్రతికి తక్కిన వారలు చత్త్రు గాక యన్
కుమతులు కూలరా? పుడమి కూతురు దుర్నయముల్ సహించునా?

శివధనువెత్తి ఎక్కిడుటె సీతను పొందుట; ముక్కలయ్యె కా
ల వశముచేత నద్ది; ఎవరందుకు బాధ్యులు? అంతదానికే
నవయువ దంపతీ ప్రణయ నాదము త్రెంచెడునే అపశృతిన్?
ఏవడది? బ్రహ్మ యన్న యతడెవ్వడు ? ఎవ్వడు ధర్మపీఠిపై ?

అనల శిఖా లతాగ్ర కమలామృత బిందు కళా ప్రపూర్ణుడై
తనువును గొన్నదాది -- సరదాకును పాపము చేయలేదు; స
జ్జన ముని మిత్ర కోటి కెదొ సాయము చేయ దలంచి తప్ప తా
ధనువును ముట్టలేదు; వల దా ఒక హేతువు ఎట్టి శిక్షకున్ ?

మనుజుడు తానుకూడ ; తన మార్గము నందును పూలు ముళ్ళు క
ల్గును ; తన చేతలందు నెవొ లోపము లుండును; కాని -- అక్రమ
మ్మొనరిచె నన్న దొక్కటియు నుండదు రామ చరిత్ర లోన; స
ర్వ నరుల నొక్క సూత్రమున రాముని హస్తము కుస్తరించెడున్ !

వాలి వధా విధాన మప వాదును తెచ్చునొ? మిత్ర కార్య దీ
క్షాళువు తాను; మిత్రునికి శత్రువు వాలి, తదన్య వన్య యో
ధాళితొ పేచిలేదు, బహి రంగరణమ్మెటు చేయు? ధర్మ సూ
క్ష్మాల నెరింగినట్టి ముని సత్తములుండరె నిర్ణయించగన్?

స్త్రీ నొకదాని జంపె; ఎవరేనియు దుష్టులు వధ్యులే; సుమో
ద్యానము నుండి కంటక లతల్ లతలైనను వర్జ్యములే కదా?
మానినులైన కామినుల మన్నన జేయడె? తానహల్యకున్
ప్రాణము పోయడే? శబరి భక్తిని గ్రోలడె? భేదమెంచెనే?

బంగరు లేడి గాంచి తన భామిని తెమ్మనుటేల? వంటకా?
చెంగున నేదొ అస్త్రమున చేకొన, కేటికి చావనేసె? దా
త్రిన్ గల ఏరికిన్ క్రియల తీరులు కర్మలు బట్టి కాదె? సా
రంగమె అద్ది? భావి రణ రంగమొ? కాలపుటంతరంగమో!

శివుని ధనుస్సు నెక్కిడుట, సేతువు కట్టుట, పంక్తి కంధరా
ద్యవమతులన్ హరించుట, మహాటవులన్ వ్యధలోర్చు, టయ్య వి
య్యవి యననేల -- రామ చరితాద్భుత కాండములెల్ల సీతవే!
అవనిజ చుట్టు అల్లుకొనినట్టివి గాధలు, వన్య వీధులున్ !

భూసుత ఒక్కనాడు, వన భోజన కేళి, స్వ హస్త పాకమున్
భాసుర లీల వడ్డన మొనర్చి, తదార్ద్ర సుగంధ హస్తమున్
బాసట నున్న భూరుహము పై నిడి నిల్వ ,తదీయ గంధమో
వీసము సోకి కాదె కరివేపగ అయ్యది నిల్చె నేటికిన్!

( మరికొన్ని తొందర్లో విడుదల.. )

పైన అడిగిన ప్రశ్నే మళ్ళీ...

నాకూ, బోయి భీమన్నకూ, విశ్వనాథ సత్యనారయణ గారికీ గల ప్రత్యక్ష - పరోక్ష లింకేమిటి? ....ఏమయ్యుంటుందో మీరు గానీ ఏమైనా ఊహించగలరా???

బోయి భీమన్న నాకు ఏకలవ్య గురువుగారు అని ఎందుకు అన్నాను?? ఆయన్ను చదివిన వాళ్ళు ఎవరైనా చెప్పగలరా ??

Monday, February 22, 2010

"పులి" విలాపం... - 1


Save Our Tigers పేరున మన పులి సంరక్షణకై జరుగుతున్న ఉద్యమానికి నేను సైతం సమిధనొక్కటి ధార పోస్తున్నా..


కం.
ఎక్స్టింక్టయ్యెను ఫాజిలు
ఎక్స్టింక్టయె డైనొజారు, లిస్టున జూడన్
నెక్స్టింకున్నది బెబ్బులి
ఎక్స్టెన్షన్నివ్వకున్న నెక్స్టింక్టవ్వన్

(extinct pieces --> fossil bird, dinosaur)


కం.
నలభై వేలకు పైగా
పులులుండెను ఈ శతాబ్ద పూర్వము, వేయి
'న్నలభై పదులకు' జేరుట
"పులిపై నొనరింపబడిన పుట్రే"...! కాదా ???

(From 40,000 to 1411)


కం.
"నాన్నా పులి"కథ కథగా
చిన్నారుల మనసు గెల్చె చిత్రముగా, నిం
కొన్నాళ్ళకు కథ మరుగై
కన్నీరు మిగిల్చునేమొ? ఖర్మ? కనన్గా...


చం.
ఒకనికి మూఢ నమ్మకము ఒక్కనికిన్ వ్యసనమ్ము, క్రీడ ! వే
రొకనికి వర్తకమ్ము! మరి యొక్కని శూరత దెల్పు దర్పణ
మ్మొకటననేల హేతువులు మూర్ఖులు వ్యాఘ్రములన్ వధింప, నిన్
దొకనికి కూడ ద్రోహమని తోచదొ, 'సాకి' ఉదంతమంతయున్ ???

Nehru Zoological Park, Hyderabad: In 2001, a tiger named Saki was killed by poachers, reportedly with the connivance of zoo staff members

ఉ.
శూరత జూపుడయ్య భువి శొకము దీర్చెడు కర్మ జేయుచున్
ధీరత జూపుడయ్య ఇల దీనుల కష్టము బాపు సత్క్రియన్
బీరువులౌచు యోగమను పేరున హింసలు మానుడయ్య ! మీ
క్రూరత వీడుడయ్య ! పులి గోరును కోరకుడయ్య ! వేడెదన్ !!
Anticipating Goodluck, Courage and valour, people often tend to wear Tiger's nail in the locket....

సనత్ కుమార్
From 40,000 Tigers at the beginning of century, they have come down to just 1411......

My poems are in reflection.....

Friday, February 19, 2010

మంచు కురిసిన (శివ)రాత్రి ...


మహాశివరాత్రి నాడు "లింగోద్భవ" సమయాన "మంచు" బిందువులు కురవటం పై నేను రాసిన పద్యం...

ఆలస్యంగానైనా నా శివరాత్రి పోస్టు..



కైలాసమ్మును జేరి భక్తి యుతులై కైవారముల్ చేసి ! "హే
ఫాలాక్షా, నటరాజ, పాహి" యనుచున్ భక్తాళి శ్రధ్ధాళులై
పాలున్, దేనె, ఫలోదకంబుల, దధిన్, భస్మాజ్యముల్, చక్కెరన్,
సాలగ్రామశిలాత్మకున్ శివునకున్ స్నానమ్ము గావింపగా
క్ష్మాలక్ష్మిన్ హిమవర్షమై కురిసె ద్రాక్షా పాక మత్తీర్థమున్ !!

అమెరికాలో రికార్డు లెవెల్లో మంచు తుఫాను (స్నో స్టార్మ్) వచ్చిందని మా ఆన్సైటు వాళ్ళు (డాలస్, కొలంబియాల్లో) చెప్పినప్పుడు సరదాగా రాసిన పద్యం...

స్ఫూర్తి:
(1) శివార్చనలో నమక చమకాదులతో అభిషేకానికి ముందు పంచామృత స్నానం, ఫలోదక స్నానం, ఆ తర్వాత శుధ్ధోదక స్నానం మంత్రాలు ఉంటాయి. కైలాసం లో శివుడికి వాటితో పాటు, భస్మాభిషేకం కూడా చేయగా ఆ పంచామృతమే భూమి పై మంచు వర్షమై కురిసింది అని భావన...
(2) "మధు క్షీర ద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయః" కాబట్టి ద్రాక్షా పాకం అని భావించా

శార్దూలాన్నాశ్రయిస్తే దానిమీద ఆవిడకూడా వస్తుందేమో కదా, కరుణిస్తుందేమో.. పద్యం మరీ అతుకుల బొంతలా కాకుండా ఉంటుందేమో అనిపించి అందులో కుస్తీ పట్టా...

ఇక్కడొక విషయం చెప్పాలి. ఇది నేను రాసిన రెండో శార్దూలం (మొదటిది భైరవభట్ల వారిచ్చిన భూతమ్మగుదాని బ్రీతిమతులై వీక్షించిరద్దేవతల్ అన్న సమస్యకి నా ప్రయత్నం.. పూరణ కాదు కాబట్టి...)

శార్దులంలో మనకు గురువులు చాలా అవసరం వుంటాయి. అందుచేత ద్రుతాల నెక్కువగా వాడుకోవాల్సి వస్తోంది, కరెక్టో కాదో తెలీదు కొన్నైతే ద్రుతము మీద ద్రుతము వేయాల్సి వస్తుందేమో అనుకునా..
నాకా... అంతర్జాలం లో (తెవికి, పద్యం.Net)చదువుకుని, పదాలు కూడబలుక్కుని, గణాలు లెక్కలు పెట్టుకుని రాయటం మాత్రమే వచ్చు. నా జ్ఞానం అంతంత మాత్రమే... అందువల్ల రాఘవ గారినీ, కామేశ్వర్రావు గారినీ కష్టపెట్టాననుకోండి... మొత్తమ్మీద (మహా)దేవుడి దయ వల్ల పద్యం బానే వచ్చినట్టు అనిపించింది.

ఇక మీరే చెప్పాలి....

పంచామృత స్నానం.. (ఫోటోల్లో)....

క్షీరేణ స్నపయామి


దధ్నా స్నపయామి


మధ్నా స్నపయామి


ఆజ్యేన స్నపయామి


శర్కరయా స్నపయామి


ఫలోదకేన స్నపయామి


భస్మ విలేపనం సమర్పయామి...