Sunday, April 12, 2009

రాముడూ - స్ఫూర్తి -8- జల చరాలు.

రాముడితో రాళ్ళు ఇట్లా సంభాషిస్తున్నప్పుడు ఆ రాళ్ల క్రింద నున్న సముద్రం నుండీ ఇంకొన్ని గొంతులు వినిపించాయిట.

"రామా నువ్వు సర్వ సుగుణ రాశివనీ, గుణ శ్రేష్ఠుడవనీ, యావత్ ప్రపంచం, నీకు తోచిన రీతి లో సేవ చేసుకుంటున్నారనీ తెలిసి, మేమూ మాకు చేతనీన సహాయం చేసి తరిద్దాం అని ఆత్రం గా ఎదురు చూస్తూంటే నీ స్నేహితుడొచ్చాడని గుహుని పడవ ఎక్కి వెళ్ళిపోతావా స్వామీ !! మేమేం అన్యాం చేసాం స్వామీ !! అప్పుడంటే సీతమ్మవారు కూడా ఉంది. పోనీ లే అని సర్దుకు పోయాం. కనీసం రెండవ సారైనా వారధి నిర్మించే సమయంలోనైనా నీ పాద స్పర్స దొరుకుతుందని ఎంతో ఆశపడ్డాం. మమ్మల్ని మాత్రం వద్దనుకున్నవా తండ్రీ !! నిన్ను అర్చించుకునేందుకు మేము మాత్రం అర్హులము కాదా ! మా జన్మకి చరితార్ధకత లేదా !! అని అడుగుతున్నాయిట నీటి లోని జల చరాలు.

రాముడన్నట్ట "అరెరే ! పాపం వీళ్ళు కూడా ఎంత నొచ్చుకుని ఉంటారో కదా !! అస్సలు గమనిక లో లేకపోయిందే !! వీరి మనోభీష్ఠాన్ని తీర్చవలసిందే" అని కృత నిశ్చయుడయ్యట్ట.

అందుకేం కృష్ణావతారం లో మొట్టమొదట చేసిన పని - వాళ్ళ మధ్యకి వెళ్ళి పోయాట్ట. కామర్సు భాష లో చెప్పలంటే ఏదైతే carry forward అవుతుందో అదే brought forward గా కనిపిస్తూంటుంది కదా !! అలా . అందుకే మొట్ట మొదట గా ఈ పని అయిపోవాల్సిందే అని యమున వద్దకి వెళ్ళాట్ట.

యమున, అందులోని జలచరాలూ ఆనందంతో "పొంగి పోయాయి ట". అదీ - యమున పొంగిపోవటం వెనుక ఉన్న అసలు కథ. లేక పోతే ఎంతో మంది మహర్షులు, యాదవులు వేసుకున్న పథకం మారిపోయి నీటి మధ్య నుండీ కృష్ణుడు రావటానికి బలమైన కారణం వేరే ఏమిటీ కనబడటం లేదు. కంసుడి మృత్యువు దేవకీ దేవి అష్టమ గర్బ్భం గా రాబోతున్నదని పలికిన అశరీర వాణి ఆ పరంధాముడే వస్తూంటే, ఆ మాత్రం అయినా చెప్పక పోదా.. ఏర్పాటు చేయకపోదా. ఆకస్మికం గా (సాప్ట్వేర్ భాషలో చెప్పాలంటే) dynamic గా ప్లాను / పథకం మార్చేయటానికి బలమైన కారణం ఇంతకన్న ఏమయ్యుంటుందంటారు?

కన్గొన లేని బాధ కడ కన్నులు నింపగ పల్కె "నావలో
నిన్గొని పోయిరొక్కపరి, నీటను వారధి గట్టి రాపయిన్
నిన్గను కోర్కె తీరదొకొ ! నీ దయ రాదొకొ ! నీవు నీటిలో
మున్గిన వారి గోడు విని మోక్ష మొసంగగ వేగ రావొకో "!

స్ఫూర్తి: భద్రాచలం లో వరదలు ప్రతీ ఏడూ వస్తూంటాయనీ, అవి వచ్చినప్పుడు ఈ మేర వరద నీరు చేరుతుంది అని స్థానికులు రాముల వారి కోవెల ప్రాకారం గోడల పై నీటీ చారలు చూపించినప్పుడు కలిగిన భావన. బహుశా గోదావరి లో జల చరాలన్నీ కనీసం ఏడాదికొక్కసారైన రాముల వారు నడయాడిన ప్రదేశం మనసారా ముద్దాడి తిరునాళ్ళు చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతూంటాయేమో...

2 comments:

రాఘవ said...

బావుందండీ. నాకు భద్రగిరి రామయ్య పాదాలు కడగంగ పరవళ్లు తొక్కింది గోదారి గంగ అన్న పంక్తులు గుర్తొచ్చాయి. :)

తర్వాత, ఇక్కడ మ్రోల సరిపో(లే)దేమోనండీ.

Sanath Sripathi said...

రాఘవ గారు. ధన్యవాదాలు.
మీ సూచన మేరకు "మున్గిన వారి గోడు విని" అవి సరిచేసా.