Tuesday, August 25, 2009

మా తాతగారి కబుర్లు...



"చిత్ర రచన అక్షర లక్షల జపంతో సమానం", "చిత్ర కళే-లక్ష్మీ కళ. లక్ష్మీ కళే-చిత్ర కళ." అని నిర్వచించటమే కాక, దాన్నే శ్వాశించి, జీవించిన వారు మా తాతగారు..శ్రీ శ్రీపతి శ్రీధర స్వామి.

ప్రత్యేకించి ఆయన ప్రస్తావన ఇక్కడ తీసుకురావటానికి కారణం - ఋషిపంచమి - వారి జన్మదినం. ఆయన అసలు పేరు శ్రీధర్. స్వాతి మాసపత్రికలో వస్తున్న 'కోతి కొమ్మచ్చీ లో ముళ్ళపూడి వెంకట రమణ గారు తొలినాళ్ళ లో తనకు ఈ 'శ్రీధర్ ' ఎలా సహాయం గా నిలబడి చేయూత నందించారో కూడా చక్కని మాటల్లో వెలిబుచ్చారు. ముళ్లపూడికి వరసకి అన్నయ్య మా తాతగారు. (పెద్దతల్లి, పినతల్లి బిడ్డలు)

మా తాతగారికి నలుగురు సంతానం, ఆపై భార్యా వియోగం. పిల్లల్ని తల్లీ తండ్రీ తానే అయి పెంచారు. అందరి లానే పొట్టకూటికి కొసం ఎవో పనులు చేసుకుంటూంటే ఇక కధేముంది? నడిచేదైవం, కంచి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఒకసారి తిరుపతిలో మా తాతగారిని చూసి "నువ్వు కారణ జన్ముడివి. దైవ సమర్పణం గా జీవితాన్ని కొనసాగించు, ఇక పై నీ పేరు శ్రీధర స్వామి అన్నారుట." ఆయన ఆశీర్వాద బలంతో, అఖండజ్యోతీ దీపరాధన శక్తితో, పద్ధెనిమిది సంవత్సరముల (18 yrs) మౌనవ్రత దీక్షతో వెయ్యిన్నీ యాభై 1050 తైల వర్ణ చిత్రాలు రచించారు శ్రీధరస్వామి గారు. వెంకటేశ్వర సుప్రభాతం, కనకధారాస్తోత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలు, వాల్మీకి రామాయణం, కృష్ణలీలలు. ఇలా అయిదు విభాగాల్లో ఆయన అశేషమైన కృషి చేసారు.

పాత కాలం "వెంకటేశ్వరవైభవం" సినిమా ఎవరికైనా గుర్తుండి ఉంటే అందులో స్వామి వారి సుప్రభాతం జరిగినప్పుడు చూపించిన తైల వర్ణ చిత్రాలు వారు రచించినవే. దాదాపు 25-30 ఏళ్ళ క్రితం గుంటూరు, భీమవరం, మద్రాసు టి.టి.డి. కళ్యాణ మండపాలలో కూడా ఆయన చిత్రాలు అలంకరింపబడి ఉండేవి. ఈ మధ్య కాలం లో (1992-95 మధ్య) ప్రతీ శనివారం ఉదయం 6 గం.ల నుండీ 6:30 వరకూ జెమినీ టీవీలో వెంకటేశ్వర సుప్రభాతానికి అర్ధ భావ వివరణ వచ్చేది.

ఆ చిత్రాలకు మా తండ్రి గారు శ్రీపతి రఘురామ కుమార్ గారూ, మా బాబాయిలు జనార్ధన రావుగారు, సత్యాజీగారూ, బాలసుబ్రహ్మణ్యం గారూ వ్యాఖ్యానాన్ని వివిధ భాషల్లొ అందించేవారు.


రాష్రపతులూ, గవర్నర్లూ మొదలు వివిధ మఠాధిపతులూ, పీఠాధిపతులూ, కేంద్ర రాష్త్ర మంత్రులూ, సినీ ప్రముఖులూ...రాజకీయవేత్తలూ..., విద్యావేత్తలూ..., సంస్థలూ, స్కూళ్ళూ.. ఇట్లా యావత్భారత దేశం నలుమూలలా మాతృకళాకేంద్రం తరఫున ఈ ప్రదర్శనలనిస్తూ ధర్మ ప్రచారానికి తమవంతు కృషిని అందించి మన్నలను పొందారు. ఋషుల అంతరార్ధ విశేషార్ధాలనూ, సందర్భోచితంగా, ప్రాంతాలకనుగుణం గా తుకారము, నామదేవు, కబీరు, పురందరదాసు అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు వంటి వాగ్గేయ కారుల కృతులతో అన్వయిస్తూ తెలుగు, హింది, ఇంగ్లీషు, తమిళం, కన్నడ, మరాథీ, గుజరాతీ భాషల్లో వ్యాఖ్యానాన్ని చిత్రకారుల కుమారులు అందించేవారు.

77 సంవత్సరాలు ప్రాకృత శరీరం లో జీవించి, తన చిత్ర రచన ద్వారా యశః కాయులయ్యారు మా తాతగారు.

ఆయన చిత్రాలు, ప్రత్యేకించి ఈ క్రింది చిత్రం ఎన్నో ఇళ్ళల్లో నిత్యం ఇప్పటికీ పూజలందుకుంటూనే ఉంది.

లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధోః
సంసార సాగర సముత్తరణైక సేతో
వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

అనే 28వ శ్లోకానికి వారు చేసిన చిత్ర రచన.


లక్ష్మికి నివాసస్థానమైన వాడా అన్నందుకు శ్రీవారి వక్షస్థలం లో అమ్మవారిని, వంకలేని గుణాలన్నిటికీ సముద్రము వంటివాడా అన్నందుకు సముద్రాన్ని, సంసారము అనే సాగరాన్ని దాటడానికి ఒకేఒక వంతెన వంటివాడా అన్నదుకు ఆ సముద్రం లో అలలవలే జీవులనూ వారి మధ్యనే నిలబడ్డ స్వామినీ, వేదాలకూ ఉపనిషత్తులకూ సారమైన ఓంకారం చే తెలియబడేవాడా అన్నందుకు ఓంకారాన్ని, సాలోక్య సారూప్య సామీప్యాలలో భక్తులచే కొలువబడేవాడా అన్నదుకు కాషాయం రంగులో ఒడ్డున ఉన్న భక్తులనూ, వేంకటాచలపతీ అన్నదుకు, స్వామివారి వెనుక తిరుచూర్ణం తో కూడిన సున్నపు రాయి కొండగానూ, సుప్రభాతం అన్నదుకు సూర్యోదయాన్ని సూచిస్తూ చిత్రీకరించారు.

ప్రస్తుతం ఈ దృశ్యశ్రావ్య ప్రదర్శనలను మా చిన్న బాబాయి బాలసుబ్రహ్మణ్యం గారు అందిస్తున్నారు. ఈ చిత్రకారుడి కళను తిలకిద్దామనుకునే ఆసక్తి కలవారు టపా వ్రాసి కానీ, ఫోను ద్వారా కానీ బాబాయిని సంప్రదించవచ్చు. 91 9347950531. sripathibs4@gmail.com

కొసమెరుపు: 12 సంవత్సరములుగా సంతానం కై ఎదురుచూస్తున్న మా సోదరి, సరిగ్గా ఋషిపంచమి నాడే పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. ముత్తాతగారే మళ్ళీ వచ్చి నన్ను మేనమామను చేశారేమో అని డౌటు.మా తాతగారు చిరస్మరణీయులే కాదు, మాకు ప్రాత స్మరణీయులు కూడాను.

Thursday, August 13, 2009

మా బుడుగు - నా స్ఫూర్తి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
సమయాభావము చేతను
సమయానికి ఇతర జనుల సందడి చేతన్
కమనీయంబౌ భావము
గమనించియు బ్లాగలేని గతి గలిగెను! హా !!

కొన్నాళ్ళోపిక పడదా
మన్నా మనసొప్పలేదు, మారము జేయన్
విన్నాడేమో నా మొర
అన్నట్లుగ సంఘటనలు అగుపడ జేసెన్

పిల్లవాడు పాఠ మెల్లకంఠస్థంబు
చేసి గూడ తప్పు జెప్పుచుండె.
పక్కనున్నవారు పలుమారలందింప
తడవ తడవ కిట్లు తడుము కొనెను
ఏమటంచు నడుగ "నేదేని వాక్యమ్ము
నందజేయమనుచు" నతడు పల్కె
"చిన్ని సాయమిచ్చి చేయూత నందింప
పాఠ్య మొప్పజెప్పి పాడగలను."

దాన్ని జూడగానె తలపు లోపల చిన్న
మెరుపు మెరిసి నట్లు మిణుకు మనియె
రామ భావమిట్లు రమణీయతను గూడి
పద్య రూప మంది పల్లవించె.


"హనుమంతుడు హృదయములో
నిను చూపుటదేమి వింత? నిర్మల రూపా !!
నిను నా అత్మన్నిల్పితి !
కనుగొన నిదె గొప్ప వింత ! కాదందువటే !!

ఆత్మ జేరి మిమ్ము ఆరాధనముసేయ
దారి గోచరించ దాయె మాకు
ఒక్క సారి దారి చూపింపుమాపైన
అన్ని జూపగలము ఆత్మ నందు."

ఎట్టియోగమైన, ఏమార్గమైననూ
ఆత్మ నెరుగుమనును ఆర్తి తోడ.
తనను తాను తెలియ, తనలోని దైవమ్ము
తెలియు తెలివి తేట తెల్ల మగును

బడికి పో తలంచి బట్టీలు పడుతున్న
చిన్న వాణ్ణి జూడ చిత్తమందు
తత్వమిట్లు మెదలి తనువంత వ్యాపింప
మనసు పులకరించి మరులు పొందె

ఉన్నాడేమో అన్నిట !
కన్నాడేమో గుణాధికములౌ భావాల్
ఎన్నో దినముల ఎడబా
టిన్నాళ్ళకు తీర రాముడిట్లు స్ఫురించెన్ !!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


అనరే నీవే దిక్కని
చనరే వ్రజ సీమ, హృదయ చక్షుల తోడన్
కనరే మానస చోరుని
వినరే మురళీ రవమ్ము ! వేడ్కలు తీరన్