Sunday, April 12, 2009

రాముడూ - స్ఫూర్తి -8- జల చరాలు.

రాముడితో రాళ్ళు ఇట్లా సంభాషిస్తున్నప్పుడు ఆ రాళ్ల క్రింద నున్న సముద్రం నుండీ ఇంకొన్ని గొంతులు వినిపించాయిట.

"రామా నువ్వు సర్వ సుగుణ రాశివనీ, గుణ శ్రేష్ఠుడవనీ, యావత్ ప్రపంచం, నీకు తోచిన రీతి లో సేవ చేసుకుంటున్నారనీ తెలిసి, మేమూ మాకు చేతనీన సహాయం చేసి తరిద్దాం అని ఆత్రం గా ఎదురు చూస్తూంటే నీ స్నేహితుడొచ్చాడని గుహుని పడవ ఎక్కి వెళ్ళిపోతావా స్వామీ !! మేమేం అన్యాం చేసాం స్వామీ !! అప్పుడంటే సీతమ్మవారు కూడా ఉంది. పోనీ లే అని సర్దుకు పోయాం. కనీసం రెండవ సారైనా వారధి నిర్మించే సమయంలోనైనా నీ పాద స్పర్స దొరుకుతుందని ఎంతో ఆశపడ్డాం. మమ్మల్ని మాత్రం వద్దనుకున్నవా తండ్రీ !! నిన్ను అర్చించుకునేందుకు మేము మాత్రం అర్హులము కాదా ! మా జన్మకి చరితార్ధకత లేదా !! అని అడుగుతున్నాయిట నీటి లోని జల చరాలు.

రాముడన్నట్ట "అరెరే ! పాపం వీళ్ళు కూడా ఎంత నొచ్చుకుని ఉంటారో కదా !! అస్సలు గమనిక లో లేకపోయిందే !! వీరి మనోభీష్ఠాన్ని తీర్చవలసిందే" అని కృత నిశ్చయుడయ్యట్ట.

అందుకేం కృష్ణావతారం లో మొట్టమొదట చేసిన పని - వాళ్ళ మధ్యకి వెళ్ళి పోయాట్ట. కామర్సు భాష లో చెప్పలంటే ఏదైతే carry forward అవుతుందో అదే brought forward గా కనిపిస్తూంటుంది కదా !! అలా . అందుకే మొట్ట మొదట గా ఈ పని అయిపోవాల్సిందే అని యమున వద్దకి వెళ్ళాట్ట.

యమున, అందులోని జలచరాలూ ఆనందంతో "పొంగి పోయాయి ట". అదీ - యమున పొంగిపోవటం వెనుక ఉన్న అసలు కథ. లేక పోతే ఎంతో మంది మహర్షులు, యాదవులు వేసుకున్న పథకం మారిపోయి నీటి మధ్య నుండీ కృష్ణుడు రావటానికి బలమైన కారణం వేరే ఏమిటీ కనబడటం లేదు. కంసుడి మృత్యువు దేవకీ దేవి అష్టమ గర్బ్భం గా రాబోతున్నదని పలికిన అశరీర వాణి ఆ పరంధాముడే వస్తూంటే, ఆ మాత్రం అయినా చెప్పక పోదా.. ఏర్పాటు చేయకపోదా. ఆకస్మికం గా (సాప్ట్వేర్ భాషలో చెప్పాలంటే) dynamic గా ప్లాను / పథకం మార్చేయటానికి బలమైన కారణం ఇంతకన్న ఏమయ్యుంటుందంటారు?

కన్గొన లేని బాధ కడ కన్నులు నింపగ పల్కె "నావలో
నిన్గొని పోయిరొక్కపరి, నీటను వారధి గట్టి రాపయిన్
నిన్గను కోర్కె తీరదొకొ ! నీ దయ రాదొకొ ! నీవు నీటిలో
మున్గిన వారి గోడు విని మోక్ష మొసంగగ వేగ రావొకో "!

స్ఫూర్తి: భద్రాచలం లో వరదలు ప్రతీ ఏడూ వస్తూంటాయనీ, అవి వచ్చినప్పుడు ఈ మేర వరద నీరు చేరుతుంది అని స్థానికులు రాముల వారి కోవెల ప్రాకారం గోడల పై నీటీ చారలు చూపించినప్పుడు కలిగిన భావన. బహుశా గోదావరి లో జల చరాలన్నీ కనీసం ఏడాదికొక్కసారైన రాముల వారు నడయాడిన ప్రదేశం మనసారా ముద్దాడి తిరునాళ్ళు చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతూంటాయేమో...

Tuesday, April 7, 2009

పచ్చనైన చెట్టు పద్యమయ్యె! - రామాయణం

భైరవ భట్ల కామేశ్వర రావు గారు http://www.padyam.net లో పద్యం తో కసరత్తు లో పచ్చనైన చెట్టు పద్యమయ్యె అని మొదటి సమస్య ని పూరణ కు ఇచ్చారు. ముందు ఒక పద్యం రాసా..

తేట తెనుగు గాలి తెమ్మెరలు 'గద్యాలు',
స్వాంత 'వచన' విరులు, స్వాగతింప,
సేద దీర్చి అతిథి సత్కార ములుసేయు
పచ్చనైన చెట్టు 'పద్య ' మయ్యె !!

సాహిత్య పరంగా 'గద్యం, వచనం, పద్యం ' లతో పూరణ బాగానే అనిపించింది కానీ తృప్తి కలగలేదు
రామనవమి భావాల్లో నే ఇంకా తూగుతున్నందుకో ఏమో ఆ పద్యాన్ని పూరించే ప్రయత్నం లో రామాయణ స్ఫూర్తి తో మరి రెండు భావాలు మెదిలాయి.

రామ కథల కల్ప వృక్షమ్ము నననేమి?
కాండలందు ఇక్షు ఖండ మెట్లు
అలరె? నంచు గురుడు అడుగ శిష్యుడు తెల్పె
'పచ్చనైన చెట్టు', 'పద్య మయ్యె' !!

అయినా తృప్తి చాలలేదు.

గరళ తరులు నీదు కరుణ సోకగ నెట్లు
మరలె మరల మరులు మరువలేక?
అమృత కరము నైన కర పత్రమేదయ్యె?
'పచ్చనైన చెట్టు', 'పద్య మయ్యె' !!

* గరళ తరువు = విష వృక్షం.

రామ నామ మహిమ ఎంతటిదంటే దానిని పట్టుకున్నవాడు ఎటువంటి వాడైనా వాడికి మహత్వం అబ్బాల్సిందే, రామాయణ కల్ప వృక్షాల పుస్తకాలు ఎన్ని అమ్ముడయ్యాయో విష వృక్షాలూ అన్ని అమ్ముడయ్యాయి. బాంధవమున నైన పగనైన వగనైన అన్నట్టు తిట్టుకుంటూ నైనా రామ నామాన్ని జపించాల్సిందే... తిట్టుకుంటున్నప్పుడు అక్కసు తో ఇంకొచం ఎక్కువ సార్లు అంటామేమో కూడా ... మంచో చెడో 'పట్టున్న 'విషయం లెకుండా పుస్తకాన్ని రాయడమూ వీలుకాదు, రాసినా గీసినా అది చదివేవాడూ ఉండదు. కాబట్టే 'వాణ్ణి 'పురుషుడు అన్నారేమో. దాశరధీ శతకం లో చెప్పినట్టు చెప్పాలంటే... "మ్రొక్కిన నీకె మ్రొక్క వలె, మోక్ష మొసంగిన నీవె ఈవలెన్ తక్కిన మాటలేమిటికి?" ఇప్పటి కాలానికి అనుగుణం గా చెప్పుకోవాలి అంటే మేనరిజమ్సు ఏ రజనీకాంత్ కో రామారావుకో పెడితే జనాలు నీరాజనాలు పడతారు కానీ సైడు కారెక్టరులకి పెట్టరూ, పెట్టినా అవి అంతగా పండవు. ఒక 'బిల్లా ' కావాలన్న, ఒక 'లవకుశ 'కావాలన్న.. సరైన హీరో కావాలి

మళ్ళీ అసలు విషయానికి వచ్చేస్తే, అందుకేనేమో విశ్వనాథ సత్యనారాయణ గారిని వాళ్ళ నాన్నగారు "రాస్తే గీస్తే రామాయణం రాస్తే అర్ధం పరమార్ధం గానీ కవిత్వాలు ఎన్ని రాస్తే మాత్రం ఏముందీ రా " అన్నారుట. రామాయణం ఒక నవల/ పుక్కిట పురాణం అనుకున్నా, ఆ పాత్రలూ, దానిని మలచిన విధానం... దాన్లోని కథ, అప్పటి నుండీ ఇప్పటి దాకా అలా చెప్పుకుంటూ వచ్చేలా ఊరించ గలుగుతోంది అంటే దాన్లో 'ఏదో 'ఉంది. వెతుక్కున్న వారికి వెతుక్కున్నంత. ఒక సినిమా అందరికీ నచ్చాలని లేదు. ఒక కథ అందరికీ నచ్చాలనీ లేదు. అందుకే ఇంతక ముందు ఎందరో రాసిన రామాయణాన్నే మీరూ ఎందుకు రాస్తున్నారు అని అడిగితే విశ్వనాథ వారు ' ఏ జీవ లక్షణానికి సరిపోయింది ఆ జీవ లక్షణం ఉన్నవాడు చదువుకుంటాడు. ఇంతక ముందు ఎందరో తిన్న, నా ఆకలి నాది, నా రుచి నాది, నా తృప్తి నాది అన్నారు ట (నేను విన్నదె కానీ నిజమో, కాదో నాకు తెలీదు అనుకోండి). అప్పుడు రాశారుట రామాయణ కల్పవృక్షం కావ్యాన్ని. అమోఘమైన రచన. నేను చాలా కొంచమే చదివాను కానీ చదువుతున్నంతలో ఎదో తెలియని మత్తు. సాహిత్యాన్ని, దాన్లోని రసాస్వాదన నిపూర్తి గా అర్ధం చేసుకోలేదు కూడా.

అయినా రాముడన్నా విశ్వనాథ అన్నా ఎంతో ఇష్టం కాబట్టి ఇద్దరినీ స్మరించుకుందామని ఈ టపా రాస్తున్నా..

నా రుచి నాది, నా తృప్తి నాది .

గమనిక. మీ భావాలు అందుకు విరుధ్ధం గా ఉంటే అది మీ వ్యక్తి గత స్వేచ్చ. నా భావాలే సరైనవని నేను అనటం లేదు. మీరు అనదలచుకుంటే ఇక్కడ మాత్రం దయచేసి మీ అక్కసు వ్యక్త పరచకండి. మీ మీ బ్లాగుల లో యధేచ్చ గా వ్వ్యక్త పరచుకోండి.

ఈ మాత్రం సహకరించండి.

Sunday, April 5, 2009

రాముడూ - స్ఫూర్తి -7- రాళ్ళు.

అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !!
పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం.

మోహనమైన రూపు నవమోహనమై ప్రసరించు చూపు స
మ్మోహనమైన భాషణము మోదము కూర్చు ప్రవర్తనమ్ము మ
న్మోహనమైన రీతి నగు మోమున గన్పడు రాముడా జగ
న్మోహను డెల్లకాలముల మోక్ష పథమ్మున నిల్పు గావుతన్ !!

ఆఫీసు హడావుడి తో రాముడూ స్ఫూర్తీ పై గత కొద్ది రోజుల గా రాయలేకపోయా. రాముడి దయవల్ల రెండ్రోజులు రామ నవమి చేసుకోవటం తో కొంచం సమయమూ, అనందమూ, ఉత్సాహమూ కలిసి వచ్చి మళ్ళీ ఇంకొక టపా రాస్తున్నా.

ఇక రాబోయే 4-5 టపాలూ రాముడూ - Thanks Giving పైనే ఉంటాయి. రాముడూ - స్ఫూర్తి- రాళ్ళూ, రాముడూ -స్ఫూర్తి- జల చరాలూ, రాముడూ -స్ఫూర్తి- పళ్ళూ, |మొ|

ముందు గా రాముడూ - స్ఫూర్తి- రాళ్ళూ

రాముడు తనకి సహాయ పడ్డ వారందరికీ కృతజ్ఞతా భావంతో ఆశీ:పూర్వకంగా వరాలను అనుగ్రహించాడు ట. అప్పుడే ఆ వరుసలో ఆఖరున ఉడుత ఉన్నదనీ దానిని ఏవిధం గా అనుగ్రహించాడో ఇక్కడ మనం చదువుకున్నాం.....

ఉడుత గుర్తుకురాగానే వారధీ నిర్మాణం మదిలో మెదిలిందిట రాముడికి. వారధీ నిర్మాణం లో ముఖ్య భూమిక వహించిన వారిని అందరినీ మనసులో తలచుకున్నాడుట. రాముడు ధర్మ స్వరూపుడు కదా... ఆయనకు అందరూ ఒక్కటే.అందుకే నర వానరులను ఎటువంటి భేధాభిప్రాయం లేకుండా సమానం గా చూచాడు. స్మృతి పథం లో మెదలిన కొందరు ప్రత్యేకమైన వారిని పలకరించటానికి తానే వారి వద్దకు చేరుకున్నాట్ట.

వారెవరో కారు... మన రాళ్ళు. వారధి వద్దకు చేరుకుని అడిగాడట రాళ్ళను. నీటి పై తేలియుండడమే కాక అశేష వానర సేననూ సముద్రం దాటించటానికి మీరు చేసిన సహాయం అమేయం. రామ నామ మహిమ ను చాటిన మీ భక్తి ప్రపత్తులు అమోఘం. మీకు ఏ వరం కావాలో కోరుకోండి అన్నాడుట.

అచేతనములూ, ప్రాణ రహితములూ అనుకునే రాళ్ళ లో కూడా మనసుంటుందని భావించి రాముడు వారి మనోగతాన్ని అవలోకనం చేసుకోడానికి కళ్ళు మూసుకున్నాట్ట. నువ్వు సముద్రుడిని దారి ఇవ్వమని కోరుతూ మూడు రోజులు దీక్ష చేపట్టినప్పుడు మాత్రం మేమందరం ఎంత మనోవేదన అనుభవించామో తెలుసా.. నీ సేవ చేసే అవకాశం దొరికే ఒకే ఒక్క అదృష్టమూ చేజారిపోవలసిందేనా..అని. నీ సేవ చేయగలుగుతామో లేదో అన్న భారం తో బరువెక్కిన మా తనువులు నీ నామాన్ని ధరించే అవకాశం రావటం తో తృప్తి తో తేలికైపొయాయి... ఇది చాలు అన్నాయిట. అయితే వారిలొ చిన్ని గులక రాళ్ళు మాత్రం రాముడి వంక బుంగమూతి తో చూస్తున్నాయిట. బుంగమూతి ఎందుకుట అంటే బంధుత్వం కలుపుతున్నయిట (చిలిపి గా). పోనీ మీరు చెప్పండి అన్నాడుట రాముడు. అందరూ మనసు బండరాయి ని చేసుకుని అని వాడుతూంటారు. ఏం? బండరాయికి మాత్రం మనసుండదా..?అందరూ అసలు అలా ఎందుకు అనాలి అన్నాయిట. తేనెలొలికే పూల బాలలకు మూణ్ణాళ్ళ ఆయువువెందుకిచ్చావో నీకే ఎరుక. కాకపోతే బండరాలను చిరాయువులు గా ఎందుకు దీవించావు? చెప్పు - మా జన్మ కి సార్ధకత ఎలా? అని అడిగాయిట.

అప్పుడు అన్నాట్ట రాముడు మీ హృదయాన్ని ఆవిష్కరిస్తే అవి చాటి చెప్పే సత్యాలు, ధర్మాలూ శాశ్వతం గా నిలిచి ఉంటాయి. శిల శిల్పం అయినప్పుడు మాత్రమే చిరాయువుగా నిలిచినందుకు సార్ధకత అన్నాడుట. అప్పటి నుండీ శిలలు శిల్పాలై, విగ్రహాలై ఆలయ ప్రాకారాల్లో భగవన్మహిమ ను చాటుతూ చిరస్థాయి గా నిలిచాయిట.

చం:
తడవగ రాళ్ళు నీదు 'మరదళ్ళు'ను కాదొకొ - 'బావ' కావొకో !
పుడమిజ తోడబుట్టువుల పూజలు నోములు నీవెరుంగవో !
(జడములచేతనమ్ములని జాగొనరింపగ నెంచుచుంటివో !)
అడుగిడి జన్మ సార్ధకత నందునటుల్ శిల శిల్పమౌనటుల్
కడపటి కోర్కె తీర్చగదె ! కావగ రాగదె ! బ్రోవ రాగదే !!

స్ఫూర్తి !!
మా అమ్మగారు భద్రాచలం లో పసుపు రాయి, కుంకం రాయి, నార చీరలూ చూడడానికి అతి కష్టం మీద నడుస్తూ ఎంత అదృష్టమో కదా, రాముడు నడచిన రాళ్ళను చూస్తేనే ఇంత సంతోషం గా ఉందే, ఇక ఆయన నడిచినప్పుడు ఇవెంత ఆనందించి ఉంటాయో కదా అని అన్నప్పుడు కలిగిన భావన. రామార్పణం.