Tuesday, August 16, 2011

విశ్వనాథ సమగ్ర సాహిత్య గ్రంథావళి




వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనంలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్ష్యం వెల్లివిరిసేట్టు గా రచించిన మహా కవి 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు; "కవి సమ్రాట్" బిరుదాంకితుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత - శ్రీ విశ్వనాథ సత్యనారాయణ.

ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.- కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింప బడినవాని సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ఆయన రాసిన రచనలన్నీ కలిపితే లక్షపుటలుండవచ్చును అటువంటి విశ్వనాథ వారి సమగ్ర సాహిత్య గ్రంథావళిని విశ్వనాథ వారి మనుమడు, విశ్వనాథ పావని శాస్త్రి గారి అబ్బాయి - విశ్వనాథ సత్యనారాయణ (బహుశా జూనియర్ అనాలేమో)  పునర్ముద్రణ గావించారు.

మంచి కాగితం పై మంచి ముద్రణతో పుస్తాకాలు అందుబాటులోకి వచ్చాయి.

(1) నవలలు - 57 పుస్తకాలు --> 4500/-  
(2) నాటకములు - 16 పుస్తకాలు --> 666/-  
(3) విమర్శ గ్రంథాలు - 11 పుస్తకాలు --> 1116/-  
(4) పద్యకావ్యాలు (రామాయణ కల్పవృక్షం తో కలిపి) --> 1500/-
(5) పాటలు, ఇతరములు (కిన్నెరసాని పాటలు మొ||)  --> 500/-

వెరసి మొత్తం 118 పుస్తకాలు  8282/- రూపాయలు.
డిస్కౌంటు పోనూ 7500/-

కవిసామ్రాట్ విశ్వనాథవారి అమూల్యమైన 118 పుస్తకములను కేవలం 7500/- రూపాయలకు   కొనుగోలు చేసుకుని ఇంటినీ, మన తెలుగు అభిరుచినీ, సాహిత్య పిపాసనూ కూడా పరి పుష్టి చేసుకోవచ్చును.

ప్రతులకు : జూనియర్ వి.స.నా. ఫోన్ నంబర్ : 9246100751 (లేదా) నవోదయ పబ్లిషర్స్ : 9247471362
....ఆలస్యం అమృతం విషం ....
త్వర పడండి 

Monday, August 1, 2011

రాముడూ - స్ఫూర్తి -2 (కొనసాగింపు)


(భావం పన్నెండేళ్ళ క్రితం భద్రాచల యాత్రలో కల్గినా ఇన్నాళ్ళకు మళ్ళీ భద్రాచలయాత్ర అయినపిదప పద్యరూపం ధరించింది. అందుకే దీని శీర్షిక రాముడూ - స్ఫూర్తి -2 (కొనసాగింపు) అని ఇచ్చాను. )


రాముడు అడవి లో పయనిస్తూంటే ఒక సంఘటన జరిగిందిట. అది ఇరు ప్రాణుల సంభాషణ. అందులోనూ తల్లీ పిల్లల మనో భాషణం , అదీ రాముడితో.


" పిల్లలు అమాయకులు. పసితనం వీడి పోలేదు. రాముడు గనక స్వీకరించక పక్కన పెట్టేస్తే మిగిలిన వారితో పోల్చుకుని తామేం తక్కువ చేసాం, తమ తప్పేముంది  అని మనసులో నొచ్చుకుంటారు. తాము పుల్లగా ఉన్నామన్న నిజాన్ని గుర్తించలేని పసి హృదయం కదా.. ఉడుకుమోత్తనం తో బుంగ మూతి తో బాధ పడతారేమో" అని తన పిల్లలని హృదయానికి హత్తుకుని పట్టుకుని ఉన్నదట. పండి పోయినా రాలిపోనీయకుండా...


పుల్లని వారలంచు రఘుపుంగవడే స్పృశియింపకున్న ! నా
పిల్లలు ఆర్తితోడ విలపించెదరేమొ ! ఫలాలు పండినన్ 
ఉల్లము నందు హత్తుకొని యుంచెద రాలగనీక రాఘవా !!
తల్లులు తల్లడిల్లరటే? తాళుదురే పసివారి శోకము 
త్ఫుల్లసరోరుహాక్ష ! మదిపూజలు గైకొనరా! మనోహరా !!   


అయితే ఆ పిల్లలు అమాయకులేం కాదుట.


అయ్యో.. ఒక వేళ మనం పుల్ల గా ఉన్నాం కదా అని రాముడు గనక తినకుండా మనని పక్కన పెట్టేస్తే , "నా కడుపున పుట్టటం వలన కదా వీరికి రామ స్పర్శానుభూతి లేకపోయిందే " అని తల్లి మనసు నొచ్చుకుంటుందేమో అని పండి పోయినా సరే నేల రాలి పోకుండా ఆ తల్లి ని అలాగే హృదయానికి హత్తుకునే ఉండిపోయాయిట. 


అమ్మరొ! పళ్ళుపుల్లనని అచ్యుతుడే దలపోవ "నాదు గ 
ర్భమ్మున బుట్టి సేవనిడు భాగ్యము గోల్పొయెనంచు క్రుందు" మా
యమ్మ ! భరింపగల్గుదుమె ఆయమ బాధ ! మనస్సెరుంగమే 
గమ్మున వ్రాలకుండ బిగి కౌగిలి నుండెద మెంత పండినన్ !
(మమ్ము క్షమింపుమయ్య జన మాన్య! అధర్మమనెంచబోకుమా !! )


(అధర్మము+అని+ఎంచబోకుమా = అధర్మమనెంచబోకుమా  అని అనుకున్నాను తప్పైతే సరిజేయగలరు)
ప్రకృతి ధర్మానుసారం పండిన పళ్ళు వ్రాలిపోవాలి, కానీ ఇక్కడ ధర్మ వ్యతిక్రమమౌతున్నా అధర్మమని భావనచేయకుమయ్య అని వినతి . తల్లి బాధ పడకూడదని పిల్లలు.. పిల్లలు బాధ పడకూడదని తల్లీ... ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూ బాధ తెలియకుండా హృదయానికి హత్తుకుని ఉండిపోయాయిట. అన్యోన్యత్వం... పరస్పరం భావయన్తః పరస్పరం బోధయన్తః 


ఇంతకీ ఆ తల్లి ఎవరో తెలుసా.. "నేరేడు చెట్టు". రాముడు ఈ అన్యోన్యత్వానికి ముగ్ధుడైపోయాడు. అందుకే మరు జన్మ లో "కృష్ణ" వర్ణం ఎంచుకున్నాడేమో ...ఇంతటి 'ఉన్నతమైన' భక్తీ భావం ఉంది కనుకనే పళ్ళ చెట్లలో చాల 'ఎత్తుకు' పెరిగే చెట్టు కూడా నేరేడు చెట్టు మాత్రమె....