Showing posts with label భాగవత రహస్య ప్రకాశం. Show all posts
Showing posts with label భాగవత రహస్య ప్రకాశం. Show all posts

Saturday, July 25, 2009

భాగవతానికీ- గాయత్రికీ సమన్వయం ఏమిటి?

భాగవతానికీ గాయత్రి కీ గల సంబందం ఏమిటి ? మత్స్యపురాణం ఏమిటి ? అందులో చెప్పిన గాయత్రికీ భాగవతకథ కీ సమన్వయం ఎమిటి? ప్రహ్లాద చరిత్ర, గజేంద్రమోక్షం, పురంజనోపాఖ్యానం లాంటి ఎన్నో కథలుంటే వృత్రాసుర వధనే పోతనామాత్యుడు అవతారిక వంటి పద్యం లో ఎందుకు ఉదహరించాడు? భాగవతానికి దేనిని ప్రమాణంగా స్వీకరించి పోతన ధర్మాన్ని వివరించాడు?

ఈ ప్రశ్నలర్ధంకావాలంటే భాగవత కథా ప్రారంభాన్ని చూడాలి. ముందుగా పద్యమూ, వచనమూ.

సీ. విశ్వజన్మస్థితి విలయంబులెవ్వని
వలననేర్పడు ననువర్తనమున
వ్యావర్తనమున, కార్యములందభిజ్ఞుడై
తానరాజగుచు జిత్తమున జేసి,
వేదంబులజునకున్ విదితముల్ గావించె
నెవ్వడు, బుధులు మోహింతురెవ్వ
నికి, నెండమావుల నీళ్లకాచాదులు
నన్యోన్యబుధ్ధి దా నడరునట్లు

ఆ. త్రిగుణ సృష్టియందుదీపించి సత్యము
భంగిదోచు, స్వప్రభా నిరస్త
కుహకుడెవ్వ డతని గోరి చింతించెద
ననఘు సత్యు పరుని అనుదినంబు.

: ఇట్లు "సత్యం పరం ధీమహి" అను గాయత్రీ ప్రారంభమున గాయత్రీ నామ బ్రహ్మస్వరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రినధికరించి ధర్మ విస్తారంబును, వృత్రాసుర వధంబును, ఎందుజెప్పంబడు నదియ భాగవతంబని పలుకుటం జేసి ఈ పురాణంబు శ్రీ మహాభాగవతం బన నొప్పుచుండు.

భాగవత కథకి ఇది మొట్టమొదటి పద్యం. ఒక విధంగా చెప్పాలంటే భాగవతహృదయం కూడాను. పోతనామాత్యుడు భాగవత కథాప్రారంభాన్ని "విశ్వజన్మస్థితి విలయంబు" పద్యం తో మొదలెట్టి గాయత్రినీ, మత్స్యపురాణాన్ని, వృత్రాసురవధనీ ప్రస్తావిస్తూ "ఇవన్నీ ఎందులో చెప్పారో దాన్ని భాగవతం అంటారు కాబట్టి, దీనికి భాగవతం అనే పేరు" అన్నాడు. మొత్తం భాగవత రహస్యాన్ని, దాని ఆత్మనూ ఒక్క వచనం లో గుప్పించేశాడు అంతే కాదు ఈ ముందు చెప్పినవన్నీ ఉన్నదాన్ని భాగవతం అంటారు అని ఇంకొక రహస్యాన్ని విప్పాడు.

పద్యం సులభంగానే అర్థమయ్యేట్టు ఉంది కాబట్టి వచనాన్ని పరిశీలిస్తే..

" ఈవిధంగా 'అన్నిటికన్నా ఉత్తమమైన సత్యమును ధ్యానము చేయుదుము' అని ప్రారంభింపబడిన మత్స్య పురాణం లో గాయత్రి అను పేర సర్వాంతర్యామియైన భగవంతుణ్ణి వివరించటం జరిగింది. దానిని ప్రమాణంగా స్వీకరించి ధర్మాన్ని వివరించటం, వృత్రాసురవధ వివరింపబడ్డాయి.దానిని భాగవతం అన్నారు, ఈ పురాణంలో కూడా అదే వివరింపబడుతోంది కాబట్టి భాగవతం అని పేరు పెట్టారు." అని.

ఇక్కడ గాయత్రి అంటే ఏమిటీ? మంత్రం కాదు. అందు ప్రతిపాదింపబడిన సత్య దర్శనం. "ఎవడు మనబుధ్ధులను ప్రేరేపించుచున్నాడో, ఆదేవుని వెలుగును ధ్యానింతుము గాక" అన్నది గాయత్రి లో ప్రతిపాదింపబడిన సత్యం. "యావేదాదిషు గాయత్రీ సర్వవ్యాపీమహేశ్వరీ" అని మహన్యాసం లో ఉన్నదీ, "నగాయత్ర్యా: పరం మంత్రం, న మాతు:పరదైవతం" అని ఆర్యోక్తి ఉన్నదీ ఎందుకు అంటే, అన్నిటికన్నా ఉన్నతం అయిన సత్యాన్ని ప్రతిష్ఠ జేస్తోంది గనక. బుధ్ధిని ప్రేరేపించేవెలుగు అంటే బుధ్ధికి పైననున్న వెలుగు. అంటే పంచేంద్రియాల పైన మనస్సు, మనస్సుపైన బుధ్ధి, బుధ్ధి పైన 'ఆ' వెలుగు. మన బుధ్ధులను ప్రచోదనం ఎక్కడ నుండి చేస్తున్నాడు? మనలోనుంచే. సూర్యుడిలో వెలుగుగా ఎవరున్నరు? వాడే. ఆ వెలుగు మనలోఉన్నది అని తెలియటం సులభమేగానీ మనమే అని తెలియటం సుభం కాదు. ఆ వెలుగునుండి తనకు భేదమునాపాదించుకుని జీవుడు చూస్తున్నాడు కాబట్టి సూర్యుని వెలుగు గా మనకన్న వేరుగా కనిపిస్తోంది. 'ఇతడు' అని చెప్పటానికి వీలుగా మనకన్నా వేరుగా ఉన్నాడు కనుకనే ఆదిత్యుడు అన్నారు "అసావాదిత్యోబ్రహ్మ" అని. అట్లాంటి సూర్యుడి లోనూ, మనలోనూ ఒకే వెలుగు ఉంది.

మరి గాయత్రి అను పేర భగవంతుడు సర్వాంతర్యామి ఎలా అయ్యాడు అంటే అసలు గాయత్రి అంటే గానము చేయువారిని రక్షించునది అని అర్ధం. గాయతాం త్రాయతే ఇతి గాయత్రి. జీవులను ఎలా రక్షిస్తోంది అంటే ఉచ్చ్వాస నిశ్శ్వాసల రూపం లో ప్రాణం వలే రక్షిస్తోంది. సీసపద్యం లో చెప్పినట్టు గా త్రిగుణాలతో ఉన్న సృష్టిగా కనిపిస్తూ ఉన్నా, వేర్వేరు రూపాలతో, వేర్వేరు నామాలతో జీవులందరూ ఉన్నట్టు ఉన్నా దానికి అంటకుండా దానికి అతీతం గా, అంతర్యామి అన్నిజీవులలో శ్వాస రూపం లో ఉన్నాడు. అంటే జీవులు ఒకరినొకరు చూచి సంబంధము నెలకొల్పుకొన్నప్పుడు వ్యక్తులనూ, వారి ప్రవర్తననూ కాక వారిలోనున్న వెలుగు / అంతర్యామిని దర్శించటం అన్నది ఇక్కడ "సత్యం పరం ధీమహి".

మరి మత్స్యపురాణం ఏమిటిట అంటే, సీసంలో చెప్పారుకదా, వేదాలను బ్రహ్మకు తెలియజేసాట్ట. "యావేదాదిషు గాయత్రీ సర్వవ్యాపీమహేశ్వరీ" వేదములలో ప్రతిపాదింపబడిన గాయత్రి అన్నిటా, అంతటా వ్యాపించి ఉంది అని. అదే "సత్యం పరం ధీమహి". అంతకముందు వరకూ సృష్టి అవ్యక్తంగా ఉంది.తరువాత వ్యక్తం అయ్యిందిట. గదిలో చీకటిగా ఉన్నప్పుడు వస్తువులన్నీ ఉన్నా, ఎలా కనపడవో, సృష్టి అలా అవ్యక్తం గా ఉంది. టార్చిలైటో, దీపమో తీసుకురాగానే ఎలాగైతే ఉన్న వస్తువులన్నీ కనపడతాయో, అలా సృష్టి వ్యక్తం అయ్యిందిట. ఆ తార్చిలైటే సూర్యుడు. ఆ టార్చిలైటు లోని వెలుగే అంతర్యామి. విష్ణుమూర్తి మత్స్యావతారం లో వేదాలని సోమకుడినుండి కాపాడాడన్నట్టు చెప్తారు. ప్రళయం వచ్చినప్పుడు మత్స్య రూపమై సృష్టి ని కాపాడాడు అని అంటారు. ఏమిటిట అంటే, అవ్యక్తమంటే ప్రళయం అనీ, వ్యక్తమంటే సృష్టి అనీ, వ్యక్త పరచినవాడు సూర్యుడు/ మత్స్యమనీ, వ్యక్తమైనవి వేదాలు, లెదా వాని వెలుగులు అని సంకేతార్ధంతో అంటారు. దీనినే మత్స్యపురాణ రహస్యమంటారు.

మరి వృత్రాసురవధ ఏమిటీ అంటే, ఆ కనబడే సృష్టి అంతా త్రిగుణాలతో ఉన్నట్టు కనిపించటం మాయ కమ్ముకోవటం. ఎవరికి వారికి నేను, నాది, నావారు, నా అభిప్రాయాలూ, నా ఇష్టాఇష్టాలూ అనే పరిధి ఏర్పడి అందులోనే చక్రభ్రమణమౌతూంటుంది. త్రిగుణాల ప్రభావం చేత అందరిలోఉన్న అంతర్యామి పట్ల ఎరుక కనుమరుగై మనస్సు, ఇంద్రియాలూ, బుధ్ధీ చక్రభ్రమణం చేస్తూంటాయి. దానినే వృత్రాసురుడంటారు. ఎన్ని జన్మలు గడచినా గానుగెద్దు తిరిగినట్టే, అనుభూతి శూన్యం. దీనినుండీ తరింపు రావాలంటే ఈ మాయను దాటి సత్యాన్ని దర్శించాలి. అట్లా దర్శించు ప్రజ్ఞ ని వృత్రాసురవధ జేసిన ఇంద్రుడని అంటారు.

మరి వృత్రాసురవధకీ భాగవతానికీ సంబంధం ఏమిటీ అంటే ఈ త్రిగుణాలని దాటడం అంత సులభం కాదు. ఇంద్రియాలు, మనస్సు ఆకర్షణలకులోనై బుధ్ధి మార్గాన్ని పట్టుకోవటం, అందరిలో నున్న అంతర్యామిని గమనించుకోవటం అంత సులభం కాదు. కానీ అవే ఇంద్రియములకు మాధుర్యమునలవరచి భగవదనుభూతిని, దానికి మార్గాన్ని ఆచరణియమైన పధ్ధతిలో భాగవతుల కథల రూపంలో తెలియజేస్తే జీవులు సహజం గా ఆకర్షితులై తన్మయత్వమంది, క్రమం గా త్రిగుణాలకు అటితమైన ఆనందానుభూతిని పొందగలరు గనుక, అన్నిటికన్నా శ్రేయోదాయకమైన మార్గం భాగవతం అని పోతన విశ్వసించి భాగవత కథను మధురానుభూతిప్రదం గా చెప్పాడు

మూలం: శ్రీ కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులవారు రచించిన శ్రీమద్భాగవత రహస్యప్రకాశం.

స్ఫూర్తి:
చతుర్విధ కందం గురించి భైరవభట్ల కామేశ్వరరావు గారు పద్యం.నెట్ లో అడిగినప్పుడు పద్యం రాస్తున్నప్పుడు మొదలై, టీకా తాత్పర్యాలతో టి.టి.డి వాళ్ళ భాగవతం పుస్తకాలు లభ్యమౌతున్నాయి అని చెప్పినప్పుడు మొలకెత్తి, సత్యనారాయణ గారు గాయత్రీ మంత్రం గురించి రాసిన టపా తో చిగురులెత్తి, ఇదిగో ఇలా రూపుగట్టుకుంది.

Coming Next:

'పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టువద్దకు చేరి ' అని చందమామలో కథలున్నట్టు ఏ పురాణం విన్నా, ఏ వ్రతం విన్నా, ఏ నోముచూసినా 'సూతుణ్ణి శౌనకాది మహర్షులిట్లడిగిరి ' అనే ప్రారంభం ఔతుంది. ఏమిటి దాని వెనక ఉన్న కథా కమామిషు.. ??

ఇవి, ఇలానే మరెన్నో... రాబోయే టపాలో...

అప్పటిదాకా చూస్తూనే ఉండండి మీకు నచ్చిన ఏవో కొన్ని బ్లాగులు.

Friday, July 17, 2009

కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల భాగవత రహస్య ప్రకాశం!

రమణ గారి కోర్కెమీద ఈ క్రింది వివరం ఇక్కడ పొందుపరుస్తున్నా.

పెద్దలు, పండితులూ అయిన శ్రీ దివాకర్ల వెంకటావధాని గారు కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు రాసిన భాగవత రహస్య ప్రకాశాన్ని చదివి, తన కంటే పిన్న వయస్కులైన ఎక్కిరాల వారిని గురించి, భాగవత రహస్య ప్రకాశాన్ని సభా ముఖం గా ప్రస్తుతిస్తూ.. "వ్యాసుడే తాను వ్రాసిన భాగవతాన్ని పండిత పామరులకు సులభం గా అర్ధమయ్యేట్టుగా ఎక్కిరాల వారి వాగ్రూపం లో రహస్య ప్రకాశం చేశారు. పోతన భాగవతానికి వివరణతో వారిచ్చిన అనుభవైకవేద్యమైన కోణాలు పండితులకు కూడా కనువిప్పు కలిగించేట్టు గా ఉన్నాయి. పిన్నవయసువారైనా, వారికి మనస్ఫూర్తి గా నమస్కరిస్తున్నాను ' అని వినమ్రం గా మాట్లాడారు. అటువంటి కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు రాసిన భాగవత రహస్య ప్రకాశంలోని కొన్ని ఆణిముత్యాల వంటి వాటిని వీలును బట్టీ అందు ఈ బ్లాగు ద్వారా పరిచయం చేయటానికి ప్రయత్నిస్తా..

కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు రాసిన భాగవత రహస్య ప్రకాశం(పద్యమూ, టీక, తాత్పర్యము తో కూడిన రహస్య ప్రకాశ వివరణతో) అత్యంత రమణీయం గా పునర్ముద్రణం జరిగి ఇప్పుడు వివిధ 'జగద్గురు పీఠం ' శాఖలలో లభిస్తున్నాయి. ఈ క్రిందివారికి టపా ద్వారా, లేదా ఫోను ద్వార సంప్రదించి భాగవతం సెట్ పొందవచ్చు.

satyadev.ch@gmail.com/ sripathi.sanath@gmail.com,

హైదరాబాదు --> జె. శ్రీధర్ --> 9348465600 హైదరాబాదు --> సనత్ కుమార్ --> 9908611411 బెంగుళూరు --> మురళి మోహన్--> 9902009700 విశాఖపట్నం --> శ్రీ కె.శివ శంకర్ గారు --> 9912899266 విజయవాడ --> శ్రీ వి.ఎస్. కృష్ణమూర్తి గారు--> 99893 11846 గుంటూరు --> శ్రీ జి. ఎల్.ఎన్. శాస్త్రి గారు --> 92474 15934 రాజమండ్రి --> శ్రీ. ఎన్.ఎస్. శర్మ గారు --> 94406 87509 మంగళగిరి --> శ్రీ ఆర్.టి. రామారావు గారు --> 9848632658 మైసూరు -->శ్రీ ఎం.ఎస్. గణేష్ గారు --> 93417 75225 చెన్నై --> శ్రీ రాంప్రసాద్ జోషి గారు --> 9003020654 బళ్ళారి --> శ్రీ. జె.ఎన్.మూర్తి గారు --> 97402 77255

పోతన భాగవత ప్రియులకు, పుస్తక ప్రియులకు తాజా వార్త !!

పుస్తక ప్రియులకు తాజా వార్త !! పోతన భాగవత ప్రియులకు సంతోషకరమైన వార్త !! తెలుగు భాషాభిమానుల పాలిటి కామధేను వార్త. !!

జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు మరి కొందరితొ కలిసి అనువదించిన తెలుగు తాత్పర్యం తొ కూడిన పోతన భాగవతాన్ని టి.టి.డి. వాళ్ళు 5 సంపుటాలుగా ప్రచురించారు. హైదరాబాదు హిమాయత్ నగర్ లోని తిరునిలయంలో ప్రస్తుతం పుస్తక ప్రదర్శన జరుగుతున్నది. అందులో భాగం గా సరసమైన ధరకే లభిస్తోంది. ఆదివారం వరకే ఈ అవకాశం. పద్యాలు+తాత్పర్యమూ ఉన్న ఈ పుస్తకం ధర 500 రూ.మాత్రమే.
ఔత్సాహికులకు సువర్ణావకాశం వినియోగించుకోగలరు.