Saturday, October 29, 2011

రాముడు- స్ఫూర్తి - గ్రహణం

కార్తీక మాసం ఆరంభమయ్యింది, శనివారం కదా అని మా అబ్బాయితో కూర్చుని న్యాసం చేస్తూంటే " వక్త్రే సరస్వతీ తిష్టతు, నయనయోశ్చంద్రా దిత్యౌ తిష్ఠేతాం, సర్వతో వాయుస్థిష్ఠతు" అని వినగానే వాడడిగాడు అంటే ఏమిటి నాన్నా అని (ఆ పేర్లు వాడికి కొంచం పరిచయమున్నవి అవడం తో). సరస్వతీదేవి  నాలుక పైన, సూర్య చంద్రులు రెండు కళ్ళలోనూ, వాయువు అంతటా ఉన్నాడని అర్థం నాన్నా అన్నా...(వాడెక్కడ శివుడి తలమీద చంద్రుడుంటాడు కదా మళ్ళీ కళ్ళల్లో ఉండడమేమిటి అని అడిగేలోపు ఇంకేదో విషయం పైకి ధ్యాస మరల్చేశాను).

ఆ తర్వాత అదే విషయమై ఆలోచించటం మొదలెడితే ఒక ఊహ తట్టింది...

రవి యొక కంట వెల్గులిడు రాతిరి ఱేడు మరొక్క కంట నీ
భువి పయి వెల్గులీనునని పుత్రునకున్ వివరించువేళ చ
క్షువులను గీటి ఆడెనొ రఘూత్తముడున్ తన తండ్రి తోడ శై
శవమున! నాటి నుండి రవి చంద్రులకున్ గ్రహణమ్ము లొచ్చెరో !!

స్ఫుర్తి:
(1) నాగమురళి గారి ఆకాశంలో ఆంబోతు, కామేశ్వరరావుగారి దీపావళి చందమామ చదువగా ఊహలటువైపు సాగటం..
(2) మా అబ్బాయికొచ్చినట్టే సందేహాలు రాముడికీ వచ్చి ఉంటాయి, వాళ్ళ నాన్న ఒడిలో కూర్చుని ఆటలాడేటప్పుడు (అసలే ఆయనగారికా అబ్బాయంటే బహు గారాబమాయె) వాళ్ళ నాన్ని అడిగి ఉంటే ఆయన ఏమని సమాధనం చెప్పేవారో కదా అని కలిగిన ఆలోచన. కుడి కన్నుగీటగా సూర్య గ్రహణమూ, ఎడమ కన్నుగీటగా చంద్ర గ్రహణమూ అయ్యాయేమో...

మనసైనవాడు కన్నుగీటితే లభించే "కిక్కు" ను వర్ణించటం అలవిగాదు. అందులోనూ పసిపిల్లల బోసి నవ్వులు, కంటి చూపులూ.. అబ్బో మరింత ముద్దొస్తున్నట్టుంటాయి.  ఆ కొంటె కనుచూపుతోనే కద బాలకృష్ణుడు కూడా గోపికలందరి మనసునూ కొల్లగొట్టింది..

కావాలంటే సంపూర్ణ సూర్య గ్రహణమప్పుడు కనిపించే గోల్డెన్ రింగు ను చూడండి...










Tuesday, October 18, 2011

కాటుక కంటి నీరు...


బ్లాగ్మిత్రులు కామేశ్వరరావు గారు "తెలుగు పద్యం" లో ఇటీవలి కాలంలో సాహిత్యావలోకనం చేస్తూండగా తనకెదురైన ఒకానొక సంఘటనకి కలత చెంది ఒక చిన్నటపా పెట్టగా దానిలో చర్చ "కాటుక కంటి నీరు" పద్యం మీదకి వెళ్ళడం (అది పోతన గారి రచనా కాదా అనే విషయంలో), నాణేనికి రెండువైపులా సమమైన వాదన ఉండడంతో ఆ చర్చని అంతటితో సమాప్తి చేద్దామన్న ఒడంబడికకి రావటం జరిగింది. ఐతే అదేవిషయమై నిన్ననే ఇంకొక వివరణ చదవటం చేత దానిని అక్కడే చర్చించి మాట తప్పటం కన్నా ఇంకొక టపాగా ప్రకటించవచ్చనే ఉద్దేశంతో ఈ టపా...

ఆసక్తి కలవారు ఇక్కడ ఆ టపా చర్చను చదువవచ్చు.

"కాటుక కంటి నీరు" చాటువుకు ప్రస్తావన శ్రీనాథ కవి సార్వభౌముడు రాజులకు కృతినిచ్చి, ధన సంపాదన చేసి దారిద్ర్యము బాపుకొనమని పోతనకు ప్రబోధము చేసినట్లూ, అప్పుడు ప్రత్యుత్తరముగా పోతన భారతీ దేవితో పలికిన పద్యంగా ఈ పద్యరాజం ప్రశస్తమయ్యింది.

ఐతే నిడదవోలు వేంకటరావుగారు "పోతన" అనే గ్రంథం లో ఈ క్రింది విధంగా వివరణనిచ్చారు
"ఇందు పేర్కొనిన మువ్వురూ (కర్ణాట, కిరాట, కీచకులు) శ్రీనాథునికి సంబంధించినవారే !


కర్ణాట రాజు:- శ్రీనాథుడు కర్ణాట రాజగు ప్రౌఢదేవరాయల ఆస్థానమున, ముత్యాలశాలలో కనకాభిషేక మహా సత్కారమును గాంచినవాడు - కర్ణాట క్షితినాథ మౌక్తిక సభాగారాంతరాకల్పిత స్వర్ణ స్నాన జగత్ప్రసిధ్ద కవిరాట్టు" నని చెప్పుకున్నాడు 


కిరాటులు:- కిరాటులనగా వైశ్యులు. శ్రీనాథుడు తన హర విలాస ప్రబంధమును, కాంచీ పురవాసి యగు అవచి దేవయ సెట్టి పుత్రుడగు తిప్పయ శెట్టికి గృతినిచ్చియున్నాడు. చిఱు తొండనంబి ని వర్ణిస్తూ శ్రీనాథుడు "కోటికిన్ పడగనెత్తిన నక్కిరాట వంశ కిరీటాలంకారంబు. 2-34" అని చెప్పి యున్నాడు


కీచకులు:-  ఈ పదము వలన శ్రీనాథుడు చెప్పిన పల్నాటి వీర యుధ్ధ కథ సూచితమైనది. పల్నాటి వీరచరిత్ర ప్రశస్త దేశికృతియైనను హీనజాతి వారి కోరిక పైన రచించినదే కదా. 


శ్రీనాథుడీవిధముగా మువ్వురవలన వారికి కృతులనిచ్చి గాని, కవితా సమ్మాన రూపమున గాని ధనమునార్జించినట్లుగా, త్రిశుధ్ధిగా తానట్టి పనులు చేయనని భారతి దేవితో విన్నవించాడు"  

ఈ పద్యం చాటువు కనుక, అప్పటి దేశకాల రీతులు, జరిగి ఉండవచ్చునన్న కథాంశమూ నిజమే అయితే, ఈ వివరణ దానికి ఊతమిచ్చేదే కనుక అయినట్టైతే అది పోతన రచన కాకపోయుండవచ్చన్నది నా అభిమతం
శారదా పుత్రుడు, బ్రహ్మ దత్త వరప్రసాదుడైన శ్రీనాథుణ్ణి పరోక్షం గా నిరశిస్తూ వాగ్ఞియమాన్ని పాటించే భాగవతోత్తముడైన పోతన పలికి ఉండడన్నది నా భావానికి హేతువు.

Monday, September 12, 2011

రామాయణ కల్పవృక్షం అర్థం కావాలంటే ఏమేమి కావాలి?


"రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠం దక్కిందంటే అది ఒక మహాద్భుత రచన అయిఉండాలి. కనుక అది మనం కూదా చదవాలి" అన్న ఆలోచన తో మొదలయ్యింది ప్రస్థానం. పుస్తకం కొనుక్కుని చదివితే అర్థం అవదా అని ఒకప్పుడనిపించేది. తీరా కొనడానికి ప్రయత్నించేసరికి తెలిసింది అది పుస్తకం కాదని పుస్తకాలు అని. కొంపదీసి తక్కువ అంచనా వేశామా ఏమిటి అనిపించింది.

అదృష్టం కొద్దీ కొన్నేళ్ళు బజార్లో ఆపుస్తకాలు దొరక్కపోవటం వల్ల (లేదా ఎక్కడదొరుకుతాయో నేను సరిగ్గా తెలుసుకోకపోవటం వల్ల) కొంచం సమయాభావం అవ్వటం, ఆలోపు అక్కడక్కడ వ్యాసాల్లో, రచనల్లో రామాయణ కల్పవృక్ష ప్రస్తావన రావటం, నా అజ్ఞానం కొద్దిగా తగ్గి, ఆ కావ్యం పట్ల కించిత్ గౌరవ భావం పెరగటం, శ్రధ్ధ కలిగిన తర్వాత వెదకగా కోటీ లో ఒకానొక షాపులో బాలకాండం ఒక్కటీ దొరికిటం తో మలి అడుగు పడింది అనుకున్నా.

తీరా పుస్తకం కొన్నాకా నా పరిస్థితి "అనుకున్నదొకటి, అయ్యింది ఒకటి" అన్న చందంగా తయారయ్యింది. అప్పటికి నాకింకా పద్యాల పేరున పైత్యం రాయడం కలలో కూడా వచ్చి ఉండదు. మొత్తానికి ఏమైతేనే భాగవతం లో పద్యాలని చదువుకున్నాం కదా అట్లానే ఇదీ చదివేద్దాం. అర్థం అయిపోతుంది అనుకుంటూ మొదలెట్టా... గ్రీకు లాటిన్ అంటే ఏమిటో అనుభవ పూర్వకంగా తెలిసొచ్చింది. ఆదెబ్బకి రెండువిషయాలు అర్థం అయ్యాయి (అనిపించింది). ఒకటి -విశ్వనాథను పాషాణపాక ప్రభువనెందుకన్నారో. రెండు - కల్పవృక్షం చదువుదామన్న క్రేజే గానీ చదవటానికి, అర్థం చేసుకోటానికి నాకు అంత పరిపక్వత లేదని. ఆదెబ్బకి పుస్తకం మూసేసి అటకెక్కించేశా. విశ్వనాథ నవలలు తీశా.. బహు బాగా అర్థం అవసాగాయి. దాంతో ఒకటి తేల్చేసుకున్నా. పద్యాలు మనకబ్బవురా అబ్బయి అని. ఇది జరిగి దాదాపు పదహారేళ్ళు దాటి ఉంటుంది.

ఇంటర్లో సంస్కృతమయ్యాక మళ్ళీ ఎట్లా ఏర్పడిందో రుచి తెలియదు గానీ పద్యాలు కొంచం కొంచం అర్ధం అవసాగాయి.  దాంతో అటకమీదనుంచీ తీసి మళ్ళీ కొన్ని పదుల పద్యాలు చదివా. పోతనగారి ఎఫెక్టో, మన బుర్ర కెపాసిటీనో గానీ భారతం లో పద్యాలు గానీ, కల్పవృక్షం పద్యాలు గానీ అంతగా అర్థం కాలేదు. కాకపోతే ధారుణి రాజ్య సంపద మొదలైన పద్యాలు రాగాలాపనలో బాగున్నాయని కొన్నింటిని కంఠస్థ పట్టి కాలీజీలో కొంచం ఫోజు కొట్టా. అంతటితోనే సరి. మళ్ళీ పుస్తకాలు యథాస్థానం ప్రవేసించాయి. శొభనార్థే క్షేమాయ పునరాగమనాయచ అని కూడా అన్నా.. ఈ సారి.

అన్నట్టుగానే నాన్నగారితో అవధానాలకి వెళ్ళటం, సరదాగా ఉందనిపించటంతో పుస్తకాన్ని మళ్ళీ తీశా. ఈ సారీ అదే రిజల్టు. వయసు పెరిగినకొద్దీ అవగాహన కలిగి అర్థం అయిపోతుంది అని భావించానేగానీ అంతకుమించి సాధన ఏమీ చేయలేదు. ఇక దీనికీ మనకీ రామ్రాం అనుకున్నా. కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులవారి గోదావైభవ కావ్యాన్ని, దాని రహస్యప్రకాశాన్ని చదివా. అద్భుతం అనిపించింది. ఇన్నాళ్ళుగా నేనెటువంటి అనుభూతికోసం ఎదురుచూస్తున్నానో అది దక్కింది అనిపించి. ఒక మూడేళ్ళు ఆపుస్తకాన్ని ఆసాంతం చదువుకుని ఆనందించాక బోయి భీమన్న గారిని అనుకోకుండా చదవటం నా పయనంలో ఒక అనుకోని మలుపు.

భద్రాచల యాత్ర రాముడి ఆత్మీయతని పరిచయం చేస్తే అసంకల్పిత ప్రతీకార చర్యగా భావాలు ఒక పద్యం లాంటి వాటితో రావడం ఇంకొక మజిలీ. తోచింది రాసి అబ్బో అని సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నప్పుడు బ్లాగన్నదై పరిచయమవ్వడం. అప్పటిదాక నూతిలో కప్పమాదిరి ఉన్నవాణ్ణి ప్రపంచాన్ని తెలుసుకోవడం మరొకమజిలీ...దాని పర్యవసానం కొంచం వ్యాకరణం, చందస్సు నేర్చుకుని చదివితే రమాయణ కల్పవృక్షం అర్థం అవుతుందేమో అని కొంచం ఇంగితం కలగటం..ఆ దిశగా ప్రయత్నం చేయటం.....

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్టు ఏ జన్మ లో చేసుకున్న పున్నెమో మంచిపద్యం లో వడలి మందేస్వర రావుగారి గురించి తెలుసుకోవడం, ఆపై "ఇదీ కల్పవృక్షాన్ని ఆస్వాదించగలగటం" అటుపై మొన్నీమధ్య విశ్వనాథ పుస్తకాలని కొనడానికి వెళితే నా కష్టాన్ని గమనించి విశ్వనాథ వారే కరుణించారన్నట్టుగా "కల్పవృక్ష రహస్యములు" పుస్తకం దొరికింది.

తన కావ్యానికి తానే వ్యాఖ్యాన్నందిచారని తెలిసిన మరుక్షణం నా ఆనందనికి అవధులు లేవు. నన్ను కరుణించటానికే అని నేననటానికి గల కారణం విశ్వనాథ వారు ఒక్క బాలకాండకు మాత్రమే వ్యాఖ్యానన్నందిచారు. (దురదృష్టవశాత్తు మిగిలిన కాణ్డలకు వారి వ్యాఖ్యానం లేదు).

కల్పవృక్షమెందుకు అంతటి బృహత్తర రచనో తనమాటల్లో తానే వ్యక్తపరిచారు. ఎంతో అరుదైన భాష్యాన్నందిచారు. ఆ మహాకావ్యానికి వెనుకనున్న ఆలోచన, హృదయమూ, రచనా శిల్పం, అలంకారాలూ, నానుడులూ, విశేషాలూ, రహస్యాలూ తనంత తానుగా ఆవిష్కరించారు. ఆశ్చయకరమైన విషయమేమిటంటే ఇటువంటి పుస్తకం లిస్టులో అమ్మకానికి ఉందని విశాలాంధ్రవారు చెప్పలేదు, విశ్వనాథ మనవళ్ళవద్దనున్న కేటలాగ్ లో కూడా ప్రస్తావనలేదు, కానీ విమర్శ గ్రంథాల సెట్టు కొంటే దాన్లో ఈ పుస్తకాన్ని ఉచితంగా అందిస్తున్నారు (పాత పుస్తకం మాదిరిగా ఉంటుంది. స్టాక్ క్లియరెన్సులో భాగంగానో ఎమో).

విశ్వనాథ విమర్శ గ్రంథాల సెట్టు కొనుక్కోవడం నాకే తెలియకుండా నాకునేను చెసుకున్న గొప్ప సాహయమేమో అని అనిపించింది..

చదివావా అంటే చదివాననిపించుకోవటానికేముంది? ఒక్క బిగిన చదివేయచ్చు కానీ కల్పవృక్షం అర్థమవ్వాలంటే చందస్సు, వ్యాకర్ణము, నిఘంటువు వంటివి ఉంటే సరిపోదు, తెలుగు తెలియాలి, తెలుగుదనం తెలియాలి, తెలుగు సంస్కృతి తెలియాలి, ఆ తీయని మకరందాన్ని ఆస్వాదించే విధానం కూడా తెలియాలి అప్పుడే దాని హృదయం ఆవిష్కృతమౌతుంది అన్న నిజం నిఖార్సుగా తెలిసొచ్చింది. అసలైన తెలివొచ్చింది. మనసు నిండింది.

ఆల్రెడీ "ఇదీ కల్పవృక్షం" చదివినవారికి ఈ పుస్తకం ఇంకోక దర్పణం. విశ్వనాథని తెలుసుకోడానికి. పుస్తకంలోని మధురానుభూతులు..... మచ్చుక్కి కొన్ని [వారి వ్యాఖ్య నీలం రంగులో]

(1) పుత్రకామేష్టి సందర్భంగా అగ్నిదేవుడు రాజుచేతిలోపాయసము పెట్టే సందర్భములో వారి వ్యాఖ్యానము

ముదిపృదాకువు సెజ్జమునులు జోదిళ్ళీయ
హాళిమై గూర్కు సుమాళి యొకడు
ప్రామింకు చిట్టచివళ్ళలో నసురుల
దోరించునట్టి కటారి యొకడు
ప్రామఱ్ఱి క్రీనీడ బాఠమ్ము ముసలులౌ
మునులచే జదివించు పోఱడొకడు
పాలవెల్లి కరళ్ళపై వెలికింతలై
కాలివ్రేల్చీకెడు కందొకండు


పసిమియై గాలికిని రాలిపడిన యొక్క
నలుసు నివ్వరిముల్లైన వెలుగొకండు
స్థూలమై వచ్చి వచ్చి తా సూక్ష్మమగుచు
జనపతి కరస్థమగు పాయసమున జొచ్చె


(అ) పృదాకువు - సర్పము. ముది పృదాకువు - ఆదిశేషువు
జోదిళ్ళు- నమస్కారములు
ఆదిశేషువనే సయ్యపై మునులు నంస్కరించుచుండగా నిద్రపోవునొక యొయ్యారి. ఇతడు విరాణ్మూర్తి
(ఆ) ప్రామినుకు - వేదములు
ప్రామిన్కు చిట్తచివళ్ళు - వేదాంతములు. అక్కడ రాక్షసులను సమ్హరించు ఖడ్గధారి.
విరాణ్మూర్తికన్న ఈ ఖడ్గధారి తక్కువరూపముకలవాడు
(ఇ)ప్రాత మఱ్ఱి చెట్టుకింద వృధ్ధులౌ ఋషులచేత పాఠమ్ములను వల్లెవేయించీ పోఱడు- బాలుడు. ఇతని మూర్తి మరియు చిన్నది
(ఈ)పాలవెల్లి కరళ్ళపై క్షీరసముద్ర తరంగములమీద తన కాలి వ్రేలు చీకెడి కందు-పసివాడు.
(ఉ) మరల వరిముల్లంతవాడు
విరాట్స్వరూపంతో మొదలెట్టి తగ్గుతూ తగ్గుతూ వచ్చి రాజు చేతిలో పాయసంలో ప్రవేశించాడు. అంతటి స్వామి ఇంతగా అయ్యాడని అర్థం. పరమేశ్వరుడు అణోరణీయాన్, మహతోమహీయాన్ కద"

చెప్పదలుచుకున్న విషయాన్ని సాపేక్షికంగా, పథకం ప్రకారంగా (planned గా అని నా ఉద్దేశం).. భావప్రసక్తి చేయటం, పద్య రచన దానిని పరిపుష్ఠిచేయటం అందులోనూ  "జోదిళ్ళు", "ప్రామిన్కు చిట్టచివళ్ళు", "పోఱడు (తెలంగాణ యాస కూడానేమో)", కాలి వ్రేల్చీకెడు కందు" వంటి తెలుగు పదాల పోహళింపు మామూలుగా చదివేసుకుంటూ పోతే వాటి అందం సొబగూ, అర్థం ఔతాయా?
 
(2) రామయణంలో రామ జననమయ్యక ఒక పద్యముంటుంది. దానిని కనీసం ఒక 10 సర్లైనా చదివి ఉంటా. ప్రత్యేకంగా ఏమీ అర్థం కాక ముందుకి వెళ్ళిపోయా కుడా....

వెలికి గొనిపోకుడీ బిడ్డబిట్టలారు
సంజవేళల నంచు గౌసల్య పలుక
గరుడి వైకుంఠమున భయకంపితుండు
మడమలను ద్రొక్కుకొను ఱెక్క ముడుచుకొనుచు

దానికి వ్యాఖ్యానాన్నందిస్తూ "ఈ భాగమంతయూ తెలుగుల ఇండ్లలో పురుళ్ళు, పిల్లలు పెరుగుటలు వారినాడించుటలు, ఆ మహాశోభ ఉన్నది. వట్టి కావ్యకఠిన బుధ్ధులకుతెలియదు. అంతయు రసభరితముగానుండును. ఆ రసము జీవితమందున్నది. తెలుగుగృహములలోనున్నది. ఇచ్చటకవిచేసినది పద్యములు వ్రాయుట మాత్రమే. తెలుగు దేసములో నేడాదిదాటని పిల్లలను సాయంకాలమందు నారుబయతకు దీసుకొనిపోనీయరు. పిట్టలారునందురు. పూర్వము పసిపిల్లలకదియొక జబ్బువచ్చెడిది. అట్లు రామచంద్రుని గూర్చి ఎవ్వలైన ననగా గరుత్మంతుడు భయముతో తన ఱెక్కలను ముడుచుకొనెడివాడట" అన్నారు.

ఇలా ఎన్నెన్నో ఆణిముత్యాలను, చందో విశేషాలను, చారిత్రక రాజనీతి రహస్యాలను, తెలుగువారి ఆచార వ్యవహారాలను ప్రతిపాదిస్తూ తానుచేసిన బృహత్కావ్యానుగత  హృదయాన్ని విహంగవీక్షణంగావిస్తారు విశ్వనాథ.

పద్యరచనపై, అందునా కల్పవృక్షంపై మక్కువగలవారి ఇంట నీరాజనాలందుకోగల మేటి పుస్తకమీ "కల్పవృక్ష రహస్యములు". విశ్వనాథవారి జయంతిని పురస్కరించుకుని వారికి కృతజ్ఞతగా నా ఈ టప...

Tuesday, August 16, 2011

విశ్వనాథ సమగ్ర సాహిత్య గ్రంథావళి




వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనంలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్ష్యం వెల్లివిరిసేట్టు గా రచించిన మహా కవి 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు; "కవి సమ్రాట్" బిరుదాంకితుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత - శ్రీ విశ్వనాథ సత్యనారాయణ.

ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.- కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింప బడినవాని సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ఆయన రాసిన రచనలన్నీ కలిపితే లక్షపుటలుండవచ్చును అటువంటి విశ్వనాథ వారి సమగ్ర సాహిత్య గ్రంథావళిని విశ్వనాథ వారి మనుమడు, విశ్వనాథ పావని శాస్త్రి గారి అబ్బాయి - విశ్వనాథ సత్యనారాయణ (బహుశా జూనియర్ అనాలేమో)  పునర్ముద్రణ గావించారు.

మంచి కాగితం పై మంచి ముద్రణతో పుస్తాకాలు అందుబాటులోకి వచ్చాయి.

(1) నవలలు - 57 పుస్తకాలు --> 4500/-  
(2) నాటకములు - 16 పుస్తకాలు --> 666/-  
(3) విమర్శ గ్రంథాలు - 11 పుస్తకాలు --> 1116/-  
(4) పద్యకావ్యాలు (రామాయణ కల్పవృక్షం తో కలిపి) --> 1500/-
(5) పాటలు, ఇతరములు (కిన్నెరసాని పాటలు మొ||)  --> 500/-

వెరసి మొత్తం 118 పుస్తకాలు  8282/- రూపాయలు.
డిస్కౌంటు పోనూ 7500/-

కవిసామ్రాట్ విశ్వనాథవారి అమూల్యమైన 118 పుస్తకములను కేవలం 7500/- రూపాయలకు   కొనుగోలు చేసుకుని ఇంటినీ, మన తెలుగు అభిరుచినీ, సాహిత్య పిపాసనూ కూడా పరి పుష్టి చేసుకోవచ్చును.

ప్రతులకు : జూనియర్ వి.స.నా. ఫోన్ నంబర్ : 9246100751 (లేదా) నవోదయ పబ్లిషర్స్ : 9247471362
....ఆలస్యం అమృతం విషం ....
త్వర పడండి 

Monday, August 1, 2011

రాముడూ - స్ఫూర్తి -2 (కొనసాగింపు)


(భావం పన్నెండేళ్ళ క్రితం భద్రాచల యాత్రలో కల్గినా ఇన్నాళ్ళకు మళ్ళీ భద్రాచలయాత్ర అయినపిదప పద్యరూపం ధరించింది. అందుకే దీని శీర్షిక రాముడూ - స్ఫూర్తి -2 (కొనసాగింపు) అని ఇచ్చాను. )


రాముడు అడవి లో పయనిస్తూంటే ఒక సంఘటన జరిగిందిట. అది ఇరు ప్రాణుల సంభాషణ. అందులోనూ తల్లీ పిల్లల మనో భాషణం , అదీ రాముడితో.


" పిల్లలు అమాయకులు. పసితనం వీడి పోలేదు. రాముడు గనక స్వీకరించక పక్కన పెట్టేస్తే మిగిలిన వారితో పోల్చుకుని తామేం తక్కువ చేసాం, తమ తప్పేముంది  అని మనసులో నొచ్చుకుంటారు. తాము పుల్లగా ఉన్నామన్న నిజాన్ని గుర్తించలేని పసి హృదయం కదా.. ఉడుకుమోత్తనం తో బుంగ మూతి తో బాధ పడతారేమో" అని తన పిల్లలని హృదయానికి హత్తుకుని పట్టుకుని ఉన్నదట. పండి పోయినా రాలిపోనీయకుండా...


పుల్లని వారలంచు రఘుపుంగవడే స్పృశియింపకున్న ! నా
పిల్లలు ఆర్తితోడ విలపించెదరేమొ ! ఫలాలు పండినన్ 
ఉల్లము నందు హత్తుకొని యుంచెద రాలగనీక రాఘవా !!
తల్లులు తల్లడిల్లరటే? తాళుదురే పసివారి శోకము 
త్ఫుల్లసరోరుహాక్ష ! మదిపూజలు గైకొనరా! మనోహరా !!   


అయితే ఆ పిల్లలు అమాయకులేం కాదుట.


అయ్యో.. ఒక వేళ మనం పుల్ల గా ఉన్నాం కదా అని రాముడు గనక తినకుండా మనని పక్కన పెట్టేస్తే , "నా కడుపున పుట్టటం వలన కదా వీరికి రామ స్పర్శానుభూతి లేకపోయిందే " అని తల్లి మనసు నొచ్చుకుంటుందేమో అని పండి పోయినా సరే నేల రాలి పోకుండా ఆ తల్లి ని అలాగే హృదయానికి హత్తుకునే ఉండిపోయాయిట. 


అమ్మరొ! పళ్ళుపుల్లనని అచ్యుతుడే దలపోవ "నాదు గ 
ర్భమ్మున బుట్టి సేవనిడు భాగ్యము గోల్పొయెనంచు క్రుందు" మా
యమ్మ ! భరింపగల్గుదుమె ఆయమ బాధ ! మనస్సెరుంగమే 
గమ్మున వ్రాలకుండ బిగి కౌగిలి నుండెద మెంత పండినన్ !
(మమ్ము క్షమింపుమయ్య జన మాన్య! అధర్మమనెంచబోకుమా !! )


(అధర్మము+అని+ఎంచబోకుమా = అధర్మమనెంచబోకుమా  అని అనుకున్నాను తప్పైతే సరిజేయగలరు)
ప్రకృతి ధర్మానుసారం పండిన పళ్ళు వ్రాలిపోవాలి, కానీ ఇక్కడ ధర్మ వ్యతిక్రమమౌతున్నా అధర్మమని భావనచేయకుమయ్య అని వినతి . తల్లి బాధ పడకూడదని పిల్లలు.. పిల్లలు బాధ పడకూడదని తల్లీ... ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూ బాధ తెలియకుండా హృదయానికి హత్తుకుని ఉండిపోయాయిట. అన్యోన్యత్వం... పరస్పరం భావయన్తః పరస్పరం బోధయన్తః 


ఇంతకీ ఆ తల్లి ఎవరో తెలుసా.. "నేరేడు చెట్టు". రాముడు ఈ అన్యోన్యత్వానికి ముగ్ధుడైపోయాడు. అందుకే మరు జన్మ లో "కృష్ణ" వర్ణం ఎంచుకున్నాడేమో ...ఇంతటి 'ఉన్నతమైన' భక్తీ భావం ఉంది కనుకనే పళ్ళ చెట్లలో చాల 'ఎత్తుకు' పెరిగే చెట్టు కూడా నేరేడు చెట్టు మాత్రమె....

Wednesday, July 27, 2011

భద్రాద్రి సీతారాముల వారి గోత్రనామాలు



మా ఇంట రాముల వారి కళ్యాణం గత పాతికేళ్ళుగా నిర్వహిస్తున్నా... మా నాన్నగారు రాసి పెట్టిన స్వామి వారి గోత్రనామాల పుస్తకం కనపడక ఈ సంవత్సరం కొంచం ఖంగారయ్యింది. ముక్కు రాఘవుణ్ణి, కామేశ్వరరావు గారినీ, తెలిసిన మిగిలిన సాహితీ బంధువులనీ అడగటానికి ప్రయత్నం చేశా ఆఖరు నిమిషంలో, కానీ వివరాలుతెలియలేదు

మొన్న భద్రాచలం లో ప్రధానార్చకులవారిని అడిగి వ్రాసుకుని వచ్చాను. మీ అందరికోసమై ఇక్కడ పొందుపరుస్తున్నా....ఇది  "శంఖచక్రధారి అయిన భద్రాచల రామ నారాయణుని ప్రవర. అయోధ్యా రాముడిది కాదు)

అమ్మవారు:
చతుర్వేదాధ్యాయినీం, సౌభాగ్య విశ్వంభరీం, నిరాకార, సాకార చతుజిగీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాం....
విశ్వంభరశ్శర్మణో  నప్త్రీం
రత్నాకరశ్శర్మణః పౌత్రీం
క్షీరార్ణవశ్శర్మణః పుత్రీం
శ్రీ సాక్షాన్మహాలక్ష్మీ స్వరూపిణీం సీతా నామ్నీం ఇమాం కన్యాం

అయ్యవారు:
అనంత వేదాధ్యాయనే, అచ్యుత పరబ్రహ్మణే, ఆదినారాయణాయ
నిరాకార, సాకార, పరవ్యూహ, విభవ, అంతర్యామి అర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ
పరబ్రహ్మ శర్మణో నప్త్రే
వ్యూహనారాయణ శర్మణః పౌత్రాయ
విభవవాసుదేవ శర్మణః పుత్రాయ
సాక్షాన్నారాయణ స్వరూపాయ శ్రీ రామ చంద్ర పరబ్రహ్మణే వరాయ

(మా నాన్న గారు అజ, రఘు దశరథ వంశ ప్రవర వాశిష్ట మైత్రావరుణుల గోత్రప్రవరతో చెప్పేవారేమోనని లీలగా గుర్తు)    

Wednesday, July 20, 2011

భద్రగిరికి వెళ్తున్నా...


దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ 4 రోజులకి భద్రగిరికి వెళ్తున్నా. నా పాత రోజులు, అప్పటి అనుభూతులు గుర్తొస్తున్నాయి...నేనూ, నాగ మురళి, మోహన్, శివాజి ... గురువుగారితో, నాన్నగారితో గడిపిన అప్పటి స్మృతులు నన్ను పెనవేసుకుంటున్నాయి...  


ఎప్పుడెప్పుడు చేరుతానా అన్నట్టుంది ....

ఊరు చేరాలి మన ఊరు చేరాలి
గలగల గలగల కొమ్ముల గజ్జెలు, ఖణఖణ ఖణఖణ మేళ్ళో గంటలు ఆ....ఆ.... (2)
వాగులుదాటి వంకలు దాటి ఊరు చేరాలి మన ఊరు చేరాలి


నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు అవిగో అవిగో అవిగో అవిగో
నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు అవిగో అవిగో అవిగో
ఆ...ఆ... పచ్చనితోటలు విచ్చిన పూవులు
ఊగే గాలుల తూగే తీగలు అవిగో...
కొమ్మల మూగే కోయిల జంటలు
ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు అవిగో అవిగో
ఆ...ఆ......ఆ....ఆ.......

Thursday, June 2, 2011

బాపు బొమ్మలు చూద్దాం రండి.


తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నది ఒక తరం నానుడి అయితే కాబోయే పెళ్ళికూతురు బాపు బొమ్మలా ఉండాలన్నది నేటి తరం నానుడి. అది చూసినవాడికి, ఆనందించినవాడికీ మాత్రమే తెలిసే రుచి. తెలుగునాట బాపు బొమ్మల గురించి తెలియని పాత తరం వారు బహు తక్కువ. స్వాతి లో కోతి కొమ్మచ్చి పేర బాపూ రమణల విన్యాసం చదివినతర్వాత ఈ కాలం వారికి కూడా కొంచం తెలిసి ఉండచ్చు. ఒకవేళ అరాకొరా తెలియని వాళ్ళెవరైనా మిగిలి ఉన్నట్టైతే (అందునా హైదరాబాదు వారైనట్టైతే ) వారికి ఇదొక మంచి అవకాశం. (తెలిసిన వారికి బహు పసందైన అవకాశం)

సోదరుడు ఆర్టిస్ట్ అన్వర్ గారు ఆ నెల 4,5,6 తేదీలలో హైదరాబాదులో బాపుగారి బొమ్మల కొలువు పెడుతున్నారు. పైన పెట్టిన ఆహ్వానపత్రం వారిదే...

http://thisisanwar.blogspot.com/2011/05/blog-post_31.html

 మీ ఇంటిల్లిపాదీ బంధుమిత్ర సపరివారం గా విచ్చేసి బాపూబొమ్మల షడ్రసోపేతమైన విందునారగించి కళాతాంబూల సేవనం చేసి బాపిస్ట్లమైన మమ్మానందింపజేయమని ప్రార్థన

దేవుళ్ళబొమ్మలైతేనేమి, వ్యంగ్య కార్టూన్లైతేనేమి, పోర్త్రైట్ లైతేనేమి అన్నింటిలోనూ బాపుగారిదొక విలక్షణత. ఎంత విలక్షణ అంటే ఆయన రాత పేరన ఒక ఫాంటే ఉంది. బహు కొద్దిమందికి మాత్రమే దక్కే అతి గొప్ప, అరుదైన గౌరవం అది. తెలుగున్నంత కాలం, కంప్యూటరున్నంతకాలం వారి రాత, తెలుగుదనం మీద ఆప్యాయత ఉన్నంతకాలం వారి గీత శాశ్వతం గా ఈ నేల నాలుగుచెరలా నిలచి ఉంటాయి. ఉండాలని మనస్ఫూర్తి గా ఆశిస్తున్నా.

Wednesday, February 23, 2011

ముళ్ళపూడి పట్టె మోక్ష పథము !!



మీకిది భావ్యమా? రమణ ! మీకయి మీరిటు నిశ్చయించినన్
మాకెవరయ్య దిక్కు యని మారము చేయరొ బుంగమూతితో
మీ కతి ప్రీతిపాత్రులగు మీ బుడుగున్, మరి బాపు బొమ్మలున్!
శ్రీ కరమైన ధామమును జేరగ మీకిటు తొందరేలనో?

కమ్మగ కధలను జెప్పగ
రమ్మని పిలుపొచ్చెనేమొ రమణకు ! బాపూ
కొమ్మల నూగెడు కోయిల
ఇమ్మహి విడి నాకమునకు ఇటజనె నకటా !!


కళ్ళల్లో వెలుగువు మా
ఇళ్ళల్లో నవ్వునింపు ఇనుడవు ! నీకే
మళ్ళీ జన్మొకటుంటే
వెళ్ళొచ్చెయ్ ముళ్ళపూడి వెంకట రమణై !!


మా తండ్రిగారికి బాబాయి వరస ఔతారు శ్రీ ముళ్ళపూడి వారు (పెత్తల్లి, పినతల్లి బిడ్డలు). ఎప్పుడు మద్రాసు వెళ్ళినా కక్కిగారిని (ముళ్ళపూడి వారి తల్లిగారిని) కలవకుండా వచ్చేవారు కాదు నాన్నగారు. రాముడూ - స్ఫూర్తి అని నేన్రాసుకున్న పద్యాలు విన్న మొదట్లో నాన్నగారు బాపు రమణలకు వీలైనప్పుడు చూపిస్తే సంతోషిస్తారు అన్నారు. అది కాస్తా తీరకుండానే వీరు విజయం చేయటం....  వేటూరివారు, ముళ్లపూడి వారు మొదలైన హేమాహేమీలు, జగజ్జెట్టీలు ఇట్లా తెలుగు ప్రియులను వదిలి సుదూర తీరాలకు వెళ్ళిపోవటం అత్యంత దురదృష్టకరం....

వారి రచనలద్వారా, వారి బుడుగుద్వారా, బాపూ బొమ్మలద్వార వారు మనలకు స్ఫూర్తి కలిగించాలని ఆకాంక్షిస్తూ...

(నాకు నచ్చిన  ఈ బొమ్మ అన్వర్ గారు వేసినది. దాని లంకె ఇక్కడ)
http://www.flickr.com/photos/anwartheartist/5441482567/sizes/m/in/photostream/
వారి నుండీ లిఖిత పూర్వక అనుమతితీసుకోకుండా ఇక్కడ ప్రచురించినందుకు వారికి సభాముఖంగా క్షమాపణలు

Friday, February 18, 2011

Information Science లో నూతన శకం - IBM వాట్సన్ !!

Information Science  లో నూతన శకానికి నాంది పలికింది - IBM వాట్సన్ !!

జెపార్డీ అనే టెలివిజన్ గేం షో లో ఇద్దరు మేటి ఆటగాళ్ళతో పోటీపడి వాట్సన్ అజేయంగా నిలవడం ద్వారా ఒక నూతన
శకానికి నాంది పలికింది.  నార్త్ అమెరికా అంతటా వందలాది మంది ప్రత్యక్షంగా వీక్షిస్తుండగ వాట్సన్ ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది.

శతాబ్ది వత్సరంలో IBM నుండీ అందివ్వబడుతున్న అత్యంత ప్రతిభావంతమైన ఉపకరణం ఈ IBM వాట్సన్ !!

http://www.youtube.com/watch?v=lI-M7O_bRNg&feature=player_embedded#at=56


ఇట్సిన్క్రెడిబులమేజింగ్,
వాట్సన్స్విన్ ఇన్ జెపార్డి వస్ వర్త్వాచింగ్
హాట్సాఫ్ టుదిఎంటైర్టీం
వాట్సార్టాఫ్ ప్రైడిటీజండ్వాట్సైబీయం !!  

It's incredible, Amazing
Watson's win in Jeopardy was worth watching !!
Hats off, to the entire team,
What sort of pride it is and what's IBM.

Tuesday, February 1, 2011

త్యాగయ్య - అందుకో నా వందనాలు !!

అందరికీ త్యాగరాజ ఆరాధనోత్సవాల శుభాకాంక్షలు (ఆలస్యంగా)

యోగము చేసెనో? విమల యూహల మిమ్మనుభూతి చెందగా
యాగము చేసెనో? స్వర లయాత్మకులౌ మిము ప్రస్తుతింపగా
ఏ గరిమన్ లభించెనయ ఇంతటి తీయదనమ్ము వ్రాయగా    
త్యాగయకున్, వచింపుమయ ! దాశరధీ, హృదయాంతరాకృతీ  !!



ఏ రస వాహిని మదికిన్
తారణ మార్గమ్ము నిచ్చె, తలచెద వానిన్
కారుణ్యామృత రాశిని,
తారక నామమ్ము వాని, త్యాగయ వానిన్ !!

Thursday, January 27, 2011

పూరించిన (సమస్యా) శంఖం : శ్రీ కంది శంకరయ్య గారు


కంది శంకరయ్య గారికి పోలికలు చెప్పాలంటే "జగమెరిగిన బ్రాహ్మడు", "అలుపెరుగని బాటసారి". "నిత్య కృషీవలుడు" మొదలైనవి టపటపా వచ్చేస్తాయి. అన్నింటిలోకీ ఉత్తమమైనది మాత్రం "నిశ్శబ్ద విప్లవం".  నిర్మొహమాటం గా చెప్పాలంటే రెండొందలు పై చిలుకు సమస్యలనిచ్చినా ఇంకా ఆయన "కొత్త బిచ్చగాడే - పొద్దెరగడు". పండగలేదు పబ్బం లేదు, శనివారం లేదు ఆదివారం లేదు, సమస్యలు వస్తూనే ఉంటాయి. పూరించపోతే వెనకబడిపోతున్నామనే దిగులు పట్టుకుంటుందనటంలో అతిశయోక్తి లేదు.

ఈత నేర్చుకొనుట ఎట్లు? వంటి క్లాసులు తీస్కోకుండా ఎందరినో ఏట్లోకి దింపి, ఈత కొట్టించిన ఘనత, చెయ్ తిరిగిన ఈతగాడికి మల్లే ఫీట్లు కొట్టించిన ఘనత ఈయనదే. దిగితేనే ఈత వస్తుంది, మొదలెడితేనే రాయటం వస్తుంది. ఏదో భావాన్ని ఊహించుకుని రాసుకో అనటం వేరు. అది ఇంటర్మీడియట్, ఆపై చదువులాంటిది. అది కొందరికి అబ్బుతుంది. కానీ ఎంతోమందికి క్లాసు వర్కు, హోం వర్కు ఇస్తూ నేర్పవలసి రావచ్చు. జ్ఞానార్జన పెంచటం, సందేహాలనూ, దోషాలనూ తీర్చటం,  భాషణలెక్కువ ఇవ్వకుండా బాధ్యత తలకెత్తుకోవటం అందరికీ సాధ్యమయ్యేది కాదు.

ఒంట్లో బాగోలేకపోతే సమస్యాధార కి ఆటంకమౌతోందేమో అని చిన్నబుచ్చుకుంటారు. ఇంట్లో నెట్ లేకపోతే ఎక్కడో ఇంటర్నెట్ సెంటర్ లో కూర్చుని త్వర త్వరగా దిద్దుబాటులిచ్చేసి వెళ్ళిపోతారు. అడగనివాడిది వాడిది తప్పు అన్నట్టు అడిగిన ప్రతివాడికీ విద్యా దానం చేస్తునే ఉన్నారు, రాసిన ప్రతీ పూరణకీ స్పందిస్తారు. ఆత్మీయంగా హృద్యంగా పలకరిస్తారు. ఆడంబరాలకీ, భేషజాలకీ ఏమాత్రం తావివ్వని వ్యక్తిత్వం. అన్నీ వెరసి అన్నపూర్ణలా సుష్టుగా భోంచేయిస్తారు.

నిశ్శబ్ద విప్లవం కాస్త పెద్దమాటేమో అని అనిపించవచ్చు. అంత తెచ్చేసిన విప్లవం ఏముంది అని కూడా అనిపించవచ్చు. "నేను సైతం పద్య వీణకు కవులనే తంత్రులుగ జేస్తాను" అన్నట్టుగా చ్చిన్న చిన్న ఎక్షర్సైజులతో ఒక్కొక్కరిచేత ఇన్నేసి పద్యాలకు పూరణలు ఇప్పింపజేయటం మాటలా? బిందువు బిందువును జేరి సింధువగును అన్న దాశరథిగారి మాటలు వీరి కర్తవ్య నిర్వహణలో నిత్య సత్యాలు.

కెమిస్ట్రీ చదువుకునేటప్పుడు కేటలిస్టు అన్నది ఒకటి ఉంటుందనీ, రసాయనిక చర్యలలో దానంతట అది ఏమీ చెయ్యదు కానీ దాని సాన్నిధ్యమే చెయ్యాల్సినది చేసేస్తుందనీ చిన్నప్పుడు చదువుకున్నం. ఇప్పుడు అనుభవం తో నేర్చుకుంటున్నాం
 
ఎన్టీవోడికున్నంత ఫాన్ ఫాలోయింగు రేలంగికి ఉండకపోవచ్చు. కళామతల్లి సేవలో వారి స్థానం వారిది. కవిత్రయాన్ని, పోతననూ, విశ్వనాథనూ వివరింపకపోవచ్చు కానీ తెలుగు సాహిత్య సేవలో శంకరైయ్య గారి స్థానం వారిది.

నన్ను ప్రభావితం చేసిన వ్యక్త్యులలో శంకరయ్య గారొకరు. వారికిదే కృతజ్ఞతా పూర్వక నమస్కృతి

స్పందనమును నేర్పి పద్యాలు కూర్పించి
పూరణమ్ము లిచ్చె పుణ్య మూర్తి
ఏమొసంగగలను? ఈ పద్య పుష్పమ్ము
కంది శంకరయ్య కంద జేతు

లంకె : http://kandishankaraiah.blogspot.com/

Wednesday, January 26, 2011

గణతంత్ర దినమ్మునాడు క్షమియింపగదే?





అణువణువున దోపిడితో
క్షణమునకో కుట్రతోడ, కక్షలతో దు
ర్గుణముల వెల్గెడి బిడ్డల
గణతంత్ర దినమ్మునాడు క్షమియింపగదే ?


Tuesday, January 25, 2011

పండిట్ భీంసేను మీకు ప్రాఞ్జలు లివ్వే




దండిగ ఆలాపనలున్,
మెండుగ రాగాలు బాడు మేలౌ గానో
ద్దండా, కీర్తి ప్రచండా    
పండిట్ భీంసేను మీకు ప్రాఞ్జలు లివ్వే