Friday, February 20, 2009

రాముడూ - స్ఫూర్తి - 6 - ఉడుత.

రామాయణం లో ఉడుత ది ఒక ప్రత్యేక స్థానం. అది మనకందరికీ తెలుసు. ఆ కథ వెనుక నాకు స్ఫురించిన ఒక భావన.

రామాయణం లో ప్రధాన ఘట్టం రావణ వధ జరిగిపోయింది. తన ధర్మ సంస్థాపనా మార్గం లో సాయం చేసిన వారందరినీ ఏం కావాలో కోరుకొమ్మన్నాడుట రాముడు. జాంబవంతుడు నీతో యుధ్దం చెయ్యాలని ఉంది అన్నాడుట. అలా ఒక్కొక్కరే వచ్చి ఏవేవో కోరుకున్నారుట.

ఆ వరుసలో ఆఖర్న ఉన్నవారిని చూసి రాముడి కళ్ళు మెరిసాయిట. తనే లేచివచ్చి పలకరించాట్ట. "పూర్వ భాషీ.." కదా... ఆ ఆప్యాయతకు అక్కడున్నవారందరూ చాలా పులకరించారుట. ఇంతకీ అక్కడున్నది మరెవరో కాదు. మన ఉడుత. నీకేం కావాలి అని అడిగాడుట.

"నను పాలింపగ నడచీ వచ్చితివా... స్వామీ !! ఏమని కోరుకుందును?

మనకి అత్యంత ఇష్టమైన వారి సాన్నిధ్యం లో ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఏం తింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అన్న స్ఫురణ ఉండదు. అన్నీ కరిగి పోయిన స్థితి లో ఉంటామట కదా, అదీ తెలియదు నాకు కానీ ఏదో అనుభూతి మాత్రం మిగిలి ఉంది. ఇంతకపూర్వం మనం కలుసుకున్నప్పుడు ఏం జరిగిందో నాకు గుర్తు లేదు. అందరూ మాత్రం నేను చేసిన సహాయం చిన్నదే అయినా నువ్వు ఆప్యాయంగా నా వీపు నిమిరావనీ అప్పుడు గుర్తుగా వీపుపై మూడు గీతలు పడ్డాయనీ అంటున్నారు.

నాకు మాత్రం అది నిజం కాదేమో అని అనిపిస్తోంది. నీకు అత్యంత ప్రీతి పాత్రమైన పని చేసినప్పుడు నువ్వు ఆనందాన్ని వ్యక్త పరచే విధానం ఒకటుంటుంది. "సోదర భరత సమానా" అని హృదయానికి హత్తుకుంటావు. నేను చేసినది సహాయం చిన్నదే అయినా నీకు ఆనందం కలిగించే ఉంటుంది. వీలైనంత సహాయం చేద్దాం అనుకున్న ఆ స్ఫూర్తి కి మెచ్చి నన్ను నీ ఎడమ చేతిలో తీసుకుని కుడి చేతితో హృదయానికి హత్తుకుని ఉంటావు అప్పుడే జన్మించిన శిశువుని హృదయానికి హత్తుకున్నట్టు. అప్పుడు కలిగినవే అయి ఉంటాయి ఈ గుర్తులు. నేను ఆ ఆనందానుభూతి లో ఉన్నాను కనుకనే అప్పటి సంగతులేవీ గుర్తు లేవు. దయచేసి మరొక్కమారు గాఢ ఆలింగనానుభూతిని అనుగ్రహించవా?
పరిష్వంగానుభూతి లో ఇంకొక్కసారి ఓలలాడించవా" అని అడిగిందిట ఉడుత.

ఉ!! "శ్రీరఘు రాముడే ఉడుత సేవను మెచ్చి స్పృశింప, వీపు పై

చారలు గుర్తుగా మిగిలె! జన్మతరించె !"నటంద్రు పెద్దలున్

ఆరయ నాకు తోచె పరిహారములన్ గొని కౌగలించుటే

కారణమంచు, నీవు పసికందును గుండెకు హత్తుకోవటే !!

స్ఫూర్తి:

(1) భద్రాచలం గుడి లో ఆరగింపు జరిగే సమయం లో ఉత్తర ద్వారం దగ్గర వేచి ఉండమంటారు. అక్కడ కూర్చుని ఉన్న సమయం లో అటూ ఇటూ ఉడుతలు పరుగెడుతున్నాయి.

(2) మా నాన్న గారు ప్రతీ రోజు తన భోజనం లో మొదటి ముద్ద గోడమీద పెట్టినప్పుడు రోజూ ఒక ఉడుత వచ్చి తినేది. దాదాపు 5-6 నెలలు నేను గమనించాను. ప్రతీ రోజూ నాన్నగారి ముద్ద కోసం అది ఎదురు చూసేది. ఎంత హడావుడి లో ఉన్నా నాన్నగారు దానికి ఏదో ఒకటి పెట్టి కానీ బయటకి బయల్దేవారే కారు.

అలా గుడి లో ఉడుతల ను చూడగానే ఇంటి దగ్గర జరిగే సంఘటన, నాన్నగారు కళ్ళ ముందు ఆడారు, కళ్ళు చెమ్మగిల్లాయి. మనసు ఆనందం తో నిండగానే గుడి తలుపులు తీసారు.

రామ దర్శనం చేసుకుంటున్నపుడు కలిగిన భావన.

ఇంతకీ చెప్పనే లేదు కదూ !! మా నాన్న గారి పేరు శ్రిపతి రఘు రామ కుమార్. 'శ్రీ రఘు రాముడే' అని మొదలుపెట్టటం యాదృచ్చికమే .

Monday, February 16, 2009

ప్రహ్లాదుడు-ప్రోజెక్టు మేనేజిమెంటు

తెలుగు పద్యం లో ఉప్పు కప్పురంబు పద్యానికి ఒక చక్కని వివరణనిచ్చి భైరవభట్ల వారు ఒక కొత్త భావ స్ఫూర్తి నింపారు.

మంచి భావం మల్లె పొద పై ఆరవేసిన వేసిన ఉత్తరీయం లాంటిది. కప్పి ఉంచినంత సేపూ గాలి తెంపరలకి పరిమళం వ్యాపిస్తూనే ఉంటుంది. తీసి వేసిన తర్వాత కూడా గుప్పు మని గుబాళిస్తూనే ఉంటుంది. 'రుచి ' అన్నది వ్యాఖ్యో, రహస్య ప్రకాశమో తెలియదు కానీ గమ్మత్తు గా బాగున్నది. ఏమిటొ…. పద్యం లో సరైన సమయానికి సరైన పదం పడితే వచ్చే కిక్కు లాంటిది నాకూ వచ్చింది (కిక్కెక్కింది). అది అంతా ఆయన బ్లాగు లో రాస్తే అప్రస్తుత ప్రసంగం ఔతుంది అని మన మూస ధోరణి (రాముడూ-స్ఫూర్తి, కృష్ణుడూ-స్ఫూర్తి) ల నుండి, మంచి పద్యమూ- స్ఫూర్తి కి గేరు మారుస్తున్నా..

'చూడ చూడ 'ని వివరిస్తూ భైరవభట్ల వారు భలే విషయాన్ని ఎత్తుకున్నారనిపించింది. తెలియని విషయం ఎవరైనా చెప్పినా ఒక్కోసారి నా మూర్ఖత్వానిదే పైచేయి ఔతుంది కాబట్టి అది నిజమని నమ్మలేను అని తర్కం గొంతెత్తి అరుస్తున్నా మనసు మాత్రం ఎగిరి గంతేసింది. లింకుల లంకెలు దొరికనట్టనిపించింది. ఎందుకంటే అప్రయత్నం గా నాకు ప్రహ్లాద స్తుతి గుర్తుకు వచ్చింది.

ఇందుగల డందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు 'వెదకి చూచిన ' అందందే గలడు దానవాగ్రణీ వింటే అన్నాట్ట ప్రహ్లాదుడు. అక్కడ ' చూడ చూడ ' కీ ఇక్కడ 'వెదకి చూచుటకీ ' లింకు ఏర్పడింది.

సాఫ్ట్వేర్లో ప్రోజెక్టు మనేజిమెంటు వెలగబెడుతూ, ప్రోజెక్టు మనేజిమెంటు మీద క్లాసులు తీసుకుంటూ, ప్రహ్లాద చరిత్ర కీ సాఫ్ట్వెర్ కీ లంకె దొరికే సరికి తబ్బుబ్బైపోయి ఇక్కడ ప్రసంగిచ్చేస్తున్నా. సాఫ్ట్వేర్తో, లేక ప్రోజెక్టు మనేజిమెంటు తో సంబంధం లేని వారికి కొంచం సోది గా అనిపించ వచ్చేమో, చదువరులు నన్ను క్షమించాలి. అవసరానికి మించి విషయాన్ని సాగదీస్తూ చెప్తున్నా కొత్త బిచ్చ్గాడు పొద్దెరుగడు అన్న సామెత ను గుర్తించి మన్నించగలరు.

ఇక విషయానికొస్తే , ప్రహ్లాదుడు సెర్చ్ క్రైటీరియా చెప్పాడు. 'వాడు' దొరకాలంటే ముందు వెతకాలి. ఆ తర్వాత చూడాలి అన్నాడు. అప్పుడే కనిపిస్తాడు అని. ఏది కావాలో తెలియాలి, దాన్ని వెతకాలి, రెండూను.

ఎంతో చిన్న గా చిన్న పిల్లవాడి మాటల్లో చెప్పినట్టు చెప్పేశారు పోతన గారు. మన ఇంగిలీషు లో చెప్పలంటే necessary and sufficient condition అన్న మాట. సింపుల్ గా కంప్యూటర్ పరిజ్ఞానం లో చెప్పలంటే విండోస్ లో *.* తో సెర్చ్ చేస్తే కుప్పలు తెప్పలు గా రిజల్ట్సు వస్తాయి గానీ పని కాదు. దాంట్లో వేర్ కండీషన్ కూడా ఇవ్వాలి. కానీ ఇవ్వలంటే తెలియాలి కదా...అక్కడికి పెట్టాడు లింకు.

(పిడకల వేట 1 --> ప్రహ్లాదుడు నా దృస్టి లో ఒక మంచి ప్రోజెక్టు మేనేజరు. ఎవరైనా తనను ఒక సలహా గానీ ప్రశ్న గానీ అడిగితే,
(i) నీ బొంద నీకు ఇది కూడా తెలియదా అన్నట్టు ఒక పోజు పెట్టకుండా విన్నాడు.
(ii) విన్నతర్వాత సమస్య ని చిన్న చిన్న విభాగాలు గా విడగొట్టాడు. (WBS)
(iii) ప్రతీ చిన్న విభాగానికీ ప్రాతిపదిక ఏమిటో తెలియజేసాడు. (Pre Requisite)
(iv) ఆ విభాగానికి పర్యవసానం (Deliverable/ Exit Criteria) చెప్పాడు.
(v) ఆ వచ్చిన పర్యవసానం సరైనదే అని ఎలా నిర్ధారించటం అన్నది (Review) చెప్పాడు.
(vi) ఇది అంతా పధ్దతి (Process) లో చెప్పాడు.
(vii) అన్నిటికన్న ముఖ్యంగా వాడి పని వీడు చేసి పెట్టెయటం కాకుండా, తనంత తాను ఎలా చేసుకోవాలో చెప్పాడు. (Self reliance, not spoon feeding). సాప్ట్వేర్ టెర్మినాలజీ లో చెప్పాడు.

ఏమిటిట అవి అంటే

(1) ఏది కావాలి?
(2) ఎలా వెతకాలి?
(3) కావల్సిందే వెతికామనీ, వెతికినదే దొరికింది అని ఎలా నిశ్చయించాలి?

ఇవి దానిలో ఉన్న ప్రశ్నలు.

సరే. ముందు పరిధి ని నిర్ణయిద్దాం (Scope Definition చేసారు). ఎలా ఉంటాడు హరి? చెప్పు ఇవ్వళ తాడో పేడో తేల్చేద్దాం అని అడిగాడు హిరణ్యకశిపుడు. పాపం చిన్న పిల్లవాడాయె. ఆదిత్యుల్లో విష్ణువులా, నక్షత్రాల్లో చంద్రుడిలా, వేదాల్లో సామవేదం లా, పాములలో వాసుకి లా, అక్షరాల్లో అకారం లా ఉంటాడు అని ఏo చెబ్తాడు? చెప్పినా వీడికి అర్ధం ఔతుందా. Simplify చేసి నీలో నీలా ఉంటాడు, నాలో నాలా ఉంటాడు అన్నట్ట ప్రహ్లాదుడు. తిక్కరేగింది హిరణ్య కశిపుడికి. ఇక పైవన్నీ చెప్పి ఉండి ఉంటే జుట్టు పీక్కుని ఉండెవాడు. (పిడకల వేట --> 2 తెలిసిన వాడు నాకు తెలుసు కదా అని పాండిత్య ప్రకర్ష చూపించక వీలున్నంత తెలికగా పామర రంజకం చెప్పలి). కొన్నిటిని క్లిష్టంగా complicate చేస్తేనే మనసుకి హాయి గా ఉంటుంది అర్ధం కాకుండా వదిలెయ్యటానికి. ఔను. అరటి పండు ఒలిచినట్టు సులభం గా చెప్పేస్తే మహ ఇరకాటం గా నమ్మ శక్యం కానట్టు గా ఉంటుంది. బ్రహ్మ విద్య ఇంత వీజీ నా అన్నట్టు ఉంటుంది. హిరణ్య కశిపుడికి నచ్చలేదు. Scope సంగతి వదిలెయ్యి. ఎక్కడుంటాడో చెప్పు. డైరెక్టు గా ఎటాకిచ్చేద్దాం అన్నాట్ట. ఇక్కడా అక్కడా అని లేదు ఎక్కడైనా ఉంటాదు అన్నాట్ట ప్రహ్లాదుడు. మళ్ళీ తిక్క రేగింది.

సరైన దారిలో వెళ్ళే వాడయితే ‘జ్యోతి సె జ్యొతి జలావో’ అన్నట్టు ప్రశ్న నుంచి ప్రశ్న కి అనుసంధానం చేసుకుంటూ ముందు కెళ్ళే వాడు. ఫరీక్షిత్తు వెళ్ళలే..? అలానె. కానీ హిరణ్యకశిపుడు కూడా కొంచం ఇప్పటి వాళ్ళ టైపు. ఆట్టే టైం వేస్టు వద్దు. పాయింటుకొచ్చేద్దాం అనుకుంటూంటాడు. (preparation లేదు, analysis లేదు. Result oriented).

పాపం ప్రహ్లాదుడు మాత్రం ఏం చేస్తాడు? ‘వాడిని’ వివరించాలంటే వాడికంటూ ఏమీ లేదుట. వాడు అవ్యక్తుడు. నిరాకారుడు. వేదాలు కూడా వాడిని - ఆ పురుషుణ్ణి పూర్తి గా స్తుతించి చివర్లో లక్ష్మీ దేవి భర్త అయినవాడెవడొ వాడు అన్నర్ట. ఎర్ర చీర కట్టుకున్నావిడ నా భార్య అన్నట్టు. (నవ్వొచ్చేట్టు గా ఉన్నా ఇది సత్యం. వాళ్ళు అలానే అన్నారు. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అని) వాళ్ళూ మాత్రం ఎం చెస్తారు? వాడిని డిఫైన్ చేయటానికి ఏ ప్రొపర్టీ (లక్షణం) వాడినా అది ఆవిడదే కానీ వాడివంటూ ఏమీ లెవుట. నల్లని వాడు అంటే శరీర చాయ = నలుపు అనే ప్రొపర్టీ ఉన్నవాడు అనీ అన్నట్టు. అందుకే కదా సౌందర్య లహరి లో "నిన్ను పెట్టుబడి గా పెట్టి శివుడు ఈ జగాన్ని మొత్తం నడుపుతున్నాడు. నువ్వే లేకపోతె ఏదీ చెయ్యలేడు అని" శంకరాచార్యుల వారు అన్నది.

సరే ఇది కూడా తేలేలా లేదు. నీకు కనిపిస్తున్నాడా? ఏది నువ్వు చూపించు అన్నాడు. హిరణ్యకశిపుడు. Activity- Role-Responsibility- తెలియకుండా. తీరా కనిపించాక ఏం చెయ్యాలి? పిలిచి భోంచెయ్యలా? మందీ మార్బలాన్ని పిలవాలా? ఒక్కడే వెళ్ళలా? అన్నది ఏమీ ఆలోచించలేదు. కనీసం మామూలు మనిషి గా లేడు, స్తంభం లోనుంచీ వచ్చాడు. అసలు ఇక్కడెలా ఉన్నాడు అని root cause analysis లేదు.పోనీ హిరణ్యాక్షుడి విషయం లో జరిగినది అయినా గుర్తుండాలి కదా (Historical data/ pattern/ analysis). అదీ లేదు.

ఎవరికైనా భూమ్యాకర్షణ అర్ధం కావాలంటే ముందు అయస్కాంతాన్ని, ఇనుప ముక్కల మధ్య సంబంధాన్ని చూపించి ఆతర్వాత అదే సిధాంతం భూమి కి కూడా పనిచేస్తోంది అని చెబితే అర్ధం ఔతుంది. కానీ హిరణ్య కశిపుడు నాకు 10 వ తరగతి లెక్కల్ని డైరెక్టు గా చెప్పు అని అడిగాడు. (పిడకల వేట--> 3 ఈ మధ్య యాడ్ లో హాల్ల్స్ పిప్పరమెంటు ఎంత చల్లగా ఉంటుంది అని ప్రశ్న కి విమానం లో నుంచీ తల బయటకి పెట్టి చూపించినట్టు చూపించాలి). అదే చేసాడు ప్రహ్లదుడు.

ఇంతలో ఆవేశం తో స్తంభాన్ని చీల్చాడు హిరణ్య కశిపుడు. లోపల నుండీ, ఒక వింత రూపం తో విష్ణుమూర్తి వచ్చాట్ట. అప్పటికైనా మనం వెతుకుతున్నదీ, ఇదీ ఒకటెనా అని తన్ను తాను ప్రశ్నించుకోలేదు.(Verification) వీడేనా ఆ శ్రిహరి అని పక్కనున్న కొడుకును అడగలేదు. (Velidation). హిరణ్య కశిపుడు మాత్రం ఊగిపోయాడు. బ్రహ్మని అడిగి వరాలతో Risk Mitigation చేసేశాను అనే అనుకున్నాడు. కానీ ఇక్కడ అది fail అయ్యింది, వెంటనే ఏం చెయ్యాలి అని ఆలోచించ లేదు. ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో చూసుకోకుండా మీద పడ్డాడు. (crisis management) లేదు.

గుడ్డ లో మంచి గంధం మూత కడితే మంచి గంధం వాసన వస్తుంది. మల్లె పూలు కడితే మల్లె పూల వాసన్ వస్తుంది. ఇంగువ కడితే ఇంగువ వాసన వస్తుంది. నిప్పు కణిక కడితే?? ఇది అదైపోతుంది. తెలుసుకుందాం తెలుసుకుందాం అనుకుంటూ వీడు వాడిలో ఐక్యం అయిపోయాట్ట. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే..
నృసింహావతారాన్ని చూడంగానే ప్రహ్లాదుడు కిందా మీదా పడి పోలేదు ట. అదెమిటి? అంత ఉగ్ర రూపం, ఎవ్వరూ ఊహించనట్టు గా వస్తే చిన్న పిల్లవాడు భయపడి పోలేదా అంటే వాడు Risk Management చేసాడు. (Expect the most Unexpected). స్తుతించాట్ట.

ఇప్పుడు కధా వస్తువు ని మొత్తం తీసేసి (అంటే హిరణ్య కశిపుడినీ, ప్రహ్లాదుడినీ పక్కకి పెట్టేసి) జరిగినదీ , జరగుండాల్సినదీ చూడండి. తప్పొప్పుల పట్టిక తయారౌతుంది. అదే Lessons learnt.

Project Management లో Scope తో మొదలెట్టి Analysis, Design, Testing, Quality Management, Risk Management, Communication Management, Project Closure తో సహా అన్నివిభాగాలనూ స్పృశిస్తూ వివరించాడు. దారి చూపించాడు. కాలక్షేపానికి అడగటం కాకుండా ఆర్తి తో అడిగితే బోధ పడే విద్య ఏమిటొ రుచి చూపించాడు.

భగవంతుణ్ణి తెలుసుకుందాం అన్న ఒక చిన్న ప్రోజెక్టు లో హిరణ్య కశిపుడికి అడుగడుగునా తప్పులే.

భగవంతుడు ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు? ఎలా గుర్తించాలి? ఎలా నిర్ధారించాలి? వెతకటానికి మనం వెళ్తున్న దారి సరైనదేనా? అలా అని నమ్మకమేమిటి? ఎందుకు వెతుకుతున్నాం? దొరికిన తర్వాత ఏం చెద్దాం? ఇవి పరి ప్రశ్న లు. హరి ఎక్కడ అన్న ప్రశ్న కి. ప్రహ్లాదుడు దానికి దారి చూపించాడు. తద్విధ్ధి: ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని.

చేసున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నట్టు ఎవరైతే ఈ అంతరార్ధాన్ని తెలుసుకున్నారో వారికి చిక్కింది వాడి లీల. అర్ధం చేసుకోక ఆయాసపడ్డాడు హిరణ్య కశిపుడు.

కధని ఇలా నిష్పాక్షికం గా విశ్లేషిస్తే, ఐ.ఐ.ఎం లలో,హార్వర్డ్ ల లో వీటినే కేసు స్టడిలంటారు, ఎక్కడైనా కేసు స్టడిలు ఇలానే చేస్తారు. జరిగిన సంఘటనల లో నుంచీ, వ్యక్తుల అభిప్రాయాలు, వ్యక్తిత్వాలు, పరిస్థితులకు అనుగుణం గా తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రభావం వల్ల కలిగిన మార్పు, అది ఏ విధం గా సిధ్దాంతీకంచవచ్చు అని సమాలోచన చేసి పాఠ్యాంశాలు గా నిర్ణయిస్తారు.

ఇంతటి మహోన్నతమైన బాధ్యతని పిల్లలు బడికి వెళ్ళే వయసు రాక ముందే అప్రకటితం గా అలవరచే వారు తల్లి దండ్రులు చిన్న పిల్లలకు నీతి కధలు వినిపిస్తున్నట్టు గా.

అనాది గా వస్తున్న ఇటువంటి మన సాంప్రదాయం ఇంకా కొనసాగాలంటె, పోగో, పవర్ రేంజర్ ల ధాటి లో కొట్టుకు పోకుండా నిలబడాలంటె, మనం ముందు వాటిని సరైన దృక్పధం తో అర్ధం చేసుకోవాలి, ఇప్పటి వారి ధోరణి కి అప్పటి విషయాలను నూత్న రీతిన చెప్పగలగాలి.

"నేను సైతం విశ్వ వీణకు తంత్రినై.." ఆ దిశ గా నేను వేసిన తొలి ఆడుగు ఇది. చిన్ని ప్రయత్నం.
పెదరాయుడు సినిమాలో గ్రామర్ లో తప్పులుంటే మన్నించు. అసలు భావమే తప్పనుకుంటే క్షమించు అని...అన్నట్టు.
తప్పులుంటె మన్నించి సరిజేయండి. బోరు కొట్టుంటే క్షమించండి.

ఈ దిశ గా 'బుధ్ధి ప్రచోదన 'మవ్వటానికి కారణ భూతులైన భైరవభట్ల వారికి నమస్సుమాంజలి.
ఓపిక తో చదివిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

మీ
శ్రీపతి సనత్ కుమార్

భైరవభట్ల వారూ !! సందర్భోచితంగా సవితృ మండలాంతర్వర్తి తో గ్రీటింగ్... ఇది మీకే...


Saturday, February 14, 2009

సౌందర్య లహరి - స్ఫూర్తి -2

శ్లోకం.
అవిద్యానాం అంతస్తిమిర మిహిర ద్వీప నగరీ
జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరీ
దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ
నిమగ్నానాం దంష్ఠ్రా మురరిపు వారాహస్య భవతి !!

పద్యం.
అరిషడ్వర్గ మదాంధకారమును పారంద్రోలు మార్తాండమున్
పరమున్ జూచు అచేతనాళికి మరందానంద నిష్యందమున్
శరణున్ గోరు భవాబ్ధి మగ్న జనునుధ్ధారించు దంష్ఠ్రంబునౌ
వరలక్ష్మీప్రద పాదరేణువులు చింతల్దీర్చి సౌఖ్యమ్మిడున్ !!

Thursday, February 12, 2009

కొంటె కృష్ణుడు -స్ఫుర్తి - 2



గోకులం లో రాత్రి ఒక ఇంట్లోకి ఒక పిల్లి చొరబడింది ట. చప్పుడు చెయ్యకుండా వంటింటికి వెళ్ళి, కళ్ళు మూసుకుని పాల కుండ లో పాలు తాగుదాం అనుకుంది ట. నాలుకకి పాలు తగల లేదు. కళ్ళు తెరిచి చూసేసరికి కుండ ఖాళీ గా ఉంది ట. ఇదేమిటబ్బా అనుకుంటూ వెనక్కి చూసే సరికి అక్కడ ఒకావిడ దీనికేసి అనుమానం గా గుడ్లురిమి చూస్తోంది ట. అయ్యొ అదెమిటి? నేను ఇంకా ఏమీ చెయ్యందే.. ఈవిడ నన్ను అనుమానిచ్చెస్తోంది? అని అటూ ఇటూ చూసిందట. ఆప్పుడే తలుపు చాటున ఒక తెల్ల మీసాల పిల్ల వాడు కనిపించాట్ట. అప్పటికి గానీ అర్ధం కాలేదు.. ఎంత పెద్ద గోతిలో పడిందో.. వార్నీ.. ఎంథ పని చెశాడు? ఆ పిల్ల వాడినే చెవి మెలేసి రోటికి కట్టింది ఈవిడ. అల్లంటిది, వాడికి లేకుండా పాలు నేను తాగేను అని కనక అనుమానించిందంటే ఇంక నా పనేం గానూ...అని ఒకటే ఇది అయిపోతోంది ట. దానిని చూసి ఆ పిల్ల వాడు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నాట్ట.
పద్యం
బాలుడు చెప్పడాయె ! తన భావము మాతకు తెల్వదాయె ! ఆ
పాలును లేకపోయే ! అనుమానము మాత్రము నిల్చిపోయే ! మా
ర్జాలమునౌట నాదు అపరాధమటంచు తలంచు పిల్లినిన్
లీలగా జూచి నవ్వు మధు సూదనుడిచ్చుత సర్వ సంపదల్ !!


పద్య స్ఫూర్తి

ఈ క్రింది తిరుపతి వెంకట కవుల పద విన్యాసం నచ్చి అనుకరిస్తూ రాశా అని అనుకుంటున్నా.. (యతి మైత్రి విషయం దక్క....)

వేసవి డగ్గరాయె ! మిము వీడుటకున్ మనసొగ్గదాయె ! మా

వాసము దూరమాయె ! బరవాసము చేయుట భారమాయె ! మా

కోసము తల్లిదండ్రులిదిగో యదిగో యని చూచుటాయె ! వి

శ్వాసము కల్గి వే సెలవొసంగిన పోయెదమింక భూవరా !!

Sunday, February 8, 2009

సౌందర్య లహరి - స్ఫూర్తి -1


శంకర భగవత్పాదుల సౌందర్య లహరి శ్లోకానికి స్ఫూర్తి పొంది నేను రాసిన తెలుగు పద్యాన్ని మన్నించగలరు (అనువాదం కాదు సుమా...)

రాముడూ స్ఫూర్తి అని నేను రాస్తున్న టపాల లో మధ్య ఇది రాయటానికి వెనుక రెండు కారణాలు ఉన్నాయి.

(1) తెలుగు తేజం రాఘవ గారి బ్లాగ్పఠనం తో నాకు నిన్న రాత్రి జాగరణ అయ్యింది. ఆయన రాసిన పద్యాలు రామానుభూతి కై, రామ దర్శనార్థమై పరితపించే 'నాదు జిహ్వకున్ పానకమయ్యె '. వారి భక్తి, వాక్పటిమ నాలో స్ఫూర్తి కలిగించాయి. వారికి అనేకానేక నమస్సులు. ఇక్కడ ప్రస్తావిస్తె పులిని జూసి నక్క వాత పెట్టుకున్న చందం గా ఉంటుందేమో ... కానీ .. ఆయన అంధ్రీ కరణ పద్యాలు చదివి ఉత్సాహం ఉరకలెత్తింది. కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు కదా.. అందుకే దూకా..(తప్పో ఒప్పో నేర్చుకోవచ్చు కదా చిన్నవారైనా విద్యాధికులైన వారి వంటి వారి నుండి అని...)

(2) నా మిత్రులు నీ టపాల్లో రాముడు మంచి బాలుడు అనే కోవకెనా ఇంకేమైనా కూడా ఉంటయా? పైగా కృష్ణుడి బొమ్మ పెట్టావు రాముడి గురించి రాశావు .. అని భీష్మ ఏకాదశి నాడు అడిగినప్పుడు నేను ఎప్పటికీ నా హృదయ రాముడు రాముడే.. స్మిత వక్త్రో మితా భాషీ పూర్వ భాషీ కదా..(I feel, I am some how obsessed with Rama) అందుకే నా దృష్తి లో రాముడు ఎప్పటికీ మంచి బాలుడే. కృష్ణుడు కొంటె కోణంగె. ఇద్దరూ నా హృదయ నాథులే అయినా రాముడంటే ఒక సాఫ్ట్ కార్నర్.

అయినా ఆ అపవాదు మాత్రం ఎందుకని కొంటె కృష్ణుడి గురించి కలిగిన ఒక భావం రాశా. (ఇది చిరంజీవి శ్రీమాన్ రాఘవ గారికి ఆశీస్సులు గా భావించి రాస్తున్నావారి అమ్మ పద్యాలకి ముగ్ఢుణ్ణై ... 22 ఏళ్ళ చిరుత ప్రాయము వారు అనుకుంటూ...)

నా బ్లాగు పేరు లోనే సూచించినట్టుగా నేను ఈ పద్యాల 'రాత ' బడిలో ఎల్.కే.జీ. చదువుతున్న చిన్న పిల్ల వాడిని. ఎప్పటి లాగా నే యతి నియమోల్లంఘన ను పెద్ద మనసుతో క్షమించెయ్యండి. మంచి పద్యాలు కొంచం కొంచం గా ప్రత్నించి తొందరలో నే నేర్చుకుని, రాసే ప్రయత్నం చేస్తా..


సౌందర్య లహరి శ్లోకం.

शरज्ज्योत्स्ना शुध्धाम शासियुत जटा जूट मकुटाम

वरत्त्रसत्त्राण स्फटिका घटिका पुस्तक कराम

सक्क्रुन्नात्वा नत्वा कथमिव सतां सन्निदधते

मधु क्षीर द्राक्षा मधुरि मधुरीणा: परिणत:


సౌందర్య లహరి శ్లోకం.

శిర మకుటంబు చంద్రుడు శరదృతు వెన్నెల దేహకాంతి ! శ్రీ

కరముల పుస్తకంబు వరదాభయముల్ స్పటికాక్ష మాలయున్

వర ధరియించి మ్రొక్కిడిన వారికి పాలును, ద్రాక్ష, తేనియున్

వరముగ వాక్కు నందు నిడు తల్లి కృపన్ గను నెల్లవేళలన్ !!


ఇక కొంటె కృష్ణుడి విషయానికొస్తే..

గోకులం లో పిల్లల అల్లరి ఎక్కువయ్యింది ట. ఆందరూ చాడీలు చెబుతూంటె ఇక లాభం లెదు అని తల్లి అనుకుందిట.


ఫద్యం.

బాలుని పట్టి తెచ్చి నొక రోటికి గట్టె యశోద ! బాలుడున్

కాలు కదల్చనెంచి నొక వేలును చూపగ తల్లడిల్లుచున్

మాలిమి తోడ బల్కె "మము గాచుటకున్ గిరి నెత్తినట్టి నీ

కేలుకు రక్ష శ్రీ హర"ని, అట్టి యశొదయె మీకు రక్షగన్ !!


అల్లరి పిల్ల వాడు చిటికిన వేలు చూపిస్తే ముడి విప్పేస్తుంది కదా అని తప్పించుకో జూచాట్ట. ఆవిడకి మాత్రం ఎంత పెద్ద కొండని మోసేసాదో నా బంగారు కొండ, ఎంత కష్టమయ్యిందో అని ఎప్పుడూ బుగ్గలు ఒత్తుకుంటూ అనుకుంటూంటుంది ట. అల్లాంటిది పిల్లవాడు వేలు చూపెట్టగానే.. ఇక పరుగు పరుగున వచ్చి కౌగలించుకుని "అయ్యొ వెర్రి నాగన్నా... నీకు నెప్పి ఇంకా తగ్గలేదా నాయనా ' అంటుందిట. అప్పటి దాకా వాడు చేసిన అల్లరి అంతా హుష్ కాకి.....అంతటి ప్రేమాప్యాయతలు ఒలకబోసే తల్లి యశోద మీకు రక్ష యగుగాక. !

చిన్న పాటి వివరణ.

పిల్ల వాడిని రోటికి కట్టింది చిన్నప్పుడూ, గోవర్ధన గిరి నెత్తింది కొంచం పెద్దైన తర్వాత కదా అని ఎవరికైనా సందేహం కలగచ్చు. పోతన గారు కృష్ణుణ్ణి యశోద ఒక్క సారి మాత్రమే కట్టింది అని చెప్పలేదు కదా.. కృష్ణుడు తర్వాత ఎప్పుడైన అల్లరి చేసి ఉంటె చెవి మెలేసె కూడా ఉండచ్చు.

Saturday, February 7, 2009

రాముడు - స్ఫూర్తి - 5 - తాటాకు.

అశొకవన ప్రస్థానం లో తాటాకులకు కూడా ఇంకొక ప్రత్యేక స్ఠానం ఉంది.

పుంసాం మోహనరూపాయ కదా.... ఎవరికి వారు రాముడిని ఎప్పుడెప్పుడు చూస్తాం.. రాముడికి ఏ విధంగా సేవ చేయగలం అని నిరంతరం ఎదురుచూస్తున్నారుట. శబరి, కబంధుడు, జటాయువు, సంపాతి ఎవరికి వారు తమకు చేతనైన సేవ చేసుకున్నారు. అదే బాటలో ఒక చెట్టు కూడా అనుకుందిట.

"రావణుడు ఈ మార్గం లోనే కదా వెళ్తున్నాడు. వాడిని ఏదో ఒక విధంగా ఆపి తీరాలి" అని అనుకుంది ట తాటి చెట్టు. చాలా ఎత్తుకి ఎదిగిందిట ఆపుదామని. కానీ రావణుదు ఇంకా ఎత్తు గా ఎగిరిపోయాడుట. అయ్యో .. 'పత్రం, పుష్పం, ఫలం, తోయం' వేటితోనైనా నీకు దగ్గర కావచ్చు కానీ, నాకా పుష్పాలు లేవు, తోయమా పవిత్రం గా భావించ బడదు.. పత్రాలా ఫెళ ఫెళ లాడుతూంటాయి. అందుకే చాలా ఎత్తుకి ఎదిగా.. ఆపుదామని కానీ ఏం లాభం? ఫలితం శూన్యం. ఇక నీ సేవ చేసే భాగ్యము ఇక లేదే అని ఎంతో బాధ పడిపోతోందిట.

దానికి ఊరట కలిగించటానికి రాముడు ఇక ఏ చెట్టుకూ లేని ప్రత్యేకత దానికి సంతరింపజేసాట్ట. ఆ వృక్షపు పత్రాలనే వింజామరలుగా వాడుకున్నాట్ట. అవే విసన కర్రలు. లేకపోతే రాముడి వంటి మహా రాజుకు వింజామరలను అందించే అవకాశం ఉండేది కాదు కదా..

పద్యం.

రావణుడీ పథాన మహిజన్ గొని లంకకు పోవునప్పు డే
దో విధి వాని నాపవలెనంచు తలంచియు చేయనైతి. మీ
సేవను చేయు భాగ్యమిక లేదొకొ యంచు తలంచు వృక్షమున్
బ్రోవగ గాదె పత్రమును ప్రేమతొ గొంటివి చామరంబుగన్ !!

స్పూర్తి: (1) భద్రాచలం లో తాటాకు పందిళ్ల లో జరిగే రామ కళ్యాణం చూచినప్పుడు కలిగిన భావం. నా వరకు నాకు రామ కళ్యాణానికి తాటాకు పందిళ్ల తో వచ్చే కళ ఏ ఐదు నక్షత్రాల పెళ్ళి మంటపం లోనూ కనపడదు.
(2) తాటి చెట్టల్లే ఎదిగావు కానీ ఏం లాభం అని దెప్పిపొడుపు సాధరణం గా వింటూంటాం కదా.. దాని వెనుక కరణం ఏమైనా ఉంటుందా.. ఆ మాట వింటున్నప్పుడు తాటి చెట్టు మనో భావన ఎలా ఉంటుందో అని ఒక ఆలొచన.

Thursday, February 5, 2009

రాముడు - స్ఫూర్తి -4

సీతా వియోగాన్ని గురించి తలచుకొన్నప్పుడు, రాముడు పడ్డ ఆవేదన విన్న ఎవ్వరైనా కళ్ళు  చెమర్చక తప్పదు. 13 ఏళ్ళు పరస్పరం ఒకరికి ఒకరు గా సుఖ దు:ఖాల్లో చెరి సగం పంచుకుంటున్నప్పుడు సీతా వియోగం సంభవించే సరికి రాముడు బాగా చలించిపోయాడు.

జానకి ని వెదుకుతూ చెట్లూ,పుట్టలూ, కొండలూ, కోనలూ, నదులూ, అరణ్యములూ... అన్నీ వెదికాడు. "సీతా..సీతా.." అని ఎలుగెత్తి పిలిచాడు. రాముడు భూమి నేల నాలుగు చెరగులా వెదికాడు.. ఒక్క రాముడెనా.. లక్ష్మణుడు, సమస్త వానర సైన్యం వెదికింది.... 

మైథిలికి మాత్రం తెలుసు, తాను ఎక్కడికి కొని రాబడినదో..అందుకే అక్కడే రాముడికై నిరీక్షిస్తూ.. రాముడినే స్మరిస్తూ ఉండి పోయింది.

రాముడు పిలిచిన ఆ పిలుపు నేల నాలుగు చెరగులా మంత్రమై నిలిచిపోయింది. 'మననాత్  త్రాయతే ఇతి మంత్ర:' కదా 

ఈ కారణం చేతనే సీతాఫలం చెట్లు ఎక్కడ పడితే అక్కడ, అన్ని చోట్లా  కనిపిస్తాయి. రామాఫలం మాత్రం చెట్లు బహు అరుదు గా కనిపిస్తాయి. లంక లో మాత్రమే కదా సీతా దేవి పిలిచిన పిలుపు/ స్మరణ వినబడినది...

అవనిజ పేరు బిల్చుచు నరణ్యములందు పరిభ్రమించె రా
ఘవుడు ! మహీజ మాత్రమొక చోటనె రాముని తల్చుచుండె ! నే
డవగతమయ్యె సీత ఫల వృక్షములెందుకు ఎన్ని యున్నవో 
భువనము నందు ! రామ ఫల వృక్షములన్నియు వేళ్ళ లెక్కలే !!

(యతి నియమోల్లంఘనమైనందులకు క్షమించగలరు)  

స్పూర్తి: లాంచీ పట్టి సీమ, పేరంటాల పల్లి లో ఆగినప్పుడు గిరిజనులు తట్టల తో అమ్మకానికి తెచ్చిన సీతాఫలం పళ్ళు చూసినప్పుడు 'తట్టిన ' అలోచన.   

Wednesday, February 4, 2009

రాముడు - స్ఫూర్తి -౩ - గడ్డి పోచ.

గడ్డి పోచ
~~~~~~~
రామాయణం లో గడ్డి పోచకి ఒక భూమిక ఉన్నది. కాకాసుర వధ, ఆశోక వనం ....మొదలైనవి దానికి నిదర్శనం. తరచి చూస్తే నాకు ఈ విధంగా అనిపించింది.

ఆశోక వనం లో ఉన్నప్పుడు రావణుని తో సంభాషించే ప్రతీ సారీ సీతా దేవి ఒక గడ్డి పోచని అడ్డుపెట్టుకున్నదట. దీనికి "నీవు గడ్డి పోచ తో సమానం" అని ఒకరూ, "పర పురుషునితో పతి వ్రతలు ముఖాముఖి సంభాషించరు" అని కొందరు భావం చెబుతారు. కానీ నాకు ఇంకొక అంతరార్ధం ఉందేమో అని అనిపిస్తోంది.

సాధారణంగా మనకి గ్రహణం కొద్ది సేపే అని తెలుసు. అందుకనే గ్రహణ సమయం లో మైల అంటకుండా దేవతార్చన విగ్రహాల మీద, పచ్చళ్ళ మీద, పాలు, పెరుగు మీద దర్భలు వేసి ఉంచుతాం. అపవిత్రత అంటకూడదని.
రావణుడు మహా శివ భక్తుడు. నిష్ఠా గరిష్ఠుడు. వేద వేదాంగాల్లొ నిష్ణాతుడు. కానీ ఒక్కటే దుర్లక్షణం. "పర స్త్రీ వ్యామొహం.".

సీతమ్మ వారితో మాట్లాడడానికి వచ్చిన ప్రతీ సారీ ఆవిడ "ఎంతో మంచి వాడు. ఇలా అయిపోయాడే... తెలివినీ, శక్తి సామర్ధ్యాలనూ సత్కర్మాచరణకు వినియోగించుకుని సార్థకత పొందక, బుధ్ధి కి గ్రహణం పట్టిన సమయం లో తెలియక తప్పు చేసాడు. ఈసారి పశ్చాత్తాపం తో మారిపోయి వస్తున్నట్టున్నడు. ఆ మైల అంతా వెంఠనే పోవాలి. మరింత మైల పడిపోకుండా ఉండాలి" అని దర్భ తీసుకుని సిధ్ధం గా ఉందిట - బడి నుండీ తిరిగి వచ్చే పిల్లవాడి కోసం ఫలహారం చేసి వీధి గుమ్మం లో ఎదురు చూసే తల్లి లాగ.

తప్పు దారిన పోయే పిల్లవాడు తొందరగా తన తప్పు తెలుసుకుని, మారి, తండ్రి ఆశీస్సులు పొందాలని ఎక్కువ శ్రధ్ధ తీసుకునేది తల్లే కదా...

అహిత పథమ్ములందు చను బిడ్డకు దర్భను చూపి "బుధ్ధికిన్
గ్రహణము పట్టెనేమొ ! కడు ఘోర అఘమ్ములనన్నిటిప్పుడే
రహితము చేసుకొమ్మనుచు" రావణు కివ్వదలంచె ! బాధలో
సహితము మాతృ మూర్తి సహనమ్మును జూపదే ! సర్వవిజ్జయీ !!!

Sunday, February 1, 2009

రాముడూ - స్ఫూర్తి -2

రాముడు అడవి లో పయనిస్తూంటే ఒక సంఘటన జరిగిందిట. అది ఇరు ప్రాణుల మధ్య సంభాషణ. అందులోనూ తల్లీ పిల్లల సంభాషణ.
" పిల్లలు అమాయకులు. పసితనం వీడి పోలేదు. రాముడు గనక స్వీకరించక పక్కన పెట్టేస్తే మిగిలిన వారితో పోల్చుకుని తామేం తక్కువ చేసాం అని మనసులో నొచ్చుకుంటారు. తాము పుల్లగా ఉన్నామన్న నిజాన్ని గుర్తించలేని పసి హృదయం కదా.. ఉడుకుమోత్తనం తో బుంగ మూతి తో బాధ పడతారేమో" అని తన పిల్లలని హృదయానికి హత్తుకుని పట్టుకుని ఉన్నదట. పండి పోయినా రాలిపోనీయకుండా...
అయితే ఆ పిల్లలు అమాయకులేం కాదుట.
అయ్యో.. ఒక వేళ మనం పుల్ల గా ఉన్నాం కదా అని రాముడు గనక తినకుండా మనని పక్కన పెట్టేస్తే , "నా కడుపున పుట్టటం వలన కదా వీరికి రామ స్పర్శానుభూతి లేకపోయిందే " అని తల్లి మనసు నొచ్చుకుంటుందేమో అని పండి పోయినా సరే నేల రాలి పోకుండా ఆ తల్లి ని అలాగే హృదయానికి హత్తుకునే ఉండిపోయాయిట. తల్లి బాధ పడకూడదని పిల్లలు.. పిల్లలు బాధ పడకూడదని తల్లీ... ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూ బాధ తెలియకుండా హృదయానికి హత్తుకుని ఉండిపోయాయిట. అన్యోన్యత్వం...
పరస్పరం భావయన్తః పరస్పరం బోధయన్తః

ఇంతకీ ఆ తల్లి ఎవరో తెలుసా.. "నేరేడు చెట్టు". రాముడు ఈ అన్యోన్యత్వానికి ముగ్ధుడైపోయాడు. అందుకే మరు జన్మ లో "కృష్ణ వర్ణం ఎంచుకున్నాడేమో ...

ఇంతటి 'ఉన్నతమైన' భక్తీ భావం ఉంది కనుకనే పళ్ళ చెట్లలో చాల 'ఎత్తుకు' పెరిగే చెట్టు కూడా నేరేడు చెట్టు మాత్రమె....